Showing posts with label ఎడిటర్స్ వాయిస్. Show all posts
Showing posts with label ఎడిటర్స్ వాయిస్. Show all posts

Thursday, January 14, 2010

శుభాకాంక్షలు


నారదలోకం వీక్షకులకు
సంక్రాంతి శుభాకాంక్షలు


Wednesday, November 4, 2009

ఎడిటర్స్ వాయిస్: `వందేమాతరం' పాడొద్దంటారా?


జాతీయగేయం `వందేమాతరం' పాడవద్దంటూ ముస్లీం మతాధికారుల అత్యున్నత సంస్థ `జమైత్ ఈ ఉలేమ హింద్' (జెఈయు) తీర్మానించింది. ఉత్తరప్రదేశ్ కు ఈశాన్యంగా, ఢిల్లీకి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవ్ బంద్ లో జెఈయు జాతీయ 30వ సర్వసభ్యసమావేశం నవంబర్ మూడున జరిగింది. ఈ సమావేశానికి దేశం నలుమూలల నుండి పదివేల మంది ముస్లీం మత పెద్దలు హాజరయ్యారు. గతంలో (2006లో) దారుల్ ఉలూమ్ ముస్లీంలు వందేమాతరం గేయాన్ని పాడకూడదంటూ జారీ చేసిన ఫత్వాను ఈ సమావేశం ఆమోదిస్తూ తీర్మానించింది. వందేమాతరం గేయంలోని కొన్ని పంక్తులు ఇస్లాం మతభావాలకు విరుద్ధమని సమావేశం ఏకగ్రీవంగా అభిప్రాయపడింది. వందేమాతరం విధిగా పాడాలని ఎవ్వరూ బలవంతం చేయకూడదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును వీరు ఉటంకించారు. వందేమాతరం అంటే తల్లికి నమస్సరించడమే అవుతుందనీ, తమ మతంలో తల్లికి నమస్కరించడమన్నది ఉండదనీ, తాము తల్లిని ప్రేమిస్తామేకానీ, ఆరాధించమని ఈ సంస్థ మతపెద్దలు తేల్చిచెప్పారు. ఏకేశ్వరోపాసనపట్ల తమకున్న విశ్వాసాన్ని చెల్లాచెదురు చేసేలా ఈ జాతీయగేయం ఉన్నదని వారంటున్నారు.
ఇదే సమావేశానికి కేంద్ర హోం మంత్రి చిదంబరం హాజరవడం మరో వివాదాస్పద అంశం. వందేమాతరంపై జెఈయూ తీర్మానాన్ని ఆమోదించిన కొద్దిగంటల్లోనే చిదంబరం అక్కడకు చేరుకుని ఇస్లాం మతాన్ని పరాయి మతంగా చూడలేమనీ, మన ముస్లీంలు గౌరవనీయులైన భారతీయ పౌరులని పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సమావేశాన్ని ఈటివీ (ఉర్దూ చానెల్) ప్రసార హక్కులు తీసుకోవడం మరో విశేషం.
125 సంవత్సరాల కిందట యావత్ జాతిని కదిలించిన వందేమాతరం గేయంలో ఇప్పుడు తప్పులు వెదకడం సమంజసమా? వందేమాతరం గేయంలోని `మాత' అంటే సొంత తల్లికాదు. మాతృభూమి (స్వదేశం) అని అర్థం. సొంతతల్లికి నమస్కరిస్తారా, లేక ప్రేమిస్తారా, కాక గౌరవిస్తారా అన్నది వారివారి మతాచారాల ప్రకారం ఉంటేఉండవచ్చు. కానీ దేశభక్తిని చాటుతూ, మాతృభూమికి నమస్కరించమంటూ సాగే చైతన్య గీతికపై ఇంతటి వివాదం రగిలించడంలో ఈ మతపెద్దల అసలు ఉద్దేశాలు ఏమిటి? `మాత' అన్న శబ్దంలోని విశేష అర్థాన్ని గ్రహించకుండా మొండిగా వాదిస్తూ, భారతదేశంలో ఉంటూ, అన్ని సౌకర్యాలు పొందుతున్న ముస్లీం సోదరులు జాతిఉద్దీపనా గేయాన్ని ఆలపించమంటూ తెగేసి చెప్పడం కుసంస్కారమే అవుతుంది.
జమైత్ ఈ ఉలేమా హింద్ భారీ ఎత్తున నిర్వహించిన జాతీయ స్థాయి సమావేశంలో వందేమాతరం వివాదం నిజానికి అతి ముఖ్యమైన అంశం కాదు. సామాజిక, ఆర్థికపరమై వివక్షకు గురవుతున్న ఇండియన్ ముస్లీంలు వాటికోసం పోరాడాలి. హక్కులసాధన కోసం నడుం బిగించాలి. అంతేకానీ, భారతదేశంలో ఉంటూ, ఆ దేశానికి చెందిన చైతన్య గీతికలను తప్పుపట్టడం, వాటిలో నానార్థాలు వెతకడం మంచిదికాదు. ముస్లీంలంతా భారతీయులమే అనుకునే పక్షంలో ఇలాంటి వివాదాలు తలెత్తవు. కానీ ఇప్పుడు జరుగుతున్నది అందుకు భిన్నమైనదే, నిస్సందేహంగా.
(ఈ వివాదంపై మీ అమూల్యమైన అభిప్రాయాలను పంపించండి.)
-ఎడిటర్

Saturday, October 31, 2009

ఎడిటర్స్ వాయిస్: తెలుగుతల్లి కంటనీరు

తెలుగుతల్లి ఆంధ్రావారికే సొంతమనీ, తెలంగాణవారికి వేరే తల్లి ఉన్నదన్న వాదన ఈమధ్య బలపడుతోంది. కడప జిల్లాలోని సెయింట్ జోసెఫ్ స్కూల్ లో పిల్లలు తెలుగుమాట్లాడకూడదంటూ ఆంక్షలు విధించడంతో రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్య తీసుకుంటూ అన్ని పాఠశాలల్లోనూ `మా తెలుగుతల్లికి మల్లెపూదండ' గేయాన్ని విద్యార్థులచేత పాడించాలంటూ ఆదేశాలిచ్చింది. మాతృభాష అడుగంటిపోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉన్నట్టుండి మరో వివాదానికి తెరలేపింది. తెలంగాణ ప్రాంత విద్యార్థులు `మా తెలుగు తల్లికి మల్లెపూదండ' పాట పాడాల్సిన అవసరం లేదని కొందరు తెలంగాణ కవులు, మేథావులు పాయింట్ లేవనెత్తారు. తెలంగాణ పాటలు పాడే దేశ్పతి శ్రీనివాస్ మరో అడుగుముందేకిసి `మీ తెలుగుతల్లి మల్లెపూదండలు వేసుకుంటే వేసుకోమనండీ, మా తెలంగాణ తల్లి మాత్రం బంతిపూదండలు వేసుకుంటుంది...ఆ పాటలో తెలంగాణ వారి పట్ల అన్యాయం ధ్వనిస్తోంది. గలగలా గోదావరి కదిలిపోతుంటేను...అని పాడుతున్నారు. అంటే ఈ గోదావరి మా తెలంగాణ గడ్డమీద నుంచి కదలిపోతుంటే మేము చూస్తుండిపోవాలా...ఇక, బిలబలా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, అని పాడుతున్నారు, అంటే, కృష్ణమ్మ కూడా పరుగులెత్తుకుంటూ ఆంధ్రవాళ్లవైపు వెళుతుంటే ఇక మాకేం మిగిలుతుంది...కష్టాలు, కన్నీళ్ళా?...ఇలాంటి పాటలు మాకొద్దు. మా పిల్లలచేత ఇలాంటి పాటలు పాడించం. ఈ తెలుగుతల్లి మాకొద్దూ...మా తెలంగాణతల్లి పాటలే మా పిల్లలు పాడుకుంటారు. ఆ తల్లికే బంతిపూల దండలు వేస్తుంటారు' అంటూ ఎంతో భావోద్వేగంతో అన్నారు.
ఆయనలాజిక్ అయినది. అయితే, ఓ చిన్న వాస్తవాన్ని మరిచిపోతున్నట్టున్నారు ఈ మేథావులంతా. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ...ఏ ప్రాంతంలోని వారైనా మాట్లాడేది తెలుగే అయినప్పుడు, వారి మాతృభాష తెలుగు అయినప్పుడు తెలుగుతల్లిని అగౌరవపరచడంలో అర్థంలేదు. మరో విషయమేమంటే, తెలుగుతల్లిని తెలంగాణ తల్లితో పోల్చకూడదు. తెలుగుతల్లి భాషకు ప్రతీక. తెలంగాణ తల్లి ప్రాంతానికి ప్రతీక. అలాంటప్పుడు ఈ రెంటినీ కలిపేసి విబేధాలు సృష్టించి లేతమనసుల్లో విషం ఎక్కించడం మంచిదేనా?
అవాంఛనీయమైన ఇలాంటి వ్యాఖ్యలవల్ల తెలుగుతల్లి కంటనీరు పెడుతున్నది. ఇది అత్యంత శోచనీయం. ఈ సమస్యను మొగ్గగా ఉన్నప్పుడే త్రుంచివేయడం మంచిది.
మీ అమూల్యమైన అభిప్రాయాలను నారదలోకం ఆహ్వానిస్తోంది. చర్చలో పాల్గొనండి. సమస్య పరిష్కారానికి ఓ చక్కటి సలహా ఇవ్వండి.
(ఈ వ్యాసానికి సూచనలు ఇస్తున్న పాఠక మిత్రులకు ధన్యవాదాలు)
- ఎడిటర్

Friday, October 23, 2009

సెకండ్ టర్మ్ ఆర్నెల్లేనని వైఎస్సార్ కి ముందే తెలుసా !

రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కొద్దిరోజులకే ప్రియతమ నేత వైఎస్సార్ కి ఓ చేదు నిజం తెలిసింది. `సెకండ్ టర్మ్ సీఎంగా తాను ఆరునెలలు కూడా ఉండనేమో...'- అన్న తలంపు ఆయన్ని కలిచివేసింది. ఇది ఎలా సాధ్యమైంది? రెండోసారి సీఎంగా ఆర్నెళ్లుకూడా ఉండవని ఆయనకు ఎవరు చెప్పారు? ఏ భవిష్యవాణి ఆయనకు ఈ హెచ్చరికలు చేసింది...ముందుగానే తెలిసినా వైఎస్సార్ జాగ్రత్తలు తీసుకోలేకపోయారా? -
ఆసక్తికరమైన కథనం...
త్వరలో
`నారదలోకం'లో మీముందుంచబోతున్నాం.
-ఎడిటర్
(kanvasas@gmail.com)

Monday, October 19, 2009

కుట్ర గుట్టు ముందుగా విప్పిన నారదలోకం

వైఎస్సార్ ఎక్కిన హెలికాప్టర్ కూలడంలో కుట్ర జరిగినట్టు సాక్షి పత్రికలో వచ్చిన ప్రత్యేక కథనానికి నారదలోకం స్పందిస్తూ -సాక్షిరాసింది కుట్రతోనే? అంటూ విశ్లేషణాత్మక కథనాన్ని సోమవారం ఉదయంమే అందించాం. ఎలక్ట్రానిక్ మీడియా (ముఖ్యంగా టీవీ ఛానెళ్లు) పెరిగిన ఈ రోజుల్లో కూడా వెంటనే సాక్షిలో ఉద్దేశపూర్వకంగా వచ్చిన కథనాన్ని విశ్లేషిస్తూ వార్తలు రాలేదు. అన్నింటికంటే ముందుగా నారదలోకం బ్లాగ్ స్పందించింది. ఆ తరువాత రాత్రి ఏడున్నరగంటలకు కుట్ర సిద్ధాంతమంటూ టివీ-- 9లో ఒక ప్రత్యేక కథనం వచ్చింది. ఎఐసిసీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ కూడా హెలికాప్టర్ కూలడంలో కుట్ర ఉన్నదన్న వార్తా కథనాన్ని ఖండించారు. ఇలాంటి ఉహాజనత వార్తలను ఇవ్వకూడదంటూ హితవుపలికారు.
నిన్నకాక మొన్న (విజయదశమినాడు) జన్మించిన నారదలోకం న్యూస్ బ్లాగ్ నదురుబెదురులేకుండా మొత్తం మీడియాలో కెల్లా ముందుగా సాక్షి రాసింది కుట్రతోనే అంటూ కథనం ఇవ్వడాన్ని పాఠకులు ఈ పాటికి గమనించే ఉంటారు. నారదలోకం సాహసోపేతమైన కథనాలకు వెనుక ఉన్న బలం పాఠకులే. ఇక ముందు కూడా వాస్తవకోణాలను ఆవిష్కరించడంలో ముందే ఉంటామని హామీ ఇస్తూ...
- ఎడిటర్

Sunday, October 11, 2009

మీడియాను నమ్మలేం...

ఎడిటర్స్ వాయిస్
మీడియా అనేక సర్వేలు నిర్వహిస్తుంటోంది. ఇటు పత్రికలు, అటు టివీ ఛానెళ్లు పోటీపడి మరీ సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఎన్నికలప్పుడైతే ఈ సర్వేల హోరు అంతాఇంతాకాదు. అలాగే, పోల్ ద్వారా కూడా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంటోంది. వైఎస్సార్ మరణానంతరం కొద్ది గంటల్లోనే రెండు ప్రముఖ ఛానెళ్లు `జగన్ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా?' అన్న ప్రశ్నను సంధిస్తూ ఎస్ఎంఎస్ పోలింగ్ కండెక్ట్ చేశాయి. ప్రజల్లో భావోద్వేగం పతాకస్థాయిలో ఉన్న వేళలో ఇలాంటి పోలింగ్ పెట్టడం వల్ల సహజంగానే జగన్ పక్షానే ఎక్కువ ఓట్లు పడ్డాయి. సుమారుగా దాదాపుగా 90 శాతం మంది దాకా జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నట్టు చూపించారు. భావోద్వేగాలు తగ్గిన తరువాతనే ప్రజల్లోని కచ్చితాభిప్రాయాన్ని రాబట్టవచ్చన్న ఉద్దేశంతో `నారదలోకం' ఇదే ప్రశ్నపై (జగన్ ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారా?) పోలింగ్ నిర్వహించింది. ఇందులో 8 శాతం మంది మాత్రమే జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నట్టు తేలగా, 92 శాతం మంది వారసత్వంగా జగన్ ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారన్న వాదనను వ్యతిరేకించారు.
అలాగే, `నారదలోకం' మరో ఆసక్తికరమైన అంశంపై కూడా పోలింగ్ పెట్టింది. మీడియా చెప్పేవన్నీ నిజాలేనా? అన్న ప్రశ్న నెట్ జన్స్ ను అడిగింది. కనీసం ఒక్కరు కూడా మీడియా చెప్పేవన్నీ నిజాలని చెప్పకపోవడం ఆశ్చర్యకరంగానే అనిపించినా, ఈ పోల్ వాస్తవకోణాలను స్పృశించిందనే చెప్పాలి. ఇప్పటి వరకు నిర్వహించిన రెండు పోల్ ల ఫలితాలను మీరు మన బ్లాగ్ (నారదలోకం)లో చూడవచ్చు.
నిజాలను నిర్భయంగా చెబుతామని ప్రకటించుకునే మీడియా పట్ల విశ్వసనీయత ఇంతగా పడిపోవడానికి కారణాలు ఏమిటో విశ్లేషించుకోవాల్సిందే. జర్నలిజం క్యాపిటలిస్ట్ ల చేతుల్లో చిక్కుకున్న తరువాత మీడియా పట్లనే గౌరవం తగ్గిపోతున్నదా? అందుకు ఈ పోల్ ఒక సంకేతంగా నిలిచిందా? ఈ దిశగా ఆలోచించాల్సిందే. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియాది అత్యంత కీలకమైన స్థానమే. అందుకే దీన్ని `ఫోర్త్ పిల్లర్' గా చెప్పుకుంటాం. అలాంటి ఫోర్త్ పిల్లర్ పునాదాలు కదిలిపోతున్నాయా? దీనికి ఎవరు బాధ్యులు? మీడియాను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య ప్రియులందరి మీదా ఉంది. కాదంటారా? మీ అభిప్రాయాలను వెంటనే పోస్ట్ చేయండి. ఈ ఉద్యమంలో మీరూ భాగస్వాములుకండి. మీ సలహాలు అందివ్వండి.
-కణ్వస