Tuesday, November 24, 2009

సెటైర్: ఓటరు - గ్రేటరు

`గ్రేటర్' హైదరాబాద్ మహానగరంలోని ఓ పౌరుడు. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే, మధ్యతరగతి ఉద్యోగస్థుడు. అతగాడు ఆరురోజులు పనిచేసేదే `ఆదివారం' రాకకోసం. ఆదివారం రాకపోతుందా అన్న ఆ ఒక్కఆశే అతగాడ్ని మిగతారోజుల్లో పరుగులుపెట్టిస్తుంది. అన్ని ఆదివారాల్లాగానే ఈ ఆదివారం కూడా గ్రేటర్ రెస్ట్ తీసుకుంటున్నాడు. ముసుగుతన్ని పడుకున్నాడు. పొద్దున్న కాఫీ, టిఫినీలు బెడ్ మీదనే లాగించాడు. మళ్ళీ ముసుగుతన్ని పడుకున్నాడు. మధ్యాహ్నం భోజనం లాగించేసి కాసేపు టివీలో సినిమాలు చూశాడు. పెళ్లాంబిడ్డలతో కబుర్లాడాడు. రాత్రి పెందలాడే మళ్ళీ ముసుగుతన్ని పడుకున్నాడు. మంచి నిద్రపట్టేసింది. అంతలో ఎవరో వచ్చి తట్టిలేపారు. `ఛీ, అదివారం పూట కూడా హయిగా పడుకోనివ్వరు...' అంటూ విసుక్కున్నాడు గ్రేటర్. కానీ, ఆ వచ్చినవాడు పట్టువదలని విక్రమార్కుడిలా ఉన్నాడు. అందుకే మళ్ళీమళ్లీ తట్టిలేపుతూనే ఉన్నాడు. దీంతో గ్రేటర్ కి ముసుగుతీయక తప్పలేదు.
`ఎవరునువ్వు?' గట్టిగానే కసురుకున్నాడు గ్రేటర్.
`నేను ఓటర్ని...లే..త్వరగాలే...'
గ్రేటర్ కి కోపం నశాలానికంటింది.
`ఏంటీ లేచేది. సిటీబస్సులో స్టాండింగ్ ప్యాసింజర్లా ఏంటీ నీ చూపు. ఈవేళ ఆదివారం, నేను లేవను.'
`కాదు, నువ్వు లేవాల్సిందే. అది నీ బాధ్యత'
`ఎందుకులేవాలి. అసలు లేవమని అడిగే హక్కు నీకెక్కడిది? రాంగ్ సైడ్ ఓవర్ టేక్ చేసేవాడిలా ఏంటా చూపు? ఇంతకీ నువ్వెవరివి?'
`నేను ఓటర్ని..'
`అయితే, నన్నులేపే హక్కు నీకెక్కడిది...?'
`ఓటరుగా నిన్ను లేపే హక్కు నాకుంది. నిన్ను చైతన్యం చేయాలనే వచ్చాను. అసలు నేనెవరో కాదు, నీలోని ఓటర్ని....
`అదీ, అట్లా చెప్పు. గ్రేటర్ హైదరాబాద్ లో వేరేవాళ్లయితే, ఇలాంటి సాహసానికి దిగరు. నాలోనివాడివికాబట్టే నీకీ తెగువ. ఉండు, నీపనిబడతా...'
గ్రేటర్ మంచం దిగి ఓటరు పని పట్టాలని లేవబోయాడు. అంతలో ఆదివారం రెస్టావ్రతంలో ఉన్నానని తెలుసుకుని...
`ఊహూ, నేను రెస్ట్ల్ లో ఉన్నాను కనుక నువ్వు బతికిపోయావు. పో, నన్ను డిస్ట్రబ్ చేయకు.'
`నువ్వు పొమ్మంటే పోవడానికి నేను మామూలు మనిషినికాను. ఓటర్ని. నా బాధ్యతలు నేను చేసుకుంటూ పోతాను.'
`ఏంటీ నీ బాధ్యత?'
`నేచేత ఓటు వేయించాలి.'
`ఓహ్..గుర్తుకువచ్చింది. గ్రేటర్ ఎన్నికలుకదా...అయినా అది సోమవారం కదా..'
`పిచ్చినా గ్రేటరూ, ఆదివారం వెళ్లిపోయింది. తెల్లవారుజామైంది.. మరికాసేపట్లో తెల్లవారబోతున్నది. లే, లేచివెళ్ళి పవిత్రమైన ఓటువెయ్యి.'
`అబ్బో చాలా పెద్దమాటలే మాట్లాడుతున్నావ్. ఏ పార్టీవాళ్లైనా చేతులు తడిపారా ఏంటీ?'
`నేను ఎలాంటి ప్రలోభాలకు లొంగను. ఊరికే మాటలతో కాలక్షేపం చేయకు, ఓటు వేయడానికి సిద్ధంకా...'
`ఎందుకు ఓటు వేయడం?'
`అదేం పిచ్చి ప్రశ్న. నీ నగరాన్ని నువ్వు అభివృద్ధి చేసుకోవద్దూ...'
ఆ మాటలకు గ్రేటర్ పగలబడినవ్వాడు. మంచంమీద అటూఇటూ పొర్లుతూమరీ నవ్వాడు.
` పిచ్చినా ఓటరూ, ఆర్నెళ్లకిందట ఓటు వేశాం ఏం జరిగింది?
అవి జనరల్ ఎలెక్షన్స్.'
`పీకావులే లాజిక్. మాకా విషయం తెలియదా. ఆ ఎలెక్షన్సప్పుడు ఇచ్చిన హామీలే తీర్చలేదు. ఇప్పుడేమీ పీకుతారట.'
`ఇవి గ్రేటర్ ఎన్నికలు. గ్రైటర్ హైదరాబాద్ లో రోడ్లు వెడల్పు అవుతాయి.
ఛా...నిజమా!'
`మాన్ హోల్స్ కనిపించవు'
`ఛా..నిజమే!!'
`ఎక్కడబడితే అక్కడ ప్లైఓవర్లు...'
`ఎందుకూ, కూలడానికా...?'
`మెట్రో రైళ్లు...'
`ఎక్కడా, కాగితాలమీదనా...?'
`బోలెడన్నీ సిటీబస్సులు'
`ఎందుకూ, ట్రాఫిక్ లో ఉన్నవే ముందుకు కదలడంలేదు. కొత్తవెందుకూ!!'
`నగర వాసులందరికీ ఆరోగ్యం'
`ఎట్టా!! కాలుష్యం ఇట్లా ఉంటే ఆరోగ్యం ఎట్లా వస్తుందబ్బా?!'
గ్రేటర్లందరీ భద్రత
`ఎక్కడా, గోకుల్ ఛాట్ లోనా, లుంబినీ పార్క్ లోనా...పాతబస్తీలోనా, అబిడ్స్ సెంటర్లోనా?'
` నువ్వు అలా అనకూడదు. మనిషి ఆశావాది. గ్రేటర్ లో కొత్త పాలన వచ్చేస్తుంది. నువ్వు ఓటు వేస్తే మెరుగైన పాలన వస్తుంది. లే, లేచి ఓటువెయ్యి.'
` చాల్లే, చెప్పొచ్చావ్...అభాగ్యనగర వాసులకు అంత సీను లేదు. వేరే ఎక్కడికైనా వెళ్ళి ఓటు నీతులు చెప్పుకో...పో..'
`ఆ చెప్పడం మరిచాను, ఓటు వేయడానికి నీకు ఈరోజు సెలవు ఇచ్చారు. తెలుసా...'
`హాయ్... నిజమే, సమయానికి గుర్తుచేశావ్. ఇంకానయం మంచం దిగలేదు. ఆదివారం పక్కన సోమవారం కూడా సెలవా...భలే ఛాన్స్ లే..లలలా...లలలా లక్కీ ఛాన్స్ లే...'
`మరి నా ఓటు సంగతో...'
`రెండురోజులు సెలవు వస్తే ఏంటీ నీ నస. అసలే, చలిగా ఉంది. పొద్దున్నే గోలపెట్టకు. నువ్వు నాలోని వాడివేకదా...వచ్చేయ్...దుప్పట్లో దూరు..హాయిగా, వెచ్చగా పడుకుందాం. మనకెందుకు చెప్పు, ఈ ఓట్లూ, గీట్లు. ఎవరు వచ్చినా ఒరిగేదిలేదు. గ్రేటర్ హైదరాబాద్ వాసిగా నా కష్టాలు నాకు తప్పవు. సెలవు అయిందంటే హైదరా`బాధ'లే..రా, వచ్చేయ్..దుప్పట్లో దూరేయ్..'
అంతే, ఓటరు మారుమాటమాట్లాడకుండా గ్రేటర్ దుప్పట్లో దూరి ముసుగుతన్ని పడుకున్నాడు.
ఫలితం: హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో కేవలం 44.15 శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి.
- కణ్వస

Sunday, November 22, 2009

సెటైర్: బిల్ గేట్స్ ని దాటిన జగన్

ఇటీవల ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన ప్రపంచం లోని అత్యధిక ధనవంతుల జాబితా ను చూసి అమెరికన్ ప్రెసిడెంట్ ఒబామా కి ఒక డౌట్ వచ్చింది. అదేమిటంటే, కేవలం వైట్ మనీ తో వేసే లెక్క లు ఎంత వరుకు కరెక్టు అని!
వెంటనే ఒక ఆలోచన వచ్చింది. ఒక రహస్య సమావేశం ఏర్పాటుచేసి, ప్రపంచం లోని ధనవంతులదరిని పిలిచి, వారి బ్లాక్ మనీ వివరాలు కూడా తెలుసుకుని, ఆ తరువాత అసలు సిసలైన ప్రపంచ ధనవంతులెవరో తేల్చేసుకుందామని అనుకున్నాడు. ఆ వెంటనే, తన PA ని పిలిచి సమావేశానికి ఏర్పాట్లు చేసేయమన్నాడు. సమావేశ వివరాలు గోప్యంగా ఉంచుతామని అత్యంత గోప్యంగా హామీ ఇవ్వడంతో ప్రపంచం నలుమూలల నుంచీ ధనికులు తమ బ్లాక్ మనీ రహస్యాల చిట్టా విప్పడం మొదలుపెట్టారు. ముందుగా బిల్ గేట్స్ చాలా హుందాగా లేచాడు. టై సరిచేసుకున్నాడు. గొంతు విప్పాడు....
బిల్ గేట్స్: ఎస్, నేను మైక్రోసాఫ్ట్ కింగ్ ని నా సంపాదన ... ఫ్యూర్ వైట్... నాలుగువేల కోట్ల డాలర్లు. బ్లాక్ కూడా మరో నాలుగువేల కోట్లు ఉందనుకోండి...సో, వైటైనా, బ్లాక్ అయినా, నేనే అత్యంత ధనికుణ్ణి...ఎనీ డౌట్.
అనిల్ అంబానీ: నా వైట్ మనీ 1750 కోట్ల డాలర్లు. బ్లాక్ 8వేల కోట్ల డాలర్లు. టోటల్ గా సుమారు 10 వేల కోట్ల డాలర్లు. నేనే గ్రేట్. (సోదరుడు ముఖేష్ వైపు చూస్తూ ఎగతాళి నవ్వు నవ్వాడు)
ముఖేష్ అంబానీ: ఓరేయ్ అనిల్. నువ్వు పిల్లోడివేరా... వయసులోనూ, వైట్ లోనేకాదు, బ్లాక్ లోనూ నీకంటే ఎక్కువేరా... టోటల్ గా నా దగ్గర 15 వేల కోట్లు ఉందిరోయ్... నేనే నెంబర్ వన్.
ఇలా ఒక్కొక్కరూ లేచి తమ బ్లాక్ అండ్ వైట్ వివరాలు కలర్ పుల్ గా చెబుతుంటే అప్పుడు లేచాడు ఓ తెలుగోడు.
చంద్రబాబు: ఒక్కసారి నా లిస్టు చూస్తుంటే మీకే తెలుస్తుందీ, నేను ఎలా ముందుకు పోతున్నానో...నా వైట్, బ్లాక్ కలిపితే, 32వేల కోట్ల డాలర్లు. ఆ విధంగా తెలుగుజాతి ముందుకుపోతుంది. అందుకే మీకు చెబ్తున్నాను, హైదరాబాద్ ని నెంబర్ వన్ చేశాను, అదే మాదిరిగా, నేనూ నెంబర్ వన్ అయ్యాను.
ఇదే సమావేశానికి లేటుగా హాజరై చివరి వరసలో కూర్చున్న అల్లుఅరవింద్ తన బావ చిరంజీవితో అంటున్నాడు...
అల్లుఅరవింద్: చూశావా బావా...నేను ముందు నుంచి చెబ్తునే ఉన్నాను. సినిమాటికెట్లకంటే, పార్టీ టికెట్లు అమ్ముకుంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయని. పదేళ్లకిందటే నువ్వు పార్టీ పెట్టిఉంటే, మనమే నెంబర్ వన్ అయ్యేవాళ్లం బావా...
ఇంతలో జగన్ మైక్ పట్టుకుని మాట్లాడటం మొదలుపెట్టారు. అంతా పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయారు. జగన్ తనదైన శైలిలో తలఎడమ పక్కకి వొంచుతూ, చాలా అమాయంకంగా చెప్పుకుపోతున్నాడు....
జగన్: బ్లాక్ మనీ అయినా, వైట్ మనీ అయినా, అందరికీ ఆదర్శం మా నాన్నగారే. ఆయన బాటలో నడుస్తున్న నేను బ్లాక్ అండ్ వైట్ లో ఎంత కూడబెట్టానని మిస్టర్ ఒబామా అడుగుతున్నారు. అయితే నేను చెబ్తున్నాను, అన్నీ కలర్ పేజీలు వేస్తున్న సాక్షిలో ఉన్నదంతా బ్లాక్ మనీనే...ఇంకా చెబ్తున్నా, నా బ్లాక్ అండ్ వైట్ మొత్తం కలిపి సుమారుగా 1లక్షా 36వేల 760 కోట్ల డాలర్ల వరకు ఉండొచ్చు...ఇంకా..

అప్పటిదాకా సైలెంట్ గా ఉన్న ఒబామాకు కళ్లు బైర్లుకమ్మాయి. `ఔరా' అని ఇంగ్లీష్ లో అనుకుంటుండగానే తన పక్కనే కూర్చున్న బిల్ గేట్స్ అవుట్ పుట్ రాని ప్రోగ్రాం లాగా సడన్ గా దబీమని పడిపోయాడు. గిలగిలా కొట్టుకోవడం మొదలుపెట్టాడు. నీళ్లు చల్లి లేపాక ఒకటే మాట కలవరిస్తున్నాడు....
బిల్ గేట్స్: నేను ఇండియా పోతా...నేను ఇండియా పోతా....పోతా...పో...

- రాజేష్

Saturday, November 14, 2009

రోశయ్య నోట `చిరు'నామస్మరణ

గ్రేటర్ ఎన్నికల్లో ప్రజారాజ్యంతో పొత్తుల వ్యవహారం బెడిసికొట్టినా కాంగ్రెస్ లో ఆశలు చావలేదు. ఈసారి మీడియాకు చిక్కకుండా అత్యంత రహస్యంగా ప్రజారాజ్యం పార్టీని ఏకమొత్తంగా కాంగ్రెస్ లో విలీనం చేయడానికి బేరసారాలు జరుగుతూనే ఉన్నాయి. ఇదంతా బిహైండ్ ద కర్టెన్ వ్యవహారం కాగా, రోశయ్య మాస్టారు `చిరు'నామస్మరణకు దిగారు. బాలలదినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులతో రోశయ్య మాట్లాడుతూ ప్రస్తుత తరం నటుల్లో చిరంజీవి అంటే తనకు మక్కువ అంటూ ముచ్చటైన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏ ఉద్దేశంతో అన్నా, దానికి రాజకీయ రంగులు పులుముకున్నాయి. చిరంజీవి గొప్పనటుడంటూ రోశయ్య కితాబు ఇచ్చారు. చిరంజీవిని నెమ్మదిగా కాంగ్రెస్ ముగ్గులోకి దింపడంకోసమే రోశయ్య మాస్టారు ఇలా చిరునామస్మరణ చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

`గాలి' - కోడా ఇద్దరూ ఇద్దరే

ఓబుళాపురం గనుల్లో అక్రమాలున్నాయన్న ఆరోపణలు ఎదుర్కుంటున్న గాలిజనార్దనరెడ్డికీ, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడాకి కొన్ని సారూప్యతలు ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం...
సవాల్: తమపై మోపబడిన ఆరోపణలు నిజమని కోర్టులో నిర్ధారణ అయితే (కావని అన్నదే వారి దీమాలా కనబడుతోంది) రాజకీయాల నుంచి శాశ్వతంగా నిష్కమిస్తానంటూ ఇటు గాలి, అటు కోడా ఇద్దరూ సవాళ్లు విసిరారు.
ట్రంప్ కార్డ్ : ఇద్దరి చేతులో ట్రంప్ కార్డులున్నాయి. గాలి తన పేరులో రెడ్డి అన్న కులం పేరు ఉండటం వల్లనే చంద్రబాబు నాయుడు దాడిచేస్తున్నారనీ, ఒక వేళ తనపేరులో `రెడ్డి' అన్న పదం లేకుంటే పరిస్థితి మరోరకంగా ఉండేదని గాలి `కులం' కార్డు తీస్తే, మరో పక్క మధుకోడా `ట్రైబల్' కార్డు తీశారు. తాను గిరిజనుడైనందునే తనపై విరుచుకుపడుతున్నారని ఆరోపిస్తున్నారు.
ఎదిగినతీరు: వీరిద్దరూ ఇంచుమించూ ఒకేలా ఎదిగారు. ఎనిమిదేళ్ల కితం గాలిపేరుగానీ, అటు మధుకోడా పేరుగానీ ఎవ్వరికీ తెలియదు. మధుకోడా రోజువారీ కూలీ కుటుంబం నుంచి వేలాది కోట్లు సంపాదించుకునే స్థాయికి ఎదిగాడు. గాలి ఓ మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ అండదండలతో విశ్వరూపం చూపించారు. ఇద్దరూ ఇనుప ఖనిజం గనులను నమ్ముకునే (అమ్ముకునే) కోట్లకు పడగలెత్తారు. ఆ తరువాత రాజకీయలవైపు దృష్టిపెట్టారు. అటుపై ఏకంగా సీఎం సీట్లో కూర్చోవడం, లేదా కూలదోయడం వంటి చర్యలకు పాల్పడ్డారు.
మధుకోడా ఏకంగా ముఖ్యమంత్రి సీట్లో కూర్చోగా, గాలి కర్నాటక సీఎం సీటుని అతలాకుతలం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తన `సోదరుడు' (ఈమాట గాలి జనార్దనరెడ్డి తాజ్ బంజారా హోటల్ లో మీట్ ద ప్రెస్ లో చెప్పారు) ఎప్పటికైనా అవుతాడని బల్లగుద్ది మరీ గాలి చెప్పేశారు.

Sunday, November 8, 2009

సెటైర్: ఈ గాలీ,ఆ జగనూ, అంతలో అద్వానీ

`పవర్' పాలిటిక్స్ కి వరుసావావి ఉండదు. నీరు ఎటు పల్లం ఉంటే అటు ప్రవహిస్తున్నట్టూ, గాలి ఎటువీస్తే అటే `పవర్' కదులుతున్నట్టుగా ఉంది ప్రస్తుత రాజకీయ పయనం. ఈ పాలసీని ఆసరాగాతీసుకునే కర్నాటకలో గాలిసోదరులు ఓ ఆటఆడిస్తున్నారు. కర్నాటక సీఎం యడ్యూరప్ప, గాలి సోదరుల మధ్య రేగిన చిచ్చు చల్లార్చాలని బిజెపీ అధిష్ఠానం నడుం బిగించింది. సరిగా ఈ నేపథ్యంలో అద్వానీ, గాలి జనార్ధనరెడ్డి మధ్య ఫోన్ సంభాషణ ఇలా సాగింది...
అద్వానీ: హలో గాలి జనార్ధనేనా?
గాలి: ఎస్, గాలి స్పీకింగ్ హియర్..
అద్వానీ: (స్వగతం) అంతే, మనీపవర్ నెత్తికెక్కితే డైలాగ్స్ ఇలాగే ఉంటాయి,(పైకి) హలో గాలి, నేను అద్వానీని.
గాలి: ఏంటిసార్, తొందరగా చెప్పండి, అవతల శంషాబాద్ నోవాటెల్ లో నా ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్ళాలి.
అద్వానీ: ఉండవయ్యా, నీ అసాధ్యం కూలా...తొందరపడకు. అయినా బెంగళూరులో మంచి హోటల్స్ చాలానే ఉంటే, శంషాబాద్ హోటలెందుకట...
గాలి: అదాసార్, చంద్రబాబు గతంలో హైదరాబాద్ హోటల్ లో ఎమ్మెల్యేలను మూసేసి సీఎం సీటు దక్కించుకోలా. ఆ స్పూర్తితోనే హైదరాబాద్ ఎంచుకున్నా.
అద్వానీ: సర్లే, ఆ పాత వెన్నుపోట్ల మాటెత్తకు, నాకు వెన్నులో చలిపుట్టుకొస్తోంది. ఇంతకీ నీ డిమాండ్లేమిటి?
గాలి: పెద్దగా డిమాండ్లేమీలేవుసార్. నాకొన్నది ఒకటే డిమాండ్.
అద్వానీ: హాహ్హహ్హాఁ...ఒకటేనా, చెప్పేయ్, త్వరగా తీర్చేస్తా.
గాలి: జగన్ ని సీఎం చేయాలి.
అద్వానీ: జగనా, అతనెవరూ...నీ దగ్గరున్న 50 మంది ఎమ్మెల్యేల్లో ఒకడా..అయినా ఈ పేరు వినలేదే.
గాలి: అతను కర్నాటక ఎమ్మెల్యే కాదుసార్.
అద్వానీ: మరీ!
గాలి: ఆంద్రా ఎంపీ. వైఎస్సార్ కొడుకు జగన్
అద్వానీ: అదేంటయ్యా! కాంగ్రెస్ ఎంపీ అయిన జగన్ ని మనమెలా సీఎంని చేస్తామయ్యా?
గాలి: అవన్నీ నాకు తెలియవుసార్. జగన్ ని సీఎం చేయాల్సిందే.
అద్వానీ: అది కుదరదయ్యా, ఇంకేదైనా అడుగు
గాలి: నాకు ఇంకేమీ వద్దుసార్. మా జగనన్న సీఎం అవ్వాల్సిందే.
అద్వానీ: (స్వగతం) ఓర్నాయనో, ఆంధ్రా జాఢ్యం కర్నాటకకు పట్టుకున్నట్టుంది. ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్టుంది.
గాలి: ఏంసార్. మాట్లాడటంలేదు. ఒకేనా. చెప్పండి. అవతల టైం లేదు. ప్రభుత్వం కూల్చేయాలి. కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వాలి. జగన్ ని సీఎం చేయాలి.
అద్వానీ: ఓరినా గాలో...అంతపని చేయకయ్యా. సర్లే సీఎంని చేద్దాం.ఇంతకీ ఏ రాష్ట్రానికి సీఎంని చేయాలి. ఆంధ్రాకా, కర్నాటకకా
గాలి:అదీ...అదీ...సార్, ఒక్క నిమిషం లైన్ లో ఉంటారా...జగన్ ని అడిగి చెప్తా.
అద్వానీ: (స్వగతం) ఈ గాలి ఎప్పుడు ఎటువీస్తుందో అర్థంకావడంలేదు. కొంపదీసి గుజరాత్ కి సీఎంని చేయమని అడగడుకదా...
గాలి: సార్, తెలిసిందిసార్. మా జగనన్న ఆంధ్రకే సీఎం కావాలనుకుంటున్నాడు.
అద్వానీ: అమ్మయ్యా, నా టెన్షన్ తగ్గింది. మరైతే మధ్యలో నేనేం చేయాలయ్యా. నీ డిమాండ్ నాకర్థం కావడంలేదు.
గాలి: అవన్నీ నాకు తెలియదుసార్. జగన్ సీఎం అవ్వాలి. లేకుంటే నా 50 మంది ఎమ్మెల్యేలు...
అద్వానీ: ఆపవయ్యా, నీ రికార్డింగ్. ఆగిన రైల్లో చైన్ లాగేసే ఫేసూనువ్వూ...కాస్త ఆలోచించుకోనీ...ఆఁ, సర్లేవయ్యా, నేను సోనియాతో మాట్లాడతా...ఎలాగో ఒప్పిస్తా. జగన్ ని ఫ్యామిలీతో ఢిల్లీ వెళ్ళి సోనియాను కలవమను. సెంటిమెంట్ అక్కరకు వస్తుంది.
గాలి: అట్లాగే సార్, త్వరగా తేల్చండి... అవతల నోవాటెల్ వాడు నా గనులు పిండుతున్నాడు. ఇంకొన్నాళ్లయితే, నా ఆస్తిమొత్తం లాక్కుంటాడేమో...
- టి. రాజేష్

కొత్త శీర్షిక: న్యూ కామెంట్ ప్లీజ్

అభిమాన `భ్లాగులోళ్లు' (బ్లాగర్స్) చూపిస్తున్న ఆదరణకు `నారదలోకం' కృతజ్ఞాతాభివందనాలు. ఇప్పుడు మీకోసం కొత్త శీర్షిక `న్యూకామెంట్ ప్లీజ్' ప్రారంభిస్తున్నాం. రాజకీయ, సామాజిక అంశాలపై సరదాగా మేమిచ్చే ప్రశ్నకు మీరు వెనువెంటనే కామెంట్ చేయవచ్చు. మీ కామెంట్స్ సరదాగా ఉండాలిసుమా... పోస్ట్ అయిన కామెంట్స్ లో చురుకైన వాటిని ఎంపికచేస్తాం. మేము రెడీ, మరి మీరు రెడీనా...
ప్రశ్న: జగన్ ఏం సాధించాడు?
మా సమాధానం : `కొండ'ను తవ్వి సురేఖను పట్టాడు
మరో సమాధానం: ఢిల్లీవెళ్ళి ఫ్యామిలీ ఫోటో దిగాడు
ఇలా మీరు కూడా మీ న్యూకామెంట్స్ ని పంపించండి.
మీ కామెంట్స్ ని ఇ-మెయిల్ ద్వారా కూడా పంపవచ్చు.
kanvasas@gmail.com

Saturday, November 7, 2009

ఫ్యామిలీ చిత్రం: జగన్ సకుటుంబ ఢిల్లీ యాత్ర

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తనయుడు, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి శనివారం ఆకస్మికంగా ఢిల్లీకి వెళ్లారు. వెళుతూ వెళ్తూ తన వెంట తల్లి విజయలక్ష్మీ, భార్య భారతీ రెడ్డి, సోదరిణి షర్మిల కూడా వెంటబెట్టుకుని వెళ్ళారు. శనివారం ఉదయం ఆకస్మికంగా ఢిల్లీకి చేరుకోవడంలో మతలబు ఏమిటనే అంశం రాజకీయ వర్గాల మధ్య చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యంగా, సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి కె.రోశయ్య ఢిల్లీకి శుక్రవారం సాయంత్రం తొలిసారి వెళ్లారు. తొలిరోజున ఆయన రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీతో భేటీ అయ్యారు. తన పర్యటన రెండో రోజైన శనివారం ఉదయం ప్రధాని మన్మోహన్ సింగ్‌తో భేటీ అయ్యారు. సాయంత్రం పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశం కానున్నారు.
ఇంతలో జగన్మోహన్ రెడ్డి తన తల్లి, భార్య, సోదరితో ప్రత్యక్షం కావడం అందరినీ విస్మయానికి గురి చేసింది. అధిష్టానం నుంచి ఎలాంటి పిలుపు లేకుండానే ఆయన ఢిల్లీకి వెళ్లడం వెనుక మతలబు ఏమిటన్నదే అసలు ప్రశ్న.

Thursday, November 5, 2009

సచిన్ కి జేజేలు


మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ మరో సరికొత్త రికార్డును తన ఖాతాలో జమచేసుకున్నాడు. వన్డే క్రికెట్లో మరెవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన సచిన్, 17వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్ గా నిలిచాడు. ఆస్ట్రేలియా జట్టుతో గురువారం హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఐదవ వన్డేలో 7పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సచిన్ ఈ రికార్డును నమోదు చేసుకున్నాడు. సచిన్ రికార్డు కోసమే ఎదురు చూస్తున్న క్రీడాభిమానులు ఒక్కసారిగా ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు.
ది గ్రేట్ సచిన్ కి జేజేలు చెప్పండి....

`గ్రేటర్' కేసీఆర్ ఔట్

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమరం నుంచి టిఆర్ఎస్ తప్పుకుంది. గ్రేటర్ ఎన్నికల కంటే ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమమే తమ టార్గెట్ అని కేసీఆర్ తెల్చిచెప్పేశారు. `గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు మాకోలెక్కకాదు. ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం. పోటీ చేయం. తెలంగాణ ఉద్యమం జోరేమిటో చూపిస్తాం...' అంటూ ఫైనల్ గా డిసైడ్ అయిపోయారు. ఈనెల 6వ తేదీ శుక్రవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమ సంస్థల నేతలతో సమావేశాలు, సదస్సులు నిర్వహిస్తారట.
ఒకవైపు వీటిని నిర్వహిస్తూనే మరోవైపు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు వీలుగా కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళాలనుకుంటున్నారు. ఈనెలాఖరు నుంచి ఆమరణ నిరాహార దీక్షకు రెడీ అంటున్నారు.
తెలంగాణా ప్రజలు నా శవయాత్రలో పాల్గొంటారో లేక విజయయాత్రలో పాల్గొంటారో వారే తేల్చుకోవాలన్నారు. తనను ఆదుకున్నా.. వదిలేసినా అది తెలంగాణా ప్రజల చేతుల్లోనే ఉందని కేసీఆర్ తేల్చి చెప్పారు.
కొసమెరుపు: కేసీఆర్ మాటలు ఇలా ఉంటే, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొంతమంది నేతలు నామినేషన్లు దాఖలు చేసేశారు.

రోశయ్యకు సోనియా ఏం చెప్పబోతున్నారు?

రోశయ్య హస్తిన యాత్ర ఖరారైంది. ముఖ్యమంత్రి అయిన తరువాత రోశయ్య ఢిల్లీవెళ్ళి మేడం సోనియాను కలవబోవడం ఇదే మొదటిసారి. జగన్ సీఎం కావాలని కోరుకుంటూ కొంతకాలంగా ప్రయత్నాలు ముమ్మరంచేస్తూ కంట్లో నలుసుగా మారిన నేపథ్యంలో రోశయ్యకు ఢిల్లీ నుంచి పిలుపువచ్చింది. రాష్ట్రంలో వరద పరిస్థితులను సోనియాకు వివరించడానికే తాను ఢిల్లీ వెళుతున్నట్టుగా రోశయ్య చెబుతున్నా ఆమె ఏం చెప్పబోతున్నారో, రోశయ్య మాస్టారు ఆ తరువాత ఏం చేయబోతున్నారో ఈపాటికే అందరికీ అర్థమైంది. మేడం సోనియా సీఎం రోశయ్యతో ఇలా చెప్పేవచ్చు....
  • మీరు, కొందరనుకుంటున్నట్టుగా తాత్కాలిక ముఖ్యమంత్రికారు. మీరు హ్యాపీగా రూల్ చేసుకోండి.
  • జగన్ వర్గీయుల నుంచి ఇకపై మీకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా మేం చూసుకుంటాం.
  • వీలైనంత త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసుకోండి. నా నుంచి ఎప్పుడూ మీకు గ్రీన్ సిగ్నలే.
  • ఫ్యాక్షనిస్టు రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ లొంగదు. ఇప్పుడు మనకు కావాల్సింది ప్రజలకు సేవచేయగలిగినవారు, భాద్యతలను గుర్తెరిగిన యువత కావాలి.
  • ఎప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు. మేం చెప్పినట్టు మీరు నడుచుకోండి. గ్రేటర్ ఎన్నికల్లో తోకజాడించే నాయకుల పేర్లు పంపించండి.
  • దేశంలో ఇప్పటికే కాంగ్రెస్ బలోపేతమైంది. ఇలాంటి సమయంలో బలహీనపరిచే శక్తులను చూస్తూఊరుకోం. వాటిని ఎలా లొంగదీసుకోవాలో మాకు తెలుసు.
  • మీపని మీరు చేసుకోండి. మంచి సీఎంగా పేరుతెచ్చుకోండి. గుడ్ లక్....

Wednesday, November 4, 2009

ఎడిటర్స్ వాయిస్: `వందేమాతరం' పాడొద్దంటారా?


జాతీయగేయం `వందేమాతరం' పాడవద్దంటూ ముస్లీం మతాధికారుల అత్యున్నత సంస్థ `జమైత్ ఈ ఉలేమ హింద్' (జెఈయు) తీర్మానించింది. ఉత్తరప్రదేశ్ కు ఈశాన్యంగా, ఢిల్లీకి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవ్ బంద్ లో జెఈయు జాతీయ 30వ సర్వసభ్యసమావేశం నవంబర్ మూడున జరిగింది. ఈ సమావేశానికి దేశం నలుమూలల నుండి పదివేల మంది ముస్లీం మత పెద్దలు హాజరయ్యారు. గతంలో (2006లో) దారుల్ ఉలూమ్ ముస్లీంలు వందేమాతరం గేయాన్ని పాడకూడదంటూ జారీ చేసిన ఫత్వాను ఈ సమావేశం ఆమోదిస్తూ తీర్మానించింది. వందేమాతరం గేయంలోని కొన్ని పంక్తులు ఇస్లాం మతభావాలకు విరుద్ధమని సమావేశం ఏకగ్రీవంగా అభిప్రాయపడింది. వందేమాతరం విధిగా పాడాలని ఎవ్వరూ బలవంతం చేయకూడదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును వీరు ఉటంకించారు. వందేమాతరం అంటే తల్లికి నమస్సరించడమే అవుతుందనీ, తమ మతంలో తల్లికి నమస్కరించడమన్నది ఉండదనీ, తాము తల్లిని ప్రేమిస్తామేకానీ, ఆరాధించమని ఈ సంస్థ మతపెద్దలు తేల్చిచెప్పారు. ఏకేశ్వరోపాసనపట్ల తమకున్న విశ్వాసాన్ని చెల్లాచెదురు చేసేలా ఈ జాతీయగేయం ఉన్నదని వారంటున్నారు.
ఇదే సమావేశానికి కేంద్ర హోం మంత్రి చిదంబరం హాజరవడం మరో వివాదాస్పద అంశం. వందేమాతరంపై జెఈయూ తీర్మానాన్ని ఆమోదించిన కొద్దిగంటల్లోనే చిదంబరం అక్కడకు చేరుకుని ఇస్లాం మతాన్ని పరాయి మతంగా చూడలేమనీ, మన ముస్లీంలు గౌరవనీయులైన భారతీయ పౌరులని పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సమావేశాన్ని ఈటివీ (ఉర్దూ చానెల్) ప్రసార హక్కులు తీసుకోవడం మరో విశేషం.
125 సంవత్సరాల కిందట యావత్ జాతిని కదిలించిన వందేమాతరం గేయంలో ఇప్పుడు తప్పులు వెదకడం సమంజసమా? వందేమాతరం గేయంలోని `మాత' అంటే సొంత తల్లికాదు. మాతృభూమి (స్వదేశం) అని అర్థం. సొంతతల్లికి నమస్కరిస్తారా, లేక ప్రేమిస్తారా, కాక గౌరవిస్తారా అన్నది వారివారి మతాచారాల ప్రకారం ఉంటేఉండవచ్చు. కానీ దేశభక్తిని చాటుతూ, మాతృభూమికి నమస్కరించమంటూ సాగే చైతన్య గీతికపై ఇంతటి వివాదం రగిలించడంలో ఈ మతపెద్దల అసలు ఉద్దేశాలు ఏమిటి? `మాత' అన్న శబ్దంలోని విశేష అర్థాన్ని గ్రహించకుండా మొండిగా వాదిస్తూ, భారతదేశంలో ఉంటూ, అన్ని సౌకర్యాలు పొందుతున్న ముస్లీం సోదరులు జాతిఉద్దీపనా గేయాన్ని ఆలపించమంటూ తెగేసి చెప్పడం కుసంస్కారమే అవుతుంది.
జమైత్ ఈ ఉలేమా హింద్ భారీ ఎత్తున నిర్వహించిన జాతీయ స్థాయి సమావేశంలో వందేమాతరం వివాదం నిజానికి అతి ముఖ్యమైన అంశం కాదు. సామాజిక, ఆర్థికపరమై వివక్షకు గురవుతున్న ఇండియన్ ముస్లీంలు వాటికోసం పోరాడాలి. హక్కులసాధన కోసం నడుం బిగించాలి. అంతేకానీ, భారతదేశంలో ఉంటూ, ఆ దేశానికి చెందిన చైతన్య గీతికలను తప్పుపట్టడం, వాటిలో నానార్థాలు వెతకడం మంచిదికాదు. ముస్లీంలంతా భారతీయులమే అనుకునే పక్షంలో ఇలాంటి వివాదాలు తలెత్తవు. కానీ ఇప్పుడు జరుగుతున్నది అందుకు భిన్నమైనదే, నిస్సందేహంగా.
(ఈ వివాదంపై మీ అమూల్యమైన అభిప్రాయాలను పంపించండి.)
-ఎడిటర్

Tuesday, November 3, 2009

గిల్లి లెక్కచూసుకున్న డిఎస్ !

`గ్రేటర్' ఎన్నికల కోసం ప్రజారాజ్యంతో పొత్తు పెట్టుకుంటామంటూ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ చేసిన ప్రకటన చివరకు రసాభాస అయింది.పీఆర్పీతో పొత్తుపెట్టుకోవడాన్ని కాంగ్రెస్ లోని జగన్ వర్గం తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో అటు ప్రజారాజ్యం ఇటు కాంగ్రెస్ లోని రెండు వర్గాల్లోని చిన్నాచితకా నాయకులు మాటలతూటాలను విసురుకున్నారు. పన్నెండు ఛానెళ్లతో వెలిగిపోతున్న తెలుగు మీడియాకు మాత్రం కడుపారా తిట్లుదొరకడంతో ఆరోజుకి ముష్టాన్నం దొరికినంతగా సంబరపడిపోయింది. అయితే, ఈ మొత్తం వ్యవహారం చూశాక ఒక సందేహం కలగకమానదు.
అసలు డీఎస్ ఎందుకు గిల్లినట్టు? ఏమి ఆశించి ఈ రభసకు తెరదీశారు?
పైకి చూడటానికి డిఎస్ తెలివితక్కువగా గిల్లినట్టు కనిపించినా, లోలోపల మాత్రం మహత్తరమైన వ్యూహం ద్యోతకమవుతోంది. ఢిల్లీలో అధిష్ఠానం పెద్దల మధ్య కూర్చున్నప్పుడు డిఎస్ ఈ వ్యూహానికి బీజం వేశారు. జగన్ వర్గంలో ఎంత మంది ఉన్నారు? సీఎల్పీ సమావేశం పెడితే ఎంత మంది చీలిపోతారు? అన్న ప్రశ్నలకు సమాధానం రాబట్టాలంటే ఏదో ఒక ఎత్తుగడ వేయాల్సిందే. సీఎల్పీ సమావేశం పెట్టి రసాభాస అయ్యేదానికంటే, ముందుగానే బలాబలాలు తేలాలంటే ఓ సమస్యను లేవనెత్తాలి. అందుకే డిఎస్ పథకం ప్రకారం చిరంజీవిని ఒక పావుగా వాడుకోవాలనుకున్నారు. గతంలో వైఎస్సార్ సైతం ఇదే పావును కొంతమేర కదిలించారు. ఆ తరువాత రోశయ్య కూడా చిరంజీవికి ఆశ చూపించారు. ఈ నేపథ్యంలో చిరు తప్పకుండా తాము విసిరే వలలో పడిపోతారన్న ధీమాను డిఎస్ వ్యక్తం చేశారు. అందకే అధిష్ఠానాన్ని ఒప్పించి పొత్తు వ్యూహంకు తెరదీశారు.
అనుకున్నట్టే జరిగింది. పీఆర్పీతో పొత్తు అనగానే జగన్ వర్గీయులు మండిపడటం ప్రారంభించారు. రఘువీరా, దానం, సబిత, కోమటి వంటి వాళ్లు విరుచుకుపడ్డారు. కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా జగన్ కు వత్తాసు పలికారు. కొండా సురేఖ సంగతి చెప్పనక్కర్లేదు. ఆమె అప్పటికే రాజీనామాతో తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఆమె భర్త కొండా మురళి కూడా ధ్వజమెత్తారు.
ఈ సీన్లనన్నింటినీ డిఎస్ - రోశయ్య వర్గం నిశితంగా గమనిస్తూ, జగన్ పక్షాన ఉండే నాయకులు పేర్లను రాసుకోవడం ప్రారంభించింది. జగన్ వర్గీయుల జాబితా తయారుచేసుకునే పనిలో పడింది. ఇప్పుడున్నవేడి తగ్గితే ఈ జాబితాలోని పేర్లు తగ్గుతాయన్న నమ్మకాన్ని అధిష్ఠానానికి తెలియజేసింది. ఇక ఈ జాబితాను చూసుకుని అధిష్ఠానం, జగన్ ని బుజ్జగించాలో, బంధం తెంచుకోవాలో తేల్చుకుంటుంది. డిఎస్ పని ఇక్కడితో ముగిసింది.
జగన్ బాటలో ఎవరు వెళతారో, రోశయ్య పంచన ఎవరు ఉంటారో తేల్చుకోవడం కోసం డిఎస్ రచించిన ఈ పొత్తుల వ్యూహం ఫలించింది. పాపం, మధ్యలో చిరంజీవి రాజకీయంగా మరోమారు ప్లాప్ అయ్యారు.
-కణ్వస

Monday, November 2, 2009

ఫోకస్: `సైలెంట్' గానే కూలింది

వైఎస్సార్ ఎక్కిన హెలికాప్టర్ ఎవరి కుట్రతోనో కూలలేదు. వాస్తవం చెప్పాలంటే హెలికాప్టర్ చాలా సైలెంట్ గా కూలింది. ఆ క్షణాల్లో ఓ నిశ్శబ్దమృత్యుగీతక మాత్రమే వినిపించింది. కాక్ పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్) ని విశ్లేషిస్తే కొన్ని ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగుచూశాయి.
  • ప్రమాదం జరగడానికి ముందు హెలికాప్టర్ కూర్చుని ప్రయాణం చేస్తున్నవారెవరూ మాట్లాడుకోలేదు.
  • కనీసం పైలెట్లు కూడా ఎలాంటి ఆందోళన వ్యక్తం చేయలేదు.
  • నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ మాటలెక్కడా వినబడలేదు.
  • హెలికాప్టర్ దారితప్పిందన్న సంగతి కూడా పైలెట్లు పసిగట్టలేకపోయారు.
  • జోరున వర్షం, ఆపైన మబ్బులు దట్టంగా కమ్ముకోవడంతో వారికి ఎదురుగా ఉన్న కొండ కనిపించలేదు.
  • ఆ సమయంలో హెలికాప్టర్ 140 నాట్స్ (గంటకు 259 కిలోమీటర్ల వేగం)తో వెళుతున్నది. (ఒక నాట్ అంటే గంటకు 1.85 కిలోమీటర్ల వేగం)
  • ప్రమాదం వేళకి హెలికాప్టర్ హైదరాబాద్ కి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది.
  • హెలికాప్టర్ లో ఇంధనం బాగానే ఉంది. మరో రెండున్నర గంటలపాటు నిర్విరామంగా ఎగురగలదు.
  • ఉదయం 9గంటల 13 నిమిషాలకు హెలికాప్టర్ తో శంషాబాద్ రాడార్ సంబంధాలు తెగిపోయాయి.
  • మొత్తం ఘటనలో ఎవ్వరినీ నిందించాల్సిన పనేలేదని అర్థమవుతోంది. ఇందులో కుట్ర లేనేలేదన్న విషయం కూడా అవగతమవుతోంది.
-కణ్వస

Sunday, November 1, 2009

సెటైర్: `కొండ' గాలి సోకింది

కొండా సురేఖ పట్టుచీర కట్టుకని, నుదిటమీద పెద్దబొట్టుపెట్టుకుని వడివడిగా వీధిలో నడుచుకుంటూపోతున్నది. ఎడమపక్క ఓ ఇంటిపిట్టగోడమీద ఎన్.డి.తివారీ అన్న నేమ్ ప్లేట్ చూసింది. `యురేకా...దొరికింది...' అంటూ ఆనందోత్సాహంతో కేకలు పెడుతూ, ఆ ఇంట్లోకి దూసుకువెళ్ళింది.
ఇంటిలోపల హాల్ లో సైక్రియాట్రిస్ట్ ఎన్.డి.తివారీ తీరుబడిగా సోపాలో కూర్చుని ఆరోజు వచ్చిన పేపర్లను చూస్తున్నారు. ప్రాక్టీస్ చేసినన్నాళ్లుచేశాడు. ఎంతోమంది మానసిక రోగులకు నయం చేసి రికార్డు సృష్టించాడు. ప్రస్తుతానికి రిటైర్ మెంట్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు డాక్టర్ ఎన్.డి.తివారి.
అలా ఎంజాయ్ చేస్తున్న సమయంలోనే కొండా సురేఖ వడివడిగా లోపలకు వచ్చేసింది.అప్పుడు...
కొండాసురేఖ: నమస్కారమండి, తివారీగారు. మిమ్మల్ని చూడాలని చాలారోజులుగా అనుకుంటున్నాను.
ఎన్.డి.తివారీ: ఓహో అలా అనిపిస్తోందా... (తన దగ్గరకు వచ్చే పేషెంట్లలో చాలా మంది ముందుగా అనేమాట ఇదే కావడంతో తివారీకి అలవాటైపోయింది)
కొండాసురేఖ: నిజంసార్. ఆ రోశయ్యగారిని కలవాలని అనిపించలేదుసార్. నేరుగా మిమ్మల్నే కలవాలనుకున్నా సార్..
ఎన్.డి.తివారీ: ఓహో అలా కూడా అనిపించిందా...ఇంతకీ ఎవరా రోశయ్య? కొత్తగా ఫీల్డ్ లోకి వచ్చారా?
కొండాసురేఖ: కొత్తగానే వచ్చారు సార్. టెంపరరీ పోస్ట్ అని నేను చెబ్తున్నా వినకుండా పర్మినంట్ అయినట్టు ఫోజులిస్తున్నాడుసార్.
ఎన్.డి.తివారీ: ఓహో...నువ్వు అలా డిసైడ్ అయిపోయావన్నమాట.
కొండాసురేఖ: సార్, మీరు చాలా మంచివారు సార్...ఈ పూల బొకే తీసుకోండి...ఎందుకో మిమ్మల్ని కలవాలనుకోగానే పూలబొకే ఇవ్వాలనిపించి తెచ్చాను.
ఎన్.డి.తివారీ: ఓహో అలాకూడా అనిపించిందా...
కొండాసురేఖ: అంతేకాదు సార్. ఇదిగో ఈ లేఖ కూడా ఇవ్వాలనుకున్నా.
ఎన్.డి.తివారీ: (ఆశ్చర్యంగా) అదేమిటమ్మా, లేఖ అంటున్నావ్. మరి లావుపాటి పుస్తకం ఇస్తున్నావ్. ఇంతకీ ఇదేమన్నా నీ జీవిత చరిత్రా, లేక ఏదైనా పవిత్రగ్రంథమా.
కొండాసురేఖ: ఇది నా పవిత్ర రాజీనామా లేఖ.
ఎన్.డి.తివారీ: ఓహో...పుస్తకాన్ని చూస్తే లేఖలా అనిపిస్తుందా...
కొండాసురేఖ: ఇది పుస్తకం కాదుసార్. రాజీనామాలేఖే. కాకపోతే వెరైటీగా ఉంటుందని 600 పేజీలు రాశా.
ఎన్.డి.తివారీ: ఏంటీ! ఇలా కూడా అనిపిస్తుందా అమ్మా...
కొండాసురేఖ: (సిగ్గుపడుతూ) ఎంటో, అలాఅలా రాసుకుంటూపోతే, 600పేజీలైందిసార్. నేనే కాదుసార్. ఇలాగే నా వెనుక చాలా మంది రాజీనామాలు రాసేసి పట్టుకొస్తున్నారు.
ఎన్.డి.తివారీ: ఏంటీ! నువ్వేకాకుండా, ఇంకా చాలామంది ఈ లక్షణాలతోనే రీమ్ లురీమ్ లు రాజీనామాపత్రాలు రాసేస్తున్నారా తల్లీ.
కొండాసురేఖ: నిజంసార్. మీరు నమ్మడంలేదుకదూ...ఇదిగో నా వెనుక ఎవరున్నారో చూడండి.
ఎన్.డి.తివారీ: ఎవరున్నారమ్మా! ఎవరూలేరుగా...
కొండాసురేఖ: ఎందుకులేరుసార్. ఇదిగో ఈమె సబితారెడ్డి. నా అక్క. చూడక్కా, నువ్వు ఇక్కడే ఉంటే తివారీ సార్ జోకులేస్తున్నారు. ఇదిగో, బొత్సా అన్న, రఘువీరారెడ్డిసార్, దానం నాగేంద్రసార్..ఇంకా వస్తున్నారుసార్. మీకు కనబడటంలేదా...?
ఎన్.డి.తివారీ: ఓహో...ఇలా కూడా అనిపిస్తుందన్నమాట.
కొండాసురేఖ:
తొందరగా రాజీనామా పత్రంపై సంతకం పెట్టండిసార్. జగన్ కళ్లలో ఆనందం చూడాలి. ఈ లేఖను తీసుకెళ్ళి వైఎస్సార్ సమాధిమీద పెట్టాలి.
ఎన్.డి.తివారీ: ఓహో, అలా డిసైడైపోయావాతల్లీ.
అంతలో కొండా సురేఖ పీఏ పరుగుపరుగునవచ్చి, `మేడం, మీరు రాంగ్ అడ్రస్ కివచ్చారు. ఈయన మీరనుకున్న ఎన్.డి. తివారీకారు. సైక్రియాట్రిస్ట్ తివారి. పదండి రైట్ అడ్రస్ కి వెళ్దాం.
ఎన్.డి.తివారీ: ఇది నీకు రాంగ్ అడ్రస్ కావచ్చు. కానీ నాకు మాత్రం ఈమె రైట్ పేషెంటే అనిపిస్తోంది...
కొండాసురేఖ: ఓహో, మీకు అలా అనిపిస్తోందా!
ఎన్.డి.తివారీ: కన్ఫర్మ్ గా...ముందు నా ఫీజిచ్చివెళ్ళండి.
-కణ్వస

చిరుతో జగన్ కి `చెక్' !

ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పంచన చేరడంతో ఇప్పటివరకు సీఎం కుర్చీపై ఆశలు పెట్టుకున్న జగన్ షాక్ అవ్వాల్సి వచ్చింది. గ్రేటర్ ఎన్నికలను అడ్డుగా పెట్టుకుని కాంగ్రెస్ అధిష్ఠానం జగన్ ని ఎదుర్కునే రాజకీయశక్తిని సమకూర్చునే పనిలో పడింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
  • వైఎస్సార్ ఉన్నంతకాలం రాష్ట్రం కాంగ్రెస్ కు ఛరిస్మా ఉన్న నేత లోటులేకుండాపోయింది. అంతా తనొక్కడే అన్నట్టుగా వైఎస్సార్ చక్రం తిప్పారు.
  • వైఎస్సార్ దుర్మరణంతో అనూహ్యమైన రీతిలో పార్టీలో గ్లామర్ పడిపోయింది. ఉన్న నాయకుల్లో సామర్థ్యం ఉన్నవారిలో జనాకర్షక శక్తిలేకపోవడమో, లేదా జనాకర్షక శక్తి ఉన్న నేతల్లో పాలనాసామర్థ్యం లేకపోవడమో ఆ పార్టీని వేధించింది.
  • వైఎస్సార్ తనయుడు జగన్ మోహన్ రెడ్డికి నిస్సందేహంగా జనాకర్షణ ఉంది. అయితే, దుందుడుకు చర్యలతో ఆయన అధిష్ఠానానికి దూరమవుతున్నారు.సీఎం పదవి దక్కించుకోవడం కోసం పంతం పట్టడం పార్టీ అధిష్ఠానానికి నచ్చడంలేదు. అయితే ఆయనకున్న జనాకర్షక శక్తిని శంకించడంలేదు. ఫ్యాక్షనిస్టు ముద్రఉన్న నేతను ప్రోత్సహించి కొరివితో తలగోక్కోవడంకంటే, మరో యువనేతను ప్రోత్సహించడం మంచిదన్న ఆలోచన కాంగ్రెస్ శిబిరాల్లో వినబడుతోంది. వృద్ధనేతలు కూడా ఇందుకు అమోదముద్రవేశారు. తాము వెనుకఉండి నడిపిస్తామనీ, ముందుకు దూసుకుపోగల శక్తివంతుడు కావాలని ఇప్పటికే పలువురు సీనియర్లు చెప్పారు.
  • ఈ నేపథ్యంలో ప్రజారాజ్యం అధినేత చిరంజీవి కాంగ్రెస్ దృష్టిలో పడ్డారు. ముందుగా గ్రేటర్ ఎన్నికల్లో పొత్తుగానైనా మెగాస్టార్ ని దగ్గరకుతీసి ఆ తరువాత తమపార్టీలో ప్రజారాజ్యాన్ని విలీనం చేసుకోవాలన్నదే కాంగ్రెస్ ఎత్తుగడ.
  • ఇదే జరిగితే, జగన్ ని ఎదుర్కోగల ఆకర్షణఉన్న నాయకుడు కాంగ్రెస్ జేబులో ఉంటాడు. అందుకే ముఖ్యమంత్రి రోశయ్య తిరుపతిలో చిరంజీవితో సాగించిన రహస్య సమాలోచనప్పుడు ఓగట్టి హామీని ఇచ్చినట్టు తెలిసింది.గ్రేటర్ ఎన్నికలు కాగానే రోశయ్య తన వ్యూహాన్ని అమలుచేయవచ్చు.
  • గ్రేటర్ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయానికి చిరంజీవి సహకరిస్తే, అందుకు ప్రతిఫలంగా చిరుకు రోశయ్య మంత్రివర్గంలో స్థానం దక్కవచ్చు. హోంమంత్రిగా చిరంజీవిని తీసుకునే అవకాశాలు లేకపోలేదు.
  • మంత్రి పదవి ఆశతోనే చిరంజీవి కాంగ్రెస్ కు దగ్గరవుతున్నారు. పనిలోపనిగా చిరంజీవి రూపంలో వచ్చిన సదావకాశాన్ని కాంగ్రెస్ నేర్పుగా ఉపయోగించుకుని జగన్ రాజకీయ భవితకు దెబ్బకొట్టవచ్చు.
  • జగన్ ని కూడా `గ్రేటర్' ప్రచారంలో ఉపయోగించుకోవాలని కూడా కాంగ్రెస్ యోచిస్తోంది. అయితే ఒక వొరలో రెండు కత్తులు ఇమడవుకనుక జగన్ దీనికి దూరంగా ఉండవచ్చు.
  • మొత్తానికి భవిష్యత్తులో జగన్ ప్రాభవాన్ని అడ్డుకునే శక్తిగా చిరంజీవిని ఉపయోగించుకోవాలన్నదే కాంగ్రెస్ ఎత్తుగడలా కనబడుతోంది. అదే సమయంలో మీడియానుంచి పాలిటిక్స్ లోకి వద్దామనుకుంటున్న రవిప్రకాష్ వంటి యువనేతలను కూడా కాంగ్రెస్ ఇదే తరహాలో వాడుకోవచ్చు.
- కణ్వస

ఫోకస్: పీఆర్పీ కాంగ్రెస్ పాలె`కాపు'

మెగాస్టార్ చిరంజీవి ఏ లక్ష్యంతో ప్రజారాజ్యాన్ని స్థాపించారో, ఆ లక్ష్యాన్ని తుంగలోకితొక్కి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసం కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకోవడంతో ఇంతకాలంగా వేసుకున్న ముసుగు తొలిగిపోయినట్టైంది. అసలు ప్రజారాజ్యం పార్టీ పెట్టిందే అధికార కాంగ్రెస్ అవినీతిని ఎండగట్టడానికి. ఈ సంగతి ముందుగానే పసిగట్టడం వల్లనే అసలు ఈ పార్టీనే మొగ్గతొడగకుండా చేయాలని అప్పట్లో కాంగ్రెస్ నేతలు శతవిధాలా ప్రయత్నించారు. దాసరి నారాయణరావు వంటి సీనియర్లను రంగంలోకి దింపి చిరంజీవికి అనేక విఘ్నాలు సృష్టించారు. చివరకు చిరంజీవి పర్సనల్ లైఫ్ లో లొసుగులు బయటకులాగే ప్రయత్నాలు జరిగాయి. చిరంజీవి రెండవ కుమార్తె శ్రీజ వివాహం అనంతరం నూతన దంపతులకు అండగా ఉండేవిషయంలో కూడా కాంగ్రెస్ పరోక్షంగా జోక్యం చేసుకున్నట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. చిరంజీవికి అడుగడుగునా మనస్తాపం కలిగించడానికి కాంగ్రెస్ నేతలు చేయని ప్రయత్నంలేదు. అయినా చిరంజీవి ఒక శుభముహర్తాన ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. మార్పుకోసమే తాను ఈ పార్టీ పెట్టినట్టు చెప్పుకున్నారు. అవినీతి కాంగ్రెస్ పాలనను అంతం చేస్తామంటూ భీషణఘోషణ శపథాలు చేశారు. బలుపోవాపో నిర్ధారించుకోలేక సార్వత్రిక ఎన్నికల్లో అన్ని సీట్లలో తన అభ్యర్థులను నిలబెట్టారు. మహాకూటమిలో చేరమంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు రాయ`బేరాలు' సాగించినా కాదుపొమ్మన్నారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచీ ప్రజారాజ్యం నేలమీద నడవటం మొదలుపెట్టింది. సరిగా ఇదే సమయంలో రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్సార్ ప్రజారాజ్యాన్ని దగ్గరతీయడానికి ప్రయత్నించారు. తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన చిరంజీవి కూడా వైఎస్సార్ వైఖరిపట్ల ఆశ్చర్యచికుతులై కాంగ్రెస్ ని పొగడ్తలతో ముంచెత్తారు. వైఎస్సార్ దుర్మరణంతో ప్రజారాజ్యం అధికార కాంగ్రెస్ కి మరింత చేరువైంది. తిరుపతిలో ముఖ్యమంత్రి రోశయ్య, చిరంజీవి గంటన్నరసేపు రహస్య సమాలోచనలు జరిపినప్పుడే మెగాస్టార్ పొలిటికల్ మెగావ్యూహం అర్థమైంది. ఒక దశలో జగన్ వర్గీయులకు అండగా ఉండాలని కూడా అల్లుఅరవింద్ వ్యూహం రచించారు. అయితే అధిష్ఠానం జగన్ ని దూరంగా ఉంచడంతో సీను అర్థం చేసుకున్న ప్రజారాజ్యం ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ కు లొంగిపోయింది. పార్టీ పెట్టినప్పుడు ఏ లక్ష్యాలను ఎంచుకుందో, వాటినన్నింటినీ తుంగలోకి తొక్కేసిన చిరంజీవి ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీకి సిద్ధమయ్యారు.
ఈ మొత్తం వ్యవహారంతో ఒక్క విషయం బాగా అర్థమైంది, అదేమంటే, చిరంజీవికి పాలి`ట్రిక్స్' బాగానే ఒంటబట్టాయి. ఇక ఫర్వాలేదు. ఎలాగో సిద్ధాంతాలులేని పార్టీగానే ముద్రపడింది కనుక ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పంచన పాలె`కాపు'గా ఉంచడమే మంచిది.
- కణ్వస