Saturday, October 31, 2009

ఎడిటర్స్ వాయిస్: తెలుగుతల్లి కంటనీరు

తెలుగుతల్లి ఆంధ్రావారికే సొంతమనీ, తెలంగాణవారికి వేరే తల్లి ఉన్నదన్న వాదన ఈమధ్య బలపడుతోంది. కడప జిల్లాలోని సెయింట్ జోసెఫ్ స్కూల్ లో పిల్లలు తెలుగుమాట్లాడకూడదంటూ ఆంక్షలు విధించడంతో రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్య తీసుకుంటూ అన్ని పాఠశాలల్లోనూ `మా తెలుగుతల్లికి మల్లెపూదండ' గేయాన్ని విద్యార్థులచేత పాడించాలంటూ ఆదేశాలిచ్చింది. మాతృభాష అడుగంటిపోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉన్నట్టుండి మరో వివాదానికి తెరలేపింది. తెలంగాణ ప్రాంత విద్యార్థులు `మా తెలుగు తల్లికి మల్లెపూదండ' పాట పాడాల్సిన అవసరం లేదని కొందరు తెలంగాణ కవులు, మేథావులు పాయింట్ లేవనెత్తారు. తెలంగాణ పాటలు పాడే దేశ్పతి శ్రీనివాస్ మరో అడుగుముందేకిసి `మీ తెలుగుతల్లి మల్లెపూదండలు వేసుకుంటే వేసుకోమనండీ, మా తెలంగాణ తల్లి మాత్రం బంతిపూదండలు వేసుకుంటుంది...ఆ పాటలో తెలంగాణ వారి పట్ల అన్యాయం ధ్వనిస్తోంది. గలగలా గోదావరి కదిలిపోతుంటేను...అని పాడుతున్నారు. అంటే ఈ గోదావరి మా తెలంగాణ గడ్డమీద నుంచి కదలిపోతుంటే మేము చూస్తుండిపోవాలా...ఇక, బిలబలా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, అని పాడుతున్నారు, అంటే, కృష్ణమ్మ కూడా పరుగులెత్తుకుంటూ ఆంధ్రవాళ్లవైపు వెళుతుంటే ఇక మాకేం మిగిలుతుంది...కష్టాలు, కన్నీళ్ళా?...ఇలాంటి పాటలు మాకొద్దు. మా పిల్లలచేత ఇలాంటి పాటలు పాడించం. ఈ తెలుగుతల్లి మాకొద్దూ...మా తెలంగాణతల్లి పాటలే మా పిల్లలు పాడుకుంటారు. ఆ తల్లికే బంతిపూల దండలు వేస్తుంటారు' అంటూ ఎంతో భావోద్వేగంతో అన్నారు.
ఆయనలాజిక్ అయినది. అయితే, ఓ చిన్న వాస్తవాన్ని మరిచిపోతున్నట్టున్నారు ఈ మేథావులంతా. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ...ఏ ప్రాంతంలోని వారైనా మాట్లాడేది తెలుగే అయినప్పుడు, వారి మాతృభాష తెలుగు అయినప్పుడు తెలుగుతల్లిని అగౌరవపరచడంలో అర్థంలేదు. మరో విషయమేమంటే, తెలుగుతల్లిని తెలంగాణ తల్లితో పోల్చకూడదు. తెలుగుతల్లి భాషకు ప్రతీక. తెలంగాణ తల్లి ప్రాంతానికి ప్రతీక. అలాంటప్పుడు ఈ రెంటినీ కలిపేసి విబేధాలు సృష్టించి లేతమనసుల్లో విషం ఎక్కించడం మంచిదేనా?
అవాంఛనీయమైన ఇలాంటి వ్యాఖ్యలవల్ల తెలుగుతల్లి కంటనీరు పెడుతున్నది. ఇది అత్యంత శోచనీయం. ఈ సమస్యను మొగ్గగా ఉన్నప్పుడే త్రుంచివేయడం మంచిది.
మీ అమూల్యమైన అభిప్రాయాలను నారదలోకం ఆహ్వానిస్తోంది. చర్చలో పాల్గొనండి. సమస్య పరిష్కారానికి ఓ చక్కటి సలహా ఇవ్వండి.
(ఈ వ్యాసానికి సూచనలు ఇస్తున్న పాఠక మిత్రులకు ధన్యవాదాలు)
- ఎడిటర్

Friday, October 30, 2009

పాపం కొండా సురేఖ (పార్ట్ 1)

బంగారంలాంటి మంత్రి పదవిని తన ప్రియతమ దివంగతనేత వైఎస్సార్ మీద పెంచుకున్న అభిమానాన్ని లోకానికి చాటడంకోసం త్యాగం చేసిన ఘనత కొండా సురేఖదే. తన అభిమాననేత వైఎస్సార్ కుమారుడు జగన్ కు సీఎం పదవి ఇవ్వకుంటే తాను మంత్రిపదవికి రాజీనామా చేస్తానని ఇంతకుముందే పలుమార్లు బాహాటంగానే చెప్పన కొండా సురేఖ, ఇప్పుడు అన్నంతపనీ చేశారు. సత్యవాక్ పరిపాలన పట్ల గౌరవం ఉన్నవారంతా ఈచర్యను తప్పకుండా హర్షించాల్సిందే. కుళ్లిపోయిన రాజకీయకాసారంలో మాటమీద నిలబడేవాళ్లెవరుంటారు చెప్పండి ఒక్క కొండా సురేఖ తప్ప. అందుకే రాష్ట్ర రాజకీయాల్లో కొండాసురేఖ పేరు త్యాగానికి మారుపేరుగా నిలిచిపోతుంది.
ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ మీడియా అభాండాలు వేయడం మానడంలేదే. కొండంత పదవిని మన కొండా దూదిపింజలా తీసిపారేసినా `కరడుగట్టిన' ఈ మీడియాకు కనికరం కరగలేదు. రెండు పత్రికలూ, కొన్ని టీవీ ఛానెళ్లు పనిగట్టుకుని, కులప్రాతిపదికన తనపై బురదచల్లారన్నదే సురేఖ ఉవాచ. ఇప్పుడు రాజీనామా చేసినా ఈ`కరడుగట్టిన మీడియా' మనసు మారలేదు. జగన్ కి చెప్పకుండా, పెద్దాయన కేవీపీ సూచన తీసుకోకుండా, ఆమాట కొస్తే ఇంటాయనకీ, పిల్లలకు కూడా చెప్పకుండా తాను నేరుగా, సూటిగా గవర్నర్ ని కలిసి ఆరుపేజీల రాజీనామా పత్రాన్ని సమర్పిస్తే, అనితరసాధ్యంగా ఇంతటి త్యాగానికి సిద్ధపడితే- ఛీ...ఈ పాడు మీడియా మళ్ళీ కేజీలకొద్దీ బురద తీసుకొచ్చి తనపై చల్లుతుందా...ఇదేమన్నా బాగుందా..అంటూ పాపం కొండా సురేఖ కుమిలిపోవాల్సి వస్తున్నది.
కొండా సురేఖ సత్యాన్ని నమ్ముకుంది. అందుకే మాటలు మార్చకుండా అన్నమాటమీదనే నిలబడి రాజీనామా చేసింది. అయితే అంతమాత్రాన ఆమె పదవీత్యాగం వెనుక ఉన్న నిజాలు సమాధికావు. ఫ్యాక్షనిస్టు రాజకీయాలు చాపకిందనీరులా ఎలా పాకుతుంటాయో చెప్పడానికి కొండా సురేఖ రాజీనామా ఉదంతం ఓ దష్ఠాంతం మాత్రమే. సురేఖ రాజీనామా వ్యవహారాన్ని అంత తేలిగ్గా తీసిపారేయకూడదు. ఈ వ్యవహారంపై రెండు వాదనలు వినవస్తున్నాయి.
1. అమాయకపు కోణం: దివంగత నేత వైఎస్సార్ పట్ల పెంచుకున్న విపరీతమైన అభిమానంతో మంత్రి పదవికి రాజీనామా చేయడం కేవలం భావోద్వేగపూరిత చర్య.
2. ఫ్యాక్షనిస్టు రాజకీయ కోణం: తేనెపూసిన కత్తి... చాపకిందనీరు...తడిగుడ్డతో గొంతులు కోయడం...వంటి పదాలు మీరు వినే ఉంటారు. అలాంటిదే ఫ్యాక్షనిస్టు రాజకీయం కూడా. కొండా సురేఖ ఇంతగా భావోద్వేగానికి గురికావడం వెనుక ఫ్యాక్షనిస్టు కుట్ర ఉన్నదన్నది రెండో వాదన.
అయితే, పైన చెప్పిన రెండు విడివిడి వాదనలు ఒక పాయింట్ దగ్గర మిళితమవడం మరో ఆశ్చర్యకరమైన పరిణామం. పైకి చూడటానికి ఈ రెండూ విడివిడి వాదనలుగా కనిపిస్తున్నా ఒకచోట మమేకం అవడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
( ఆవివరాలు తరువాయి భాగంలో)
- కణ్వస

Wednesday, October 28, 2009

అమ్మమాట


చిన్నారులను చదువుకోవద్దనే
తాలిబన్లకన్నా,
పాఠశాలల్ని నిలువునా పేల్చేసే
నక్సలైట్లకన్నా,
స్కూల్ లో తెలుగుమాట్లాడవద్దనే

`సెయింట్‌ జోసఫ్‌లే'
యమడేంజర్రా కన్నా

- శ్రీదేవి

కర్నాటకలో `జగన్నాటకం'

కర్నాటకలో యడ్యూరప్ప నాయకత్వంలోని బిజెపీ ప్రభుత్వం ఎదుర్కుంటున్న రాజకీయ సంక్షోభం వెనుక వైఎస్ జగన్మోహనరెడ్డి హస్తం ఉన్నదని చెబితే చాలామంది నమ్మకపోవచ్చు. కానీ, ఇది నమ్మలేని నిజం. `నారదలోకం' సేకరించిన సమాచారం ప్రకారం ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
  • ముఖ్యమంత్రి యడ్యూరప్పపై ఆ రాష్ట్ర రెవెన్యూ మంత్రి గాలి కరుణాకరరెడ్డి, పర్యాటక శాఖ మంత్రి గాలి జనార్ధనరెడ్డి తిరుగుబాటుబావుటా ఎగురవేశారు.
  • తమ వ్యాపారాలకు (ప్రధానంగా గనుల వ్యాపారానికి) ముఖ్యమంత్రి యడ్యూరప్ప అడ్డుతగులుతుండటంతో గాలిసోదరలు మండిపడుతున్నారు.
  • గనుల నుంచి తరలించే ఇనుప ఖనిజం రవాణా విషయంలో యడ్యూరప్ప ఆంక్షలు పెట్టడంతో గాలిసోదరలకు కాలింది.
  • ట్రక్కులపై రహదారి అభివృద్ధి సుంకం విధించడం వీరికి నచ్చలేదు. దీంతో కోట్లకు పడగలెత్తిన గాలిసోదరులు తిరుగుబాటుబావుటా ఎగురవేశారు.
  • సరిగా, అదే సమయంలో `జగ'న్నాటకం మొదలైంది. ఆంధ్రప్రదేశ్ లో సీఎం పదవి కోసం జగన్ ఎంతగా ప్రయత్నించినా అధిష్ఠానం మాటవినలేదు. దీంతో జగన్, అతని వ్యాపార మిత్రులు గాలి సోదరులు కొత్త వ్యూహం రచించారు.
  • ఈ వ్యూహం ప్రకారం, కర్నాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన తీసుకువస్తే అధిష్ఠానం సంతృష్టి చెందుతుంది. కర్నాటకను కానుకగా ఇచ్చినందుకు ప్రతిఫలంగా జగన్ ని ఆంధ్రప్రదేశ్ సీఎం చేయమని గాలిసోదరులు అధిష్ఠానాన్ని అడిగే అవకాశం వస్తుంది.
  • ముఖ్యమంత్రిని మార్చాలన్న మొదటి వ్యూహాన్ని వెనక్కి తీసుకుని, కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావన్న సరికొత్తవ్యూహం తెరపైకి వచ్చింది.
  • ఇప్పటికే 40 మంది ఎమ్మెల్యేలను తమ గుప్పెట్లో పెట్టుకున్న గాలిసోదరులు ఏకంగా బిజెపీ ప్రభుత్వాన్నే పడగొట్టి గత ఎన్నికల్లో 80 సీట్లు తెచ్చుకున్న కాంగ్రస్ కి సపోర్ట్ ఇచ్చేయాలనుకుంటున్నారు. తద్వారా తమ ప్రియతమ మిత్రుడు జగన్ ఏకైక కోరిక తీర్చాలని కంకణం కట్టుకున్నారు.

Tuesday, October 27, 2009

లుచ్ఛా, లఫంగా...ఇది మాభాష


''లుచ్ఛా..., లఫంగా..., బద్మాష్‌... బేకారుగాళ్ళనేది మా తెలంగాణ సొంత భాష. పనికిరానోళ్ళను, గలత్‌ పని సేసేటోళ్ళను, తప్పులు జేసేటోళ్ళను, ఉల్టాఫల్టాగాళ్ళను, ఇట్లాంటోళ్ళను ఇట్లనే అంటం... నా గల్లిdలో, నా తెలంగాణలో ఇదే యాసతో మాట్లాడుతం... అర్థం తెలియకపోతే మీ ఖర్మ... తెలుసుకుని మాట్లాడుండి'' ఇదీ,తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు ప్రెస్ మీట్ లో భాషా శాస్త్రాలపై చేసిన సవాల్‌.
''నేను డబ్బుల కోసం ఉద్యమాన్ని చేస్తున్నానని కొందరు సన్నాసులు అంటుంరు, ఈ సంగతిని రుజువుచేస్తే నేను ముక్కు నేలకు రాస్తానని, నాపై సవాల్‌ విసిరే వారికి సిగ్గు, లజ్జ, దమ్ముంటే వైఎస్‌ హయాంలో ఆక్రమణకు గురైన భూములను దున్నుందాం, నార్నే సంస్థ చెర్లపల్లి, గంగాపురం, ఈస్ట్‌సిటీ, కమ్మెటి వంటి గ్రామాల్లో ఆక్రమణకు గురైన భూములను దున్నుదాం, 4లక్షల కోట్ల విలువైన ఆర్యసమాజ్‌, గోకుల్‌ ట్రస్టు భూముల్లో కొంత భాగంలో వైఎస్‌ వివేకానందరెడ్డి పెద్ద భవంతినే నిర్మించాడని, దమ్ముంటే దాన్ని కూడా కూల్చుదాం రండి''- ఇది కేసీఆర్ విసిరిన మరో ఛాలెంజ్.
''`మా భాషను తప్పుబడతున్నారు, దీనిపై మాట్లాడేందుకు శతావధానులను, అష్ఠావధానులను పిలిపించండి, చర్చకు సిద్ధమే''
మా నుడికారం, పడికట్టును విమర్శిస్తారా, తుర్క భాష కలిసిందంటారా, ఇదంతా సమస్యను పక్కదోవ పట్టించేందుకేగా....మా భాష వాడిగా వేడిగా ఉంటుంది, పరుషంగా ఉంటుంది. ఇది మా యుద్ధంలో భాగం-'
ఇది సినిమా కాదు, రాసి మాట్లాడేది కాదు, ఆవేశం, అర్తనాదాల నుంచి వెలువడుతున్న తొలి కేక
కేసీఆర్ తెలుగు భాషపైనా, మాండలికంపైనా చేస్తున్న వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా?
...మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి.

Monday, October 26, 2009

జగన్ కి పీసీసి పదవి అప్పగించిన టివీ9 !

ఉన్నట్టుండి టివీ9 సీఈఓ రవిప్రకాష్ బుర్రలో మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఫ్లాష్ వెలిగిందే తడువుగా స్కోల్స్ లో బ్రేకింగ్ న్యూస్ ఇచ్చేయమంటూ ఆదేశించారు. ఇంతకీ ఆ బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే,
జగన్ కి పీసీసి పదవి... డిఎస్ కి ఉద్వాసన
ఆసక్తికరమైన న్యూస్ కావడంతో అంతా ఆసక్తిగా గమనించారు. మరికాసేపట్లో ఈ వార్తపై సమగ్ర కథనాన్ని కూడా టివీ9 ఇచ్చింది. ఆ కథనంలోని సారాంశమేమంటే, ఢిల్లీలో షకీల్ అహ్మద్ అనే కాంగ్రెస్ పెద్దాయన సదరు ఛానెల్ వారికి స్వయంగా చెప్పారట. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షపదవి నుంచి డి.శ్రీనివాస్ ని తొలగించి, ఆ స్థానాన్ని జగన్ తో భర్తీ చేస్తారట. షకీల్ అహ్మద్ స్వయంగా చెప్పారని అంటే అంతా నమ్మేస్తారన్నది ఆ టివీ ఛానెల్ వారి ప్రగాఢ నమ్మకం. అయితే, అంత`లావుపాటి' వార్త నిమిషాల్లో దూదిపింజలా వీగిపోయింది. అది నిజంకాదని తేలిపోయింది. ఈ వార్త కేవలం టివీ9 బుర్రలో పుట్టినదేనని అందరికీ తెలిసిపోయింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ వీరప్ప మొయిలీ కూడా ఇదంతా మీడియా సృష్టేనంటూ తేల్చిచెప్పడంతో టివీ9 గతుక్కుమంది. ఎలా సర్దిచెప్పుకోవాలో తెలియక తికమకపడింది.
అసలు జగన్ కి పీసీసి పదవి అప్పగించాలన్న ఆలోచన టివీ9కి ఎందుకు వచ్చింది? అందుకు రెండు కారణాలు చెప్పుకోవచ్చు. అవి...
1. ఈమధ్య మీడియా మధ్య పోటీ పెరిగిపోవడంతో టివీ9 కలవరపడుతోంది. తన మొదటి స్థానాన్ని ఎక్కడ ఎవరు కొట్టేస్తారోనన్న దిగులు మొదలైంది. అందుకే మొన్నటి వరదలప్పుడు కర్నూలుని ముందుగానే ముంచేసింది. నిన్నటినిన్న హైదరాబాద్ నిమ్స్ లో నర్సులపై లైంగిక వేధింపులంటూ తప్పుడు వార్తను ప్రచారంచేసి చేయికాల్చుకుంది. అది చాలదన్నట్టుగా ఇప్పుడు జగన్ కి పీసీసి పదవి అప్పగించింది. రేటింగ్ తగ్గిపోతుందేమోనన్న భయం ఆవహించినప్పుడల్లా రవిప్రకాష్ కి తన బుర్రలోనుంచి వార్తలు తీయడం అలవాటైపోయింది.
2. ఎలక్ట్రానిక్ మీడియాకే తాను మకుటంలేని మహారాజునని అనుకుంటున్న రవిప్రకాష్ ఈ మధ్యనే పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం కూడా ఈ యవ శక్తి అవసరం ఉన్నదనే భావిస్తూ ఎంకరేజ్ చేస్తున్నది. 2014 ఎన్నికల వేళకు జగన్ కు గట్టిపోటీ ఇచ్చే `మగధీరుడి'గా రవిప్రకాష్ ను కీర్తించడంతో నిజంగానే తానంతటివాడినైపోయినట్టు కలలుకనడం రవిప్రకాష్ వంతైంది. పనిలోపనిగా జగన్ ని తన రాజకీయ శత్రువుగా చూడటం మొదలుపెట్టాడు. జగన్ కి సీఎం సీటు ఇవ్వకపోవడంతో కొంత శాంతించినా ఎప్పటికైనా జగన్ పైకి లేచి తనకు పోటీ అవుతాడన్న భయం లేకపోలేదు. జగన్ ను రాజకీయనేతగా పూర్తిగా అణిచివేయాలంటే మీడియా ద్వారా అందలం ఎక్కించడమే సరైన మార్గంగా భావించారు. పిసీసి పదవి జగన్ కి అప్పగిస్తున్నారంటూ వార్త ఇవ్వడంలో అసలు ఉద్దేశం జగన్ కు మేలు చేయాలని కాదు. ఆ యువరాజకీయ శక్తిని పూర్తిగా నిర్వీర్యం చేయడానికే. పైకి జగన్ కి ఫేవర్ గా అనిపించే ఈ వార్తలో అసలు లోగుట్టు, అతనికి కీడు చేయడమే. ఈ రాజకీయ డ్రామాకు రవిప్రకాష్ తన మీడియాను ఆయుధంగా వాడుకున్నాడని చెప్పుకుంటున్నారు.
మరి ఇందులో ఏది నిజం...నారాయణ...నారాయణ...

సెకండ్ టర్మ్ ఆర్నెల్లేనని వైఎస్సార్ కి ముందే తెలుసు !


ఈ సృష్టిలో ఏవిఎందుకు జరుగుతాయో తెలుసుకోగలిగితే మనిషి కూడా దేవుడైపోతాడు. ఈ క్షణానికి ఈ దేహం నీసొంతం. కానీ మరుక్షణంలో ఏమవుతుందో చెప్పలేం. రాబోయే విపత్కర పరిణామాలను సూఛాయగా గ్రహించి చెప్పగలిగిన జ్యోతిష పండుతులు దాదాపుగా అన్నిమతాల్లో ఉన్నారు. క్రైస్తవ మతగురువులు, జ్యోతిష పండితులు వైఎస్సార్ జాతకాన్ని చాలా క్షుణ్నంగా పరిశీలించారు. రెండవసారి సీఎం అవుతారనీ, ప్రజాభిమానాన్ని చోరగొంటారని కూడా చెప్పారు. చివరకు అదే జరిగింది. కానీ... సెకండ్ టర్మ్ లో సీఎంగా ఆ జనహృదినేత ఆరునెలలుకూడా ఉండలేకపోయారు. హెలికాప్టర్ దుర్ఘటనలో దివంగతులయ్యారు. ఇలా ఎలా జరిగింది? ఈ విపత్తను మతగురువులు, భవిష్యదర్శకులు ముందగా గ్రహించలేకపోయారా...?
ఇది నిజం కాదు. భవిష్య దర్శకులు ముందుగానే పసిగట్టారు. రెండవసారి వైఎస్సార్ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించిన తరువాత మతపరంగా పుణ్యస్థలమైన జెరూసెలం వెళ్ళారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండేలా ఆకాంక్షిస్తూ ప్రార్థనలు చేయమన్నారు. అదే సమయంలో ఆయనకు ఓ చేదునిజం తెలిసింది. సెకండ్ టర్మ్ ఆర్నెల్లు లేదా అంతకన్నా తక్కువగానే ఉంటుందని క్రైస్తవ జ్యోతిష పండితుడొకరు చెప్పారు. వైఎస్సార్ ఒక్కసారిగా షాకయ్యారు. తనకలల ప్రాజెక్ట్ జలయజ్ఞం పూర్తిగా కాకుండానే తాను సీఎం పదవినుంచి దిగిపోతానా...మరో ఐదేళ్లు ప్రజలకు సేవచేసే అవకాశం జారిపోతుందా...అంటూ కలవరపడ్డారు. ప్రజల గురించి తపిస్తున్న వైఎస్సార్ ని చూసి క్రైస్తవ పండితులు, మత గురువుల హృదయాలు ద్రవించాయి. వెంటనేవారు, వైఎస్సార్ క్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్సార్ తన `జీవితకాలమంతా' ముఖ్యమంత్రిగానే ఉండేలా చూడు ప్రభువా...అంటూ ప్రార్థనలు చేశారు. ప్రభువు తప్పక కరుణిస్తారనీ, మీరు చివరి శ్వాసవరకూ సీఎంగానే ఉంటారని ఆ పండితులు శుభాశీస్సులు అందించారు.
అలా శుభాశీస్సులు అందుకున్న తరువాత, వైఎస్సార్ రాష్ట్రానికి తిరిగివచ్చారు. జ్యోతిష పండితులు చెప్పిన మాటలను విశ్లేషించారు. సెకండ్ టర్మ్ ఆర్నెల్లలోపు ఎలా పోతుందాఅని ఆలోచించారు. కెవీపీ వంటి వారిని సలహాలు అడిగారు. మెజారిటీలో ఉన్న ప్రభుత్వం పడిపోవాలంటే అది మైనార్టీలోకి జారుకోవాలి. తెలంగాణా లేదా మరేదైనా ఆందోళన వచ్చి సీనియర్లు, తనంటే గిట్టని వాళ్లు రాజీనామాలకు సిద్ధపడాలి. ఒకవేళ తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాల్సివస్తే కొంతమంది ఎమ్మెల్యేలు జారుకున్నా, ఆ లోటును భర్తీ చేయడానికి వేరే పార్టీల్లోని ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. అందుకే వైఎస్సార్ `ఆకర్ష' పేరిట వల విసిరారు. ఎలాంటి రాజకీయ కుట్రలు జరిగినా తన ప్రభుత్వం మైనార్టీలోకి జారకూడదన్న ఏకైక లక్ష్యంతోనే ఇతర పార్టీల వారికోసం తలుపులు బార్లాతెరవడం మొదలుపట్టారు. వైఎస్సార్ ఇలా ఎందుకు చేస్తున్నారో తెలియక మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. దీనిపై చర్చలు ఊపందుకున్నాయి. కానీ వైఎస్సార్ అంతరంగంలోని ఆందోళనను మాత్రం ఎవ్వరూ గ్రహించలేకపోయారు.
రోజులు గడుస్తున్నాయి. నెలలు దొర్లుతున్నాయి. వైఎస్సార్ లోపల మదనపడుతున్నా, పైకి మాత్రం చెక్కుచెదరని చిరునవ్వులతోనే ప్రజాసంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందుకు సాగుతున్నారు. అసెంబ్లీలో ఒక సందర్భంలో ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడుతో - `చూడు, చంద్రబాబూ, నువ్వెన్నాళ్లు ఉంటావో, నేను ఎన్నాళ్లు ఉంటానో తెలియదు. ఉన్నన్నాళ్లూ మంచి పనులు చేయాలి. ప్రజలచేత మంచి అనిపించుకోవాలి' అంటూ వేదాంతధోరణిలో మాట్లాడారు. అయినా ఆమాటలను మీడియాగానీ, వైఎస్సార్ సన్నిహితులుగానీ అంతగా పట్టించుకోలేదు. ఆయన సహజధోరణిలోనే మాట్లాడారనే అంతా అనుకున్నారు. వైఎస్సార్ లోపల అగ్నిగుండం రగులుతోందనీ, ప్రజాసేవ ఏక్షణంలో ఆగిపోతుందోనన్న దిగులు పెరిగిపోతుందని ఎవ్వరూ గ్రహించలేకపోయారు.
సెప్టెంబర్ వచ్చింది. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే వైఎస్సార్ ప్రజలకు మరింత చేరువకావడం కోసం `రచ్చబండ' కార్యక్రమం ఏర్పాటు చేసుకుని చిత్తూరు జిల్లాకు బయలుదేరారు. వాతావరణం సరిగాలేదని ఇంట్లో సతీమణి వారించినా, మంత్రల్లో కొందరు అడ్డుతగిలినా ప్రజాసేవే పరమార్థంగా భావించిన వైఎస్సార్ అడుగు ముందుకేవేశారు. `హెలికాప్టర్ బాగుందా...?' అంటూ దానివైపు తేరపారా చూశారు. ఆ చూపులో ఏదో సందేహం...కానీ బయటపెట్టలేదు. ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రానివ్వకుండా అదే చిరునవ్వుతో హెలికాప్టర్ ఎక్కారు. తోడువచ్చిన వారు చెబుతున్న వీడ్కోలుకు ప్రతిస్పందనగా తానూ చేయి ఊపరు. ఆ చిరునవ్వుతోనే ఆకాశంలోకి ఎగిరారు. ఆ నవ్వుమోముతోనే అదనంత ఎత్తుకు ఎగిరిపోయారు.
జ్యోతిష పండితులు చెప్పేందే నిజమైంది. ప్రియతమనేత వైఎస్సార్ సెకండ్ టర్మ్ ఆర్నెల్లలోపే ముగిసింది. వారు చేసిన ప్రార్థనలు కూడా ఫలించాయి... వైఎస్సార్ జీవితాంతం ముఖ్యమంత్రిగానే ఉన్నారు. చివరి శ్వాసదాకా ప్రజాసేవకోసమే తపించారు. కానీ విధిని ఎవ్వరూ తప్పించలేరు. మరణ రహస్యాన్ని ఏ జ్యోతిష పండితులు కూడా ఛేదించలేకపోయారు.
-సీహ

Sunday, October 25, 2009

సెటైర్: వైఎస్సార్ వీలునామాలో సీఎం సీటు!

జగన్ ఇప్పుడేం చేస్తున్నాడో చూద్దామని కేవీపీ జగన్ ఇంటికి వెళ్లాడు. అక్కడ జగన్ హడావుడిగా కనిపించాడు. లాయర్ల మధ్యలో కూర్చుని కీలకపత్రాలు తిరగేస్తున్నాడు జగన్. కేవీపీ అడుగుపెట్టాడోలేదో, ఇంటినుంచి `యురేకా' అంటూ పెద్దకేక వినిపించింది. అది జగన్ పెట్టిన కేకేనని కేవీపీ ఇట్టే గ్రహించి కంగారుగా జగన్ దగ్గరకు వెళ్లాడు. `ఏమిటిదంతా జగన్?' అంటూ ఆరాతీశాడు.
`దొరికింది అంకుల్... నాకు దొరికింది'
`ఏం దొరికింది...? మొన్న కనిపించకుండాపోయిన కడప బాంబా?'
`కాదంకుల్. నాన్న రాసిన వీలునామాలో నాకు కావాల్సింది దొరికింది'
`ఏంటది?'
`ఇదిగో, ఈ వాక్యంలో ఏముందో చూడంది...`సీఎం సీటు'ని కూడా నాన్న నాకు రాసిచ్చాడు. ఇక నన్ను ఏ శక్తి ఆపలేదు. అధిష్ఠానం అడ్డుకోలేదు. బస్తీమే సవాల్...నాకెవ్వరూ అడ్డురారు. సీఎం సీటు నాదే...'
`చాల్లే ఆపు, వాక్యం పూర్తిగా చదవని...'
`చదువంకుల్...చదువు. అవతల తొలి ఫైల్ మీద సంతకం చేయాలి...'
`ఆఁ...ఇక్కడ సీఎం సీటు అని ఉన్నమాట నిజమే...కానీ దాని పక్కన ఏముందో చూడు...సీఎం సీటును తనఖాపెట్టి చేసిన అప్పుల వివరాలు ఇవి.. `పైన వివరించిన అప్పలన్నీ నా పుత్రుడైన జగన్ మోహన్ రెడ్డికి వారసత్వంగా సంక్రమిస్తాయని ఇందుమూలంగా తెలియజేస్తున్నాను...' ఈ అప్పులన్నీ కలిపి పదివేల కోట్లకు పైమాటే...'
`సీఎం సీటు తనఖా పెట్టడమేమిటంకుల్?'
`సీఎం సీటు వారసత్వంగా వస్తుందని నీవు అనుకుంటే తప్పులేదుకానీ, సీఎం సీటు తనఖా పెడితే తప్పేమిటట...అయినా ఎంతైనా నీ బాబుకదా.. అసలు విషయం ఏమిటంటే, ఫైళ్లమీద సంతకాలు పెడతానంటూ కాంట్రాక్టర్ల దగ్గర తీసుకున్నవి...'
`అవి పెట్టుబడులు..ఉరఫ్ లంచాలు...'
`కరెక్టే, కానీ సంతకం పెడితేకదా..పనిపూర్తికాలేదుకాబట్టి అవి అప్పులే అవుతాయి. అదీ, సీఎం సీటును తనఖా కథ...'
`అమ్మో...సీఎం సీటంటే, తనఖాపెట్టిన సీటా...అంకుల్...నువ్వే నన్ను కాపాడాలి'
`ఎవరు అంకుల్...?ఎవరు నువ్వు...?? నీకూనాకూ సంబంధంలేదు. ఆ అప్పుల సీఎం సీటు నీవే ఉంచుకో..బైబై...
- రాజేష్

సెటైర్: రాజకీయనటనకు నందులు

రోశయ్య మాస్టారికి ఆలోచన ఇట్టేరాగానే కేవీపీ రంగంలోకి దూకి 2009 సంవత్సరానికిగాను రాజకీయ నందులను ప్రకటించారు. ఆ వివరాలు ఇవి...
ఉత్తమ రాజకీయ చిత్రం: ప్రజారాజ్యం (కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాలేకపోయినా, అల్లుఅరవింద్ నిర్మాణ సారథ్యం, చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబువంటి స్టార్ల అద్భుత నటనతో ఒక మల్టీ స్టారర్ సినిమాగా ప్రజలను బాగా ఆకట్టుకుంది)
ఉత్తమకుటుంబకథాచిత్రం: తెలుగుదేశం-2009 (చంద్రబాబు, బాలకృష్ణ, హరికృష్ణ, ఎన్టీఆర్, కల్యాణ్ రాం, తారకరత్న...ఇలా ఫ్యామిలీఫ్యామిలీ మొత్తం కలిసి `తెలుగుదేశం -2009' సినిమాలో బాగా నటించారు)
ఉత్తమ నటుడు: జూనియర్ ఎన్టీఆర్. (ఈ నామినేషన్ కి చిరంజీవి, బాలకృష్ణ కూడా పోటీపడినప్పటికీ యాక్సిడెంటై మంచమీద పడుకుని కూడా నగదుబదలీ పథకం పేరుచెప్పి, అమ్మలారా, అక్కలారా ఇప్పుడే ఈ క్షణమే అకౌంట్లు ఓపెన్ చేయమని చెబుతూ ఎన్టీఆర్ తనదైన శైలి లో అద్భుతమైన నటనను కనబరిచారు)
ఉత్తమనటి: రోజా (తెలుగుదేశం మహిళా అధ్యక్షురలిగా పలు యాక్షన్ సన్నివేశాలలో నటించి, చీప్ లిక్కర్ బాటిల్స్ ని తెగ పగలగొట్టేసింది. చివరాఖర్లో ప్లేట్ తిప్పేసి, కాంగ్రెస్ లో చేరే సీన్లో అద్భుతంగా నటించింది.)
ఉత్తమ సహాయ నటుడు: పవన్ కల్యాణ్. (ప్రజారాజ్యం సినిమాలో హీరో చిరంజీవికి సహాయపడుతూ, అరుపులూకేకలు పెట్టడం. ఆయన చెప్పిన `పంచలూడదీస్తాం' అన్న డైలాగ్ సినిమాకే హైలైట్.)
ఉత్తమ సహాయ నటి: జీవిత (తన భర్తకేకాకుండా `కాంగ్రెస్ పార్టీ 2009' సినిమాకు కూడా తనవంతు సహాయం చేయడం. తన సినిమా గురించి పట్టించుకోకుండా పక్కహాల్లో నడుస్తున్న ప్రజారాజ్యం సినిమాను విమర్శించడం. వీలుచిక్కినప్పుడల్లా పోలీస్ కేసులు పెట్టడం. చిరంజీవి ఫ్యాన్స్ చేసిన దాడి సీన్లో అద్భుతంగా నటించారు.)
ఉత్తమ హాస్యనటుడు: కేఏ పాల్ (ఈ కేటగిరీలో టఫ్ పైటే జరిగింది. నామినేషన్లలో బాలయ్యబాబు, రాజేశేఖర్, కేసీఆర్ కూడా పోటీపడ్డారు. అయితే మొదటినుంచీ ఎంతో బిల్డప్ ఇచ్చి, టివీషోల్లో అదరగొట్టి, 292 సీట్లూ తనవే అంటూ డైలాగ్ లుకొట్టి చివరకు నామినేషన్ వేసే వేళకు ఓటర్ల లిస్ట్ లో తన పేరు లేదని తెలుసుకుని భంగపడ్డ సీన్ లో కేఏ పాల్ అద్భుతంగా నటించి అందర్నీ కడుపుబ్బ నవ్వించారు.)
ఉత్తమ హాస్యనటి: గంగాభవాని (నోటికొచ్చినకాడికి తాను తిడుతూ, అందర్నీ నవ్వించడంలో అద్భుతంగా నటించింది)
ఉత్తమ దర్శకుడు: చంద్రబాబునాయుడు (`మహాకూటమి' పేరిట భారీ సెట్టింగ్ లతో గ్రాపిక్స్ తో తీసిన సినిమాకు దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో కలవని మనుషుల్ని కలపడానికి చేసిన ప్రయత్నం బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కాకపోయినా ఈయనగారి దర్శకత్వ ప్రతిభ వెలుగుచూసింది)
స్పెషల్ జ్యూరీ అవార్డ్: చిరంజీవి (స్వీయ దర్శకత్వంలో తానే హీరోగా అధ్బుతంగా నటించిన ప్రజారాజ్యం సినిమా బాక్సాఫీస్ సక్సెస్ కాలేకపోయినప్పటికీ జనంచేత జేజేలు చెప్పించుకున్నందుకు)
-రాజేష్

సెటైర్: రోశయ్య `నందీశ్వురులు'

`సీ' బ్లాక్ లో సీఎం రోశయ్య చాలా అసహనంగా అటూఇటూ తిరుగుతున్నారు. బట్టతలను పదేపదే తడుముకుంటున్నాడు. ఆలోచన ఎంతకీ తెగకపోవడంతో సలహాకోసం కేవీపీని కేకేశారు. `ఈ పెద్దాయన ఇప్పుడెందుకు పిలిచాడా...ఏం లెక్కలు చెప్పమంటాడో ఏమో...అవి ఏవరి పీకకు చుట్టుకుంటాయోఏమో...చెబితే ఒక తంటా, చెప్పకపోతే మరో తంటా. సీనియర్లు, జూనియర్లు తననుమరీ ఫుట్ బాల్ ఆడేస్తున్నార'నుకుంటూ పెదాలు తడుముకుంటూ గొణుక్కుంటూ కేవీపీ లోపలకు వచ్చాడు.
`చూడు కేవీపీ, నాకీ లెక్కతేలడంలేదు.'
`అదేంటీ, మీరే ఓ లెక్కలమాస్టారాయె...' నసిగాడు కేవీపీ
`కావచ్చు, కానీ ఈ లెక్క రావడంలేదు. అసలు ఎన్ని నందులు ఇవ్వాలి? ఎవరెవరికి ఇవ్వాలి? చెప్పు..' సూటిగా అడిగాడు రోశయ్య.
రోశయ్యలో బెత్తంపట్టుకున్న మాస్టారు కేవీపీకి. బుర్రగోక్కున్నాడు.
కేవీపీకి అర్థంకాలా. నందులు ఇచ్చేశాక ఇప్పుడు నందులంటాడేమిటీ ఈయన! పెద్దరికం రావడంతో ఇట్టే మరచిపోతున్నాడేమో...అనుకుంటూ `అదేంటిసార్, నందులు ఇచ్చేశాంగా...'
`ఇచ్చేశారా! ఎప్పుడు? ఎవరికి?' రోశయ్య ప్రశ్నమీద ప్రశ్న సంధించారు.
కేవీపీ నసుగుతూ చెప్పాడు..గుర్తుతెచ్చుకుంటూ, `గమ్యం ...ఉత్తమ చిత్రం, రవితేజ ఉత్తమ హీరో, అరుంధతీ...ఉత్తమ...'
`ఛత్...ఇవికావు నేను అడిగేది, రాజకీయ నందుల గురించి.'
`రాజకీయ నందులా! ఇవిఎక్కడినుంచి వచ్చాయి...!'
`రాలేదు, రప్పించాలి. చూడు మిస్టర్ కేవీపీ, నువ్వుఏం చేస్తావో నాకు తెలియదు. 2009 సంవత్సరానికి వెంటనే రాజకీయ నందులు ప్రకటించాలి. వెంటనే వెళ్ళి పని చూడండి...'
.................... 2 ....................

కేవీపీ బయటకురాగానే తలుపుచాటునుంచీ వింటున్న కొండా సురేఖ కనిపించింది.
`ఏమిటిది? ఛండాలంగా...' అసహనంగా అన్నాడు కేవీపీ.
సురేఖ ముఖం తుడిచేసుకుంటూ,
`ఏంటీ పెద్దాయన పందులూ, గిందులూ అంటున్నాడు.'
కేవీపీకి మరోసారి చికాకేసింది. `పెద్దాయన అన్నది పందుల గురించికాదు, నందుల గురించి. సగం వినీ సగం వినక ప్రతిదీ హడావుడి చేయడం నీకలవాటైపోయింది.'
`నందులా భలేభలే..మళ్ళీ ఎవరికీ...?
`మనకే, అంటే రాజకీయనాయకులు ఇవ్వాలంటున్నాడు.'
`నందులన్నీ ఆయనే కొట్టేద్దామని ఆశదోశ అప్పడం..వడ...'
`ఆపు,నీ మెనూ...ఆయనేం ఈపోటీలో లేరు. అసలు ఆయనే ఒక పెద్దనంది. ఇంకా ఆయకెందుకు నంది...'
`అర్థంకాలా...'
`మరి,అదే, సీనియర్లను గౌరవించడం నేర్చుకో. రోశయ్యకు వైఎస్సారే శివయ్యలాంటివారు. వైఎస్సారీశ్వరునిమీద ఈగలు వాలితేచాలు తన శృంగాలతో పొడిచిపొడిచి చంపేవారు. నందిపాత్ర బాగా పోషించడంతో ఇప్పుడు ఇతరులకు నందులు ఇవ్వాలనుకుంటున్నారు...అదీ స్టోరీ....' చాలా తెలివిగా చెప్పాననుకున్నాడు కేవీపీ.
`హమ్మయ్యా, ఈ పెద్దాయన పోటీలో లేడుకదా...అయితే సంతోషమే. నాకో సందేహం.;
`ఏమిటో చెప్పు....'
`మరణానంతరం కూడా నందీ అవార్డులు ఇస్తారా...?'
`ఈవిషయం రోశయ్య చెప్పలేదు. అయినాఇదేం ప్రశ్న.'
`నా కోరిక తీరాలంటే, కృతజ్ఞతాభావం చెప్పుకోవాలంటే ఇదే చక్కని మార్గం. మరణానంతరం కూడా నందులు ఇస్తే, వైఎస్సార్ సార్ కి పది నందులు రావడం ఖాయం. ఆయన ఎలాగో లేరుకనుక ఆ నందులన్నీ మా జగన్ బాబే అందుకుంటారు. అలా జగన్ షోకేస్ లో పదినందులు చేరినట్టవుతుంది. సీఎం పోస్టు ఇప్పించలేకపోయినా, నందులన్నా ఇచ్చానన్న తృప్తి నాకు మిగులుతుంది'
`ఏడ్డినట్టుంది, నీ రాజకీయం. ఒక నందిలాంటి రోశయ్యనే చూసి జడుసుకుంటుంటే, పది నందులు షోకేస్ లో పెడతావా..చాల్లే పో...'
`సార్ మరో ఆశ...'
`మళ్ళీఏంటీ?'
`అరుంధతిలో నటించిన అనుష్కకు ప్రత్యేక జ్యూరీ అవార్డు ఇచ్చారుగా, అలాగే నిరంతరం, ప్రతిక్షణం జగన్ సీఎం కావాలంటూ `ఆరంధి' (ఆ యావ)లోనే ఉంటున్న నాకూ స్పెషల్ అవార్డు ఇవ్వకూడదూ...'
`ఆరంధి' ఎక్కవయ్యే, రోశయ్య మాస్టారికి దూరం అయ్యావ్. నంది తరువాత నీ పదివి సంగతి ముందు చూసుకో..'
కేవీపీ పరుగుపరుగునవెళ్ళి రాజకీయ నందుల కోసం జ్యూరి ఏర్పాటు చేశాడు. వారంరోజుల్లో రాజకీయ నందులను ప్రకటించారు.
-కణ్వస

Saturday, October 24, 2009

'బొమ్మాలి' కి పది నందులు

గ్రాఫిక్స్ తో అదరగొట్టిన అరుంధతి చిత్రం పది నందులు అందుకుంది. అనుష్కకు స్పెషల్ జ్యూరీ అవార్డు దక్కింది.
'బొమ్మాలి నిన్ను వదల' అ౦టూ ఏకంగా పది నందులు వచ్చేశాయి.....


గణపతి వీడియో దృశ్యాలు

మావోయిస్టు అగ్రనేత గణపతి వీడియో దృశ్యాలు లభ్యమయ్యాయి. నక్సల్స్‌సమావేశాల్లో ఆయన ప్రసంగిస్తున్న వీడియో క్లిప్పింగులు ఇంటర్నెట్‌లో దర్శనమిచ్చాయి. వీటిలో మావోయిస్టు పొలిట్‌ బ్యూరో సభ్యుడు కిషన్న కూడా ఉన్నాడు. ఈ వీడియోలోని ఫోటోలని ఇటీవల ఓ ఇంగ్లీషు దిన పత్రిక ప్రచురించడం విషేషం. ఇవి బీహార్‌లో జరిగిన మావోయిస్టు కాంగ్రెస్‌ సమావేశాల్లో ప్రసంగిస్తున్న దృశ్యాలని తెలిసింది. ఇప్పటి వరకు గణపతికి సంబంధించి చిన్న ఫొటో కూడా బయటికి రాలేదు. ఏకంగా వీడియో దృశ్యాలు బయట పడటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ దృశ్యాలు మీ కోసం ...

అన్నీనాకిడిచిపెట్టేయ్ జగన్ (వీడియో)

జగన్ ఢిల్లీలో సోనియాగాంధీని కలుసుకున్నతరువాత మీడియాతో మాట్లాడుతూ, మేడం గారిని కలిశాం, రాష్ట్ర రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించాం...అన్నీ నాకిడిచిపెట్టేయ్ జగన్, నేను చూసుకుంటాను అని మేడం గారు అన్నారు....అంటూ చెప్పుకుపోయారు. అసలు జగన్ ఏం చెప్పారో మీరే చూడండి...

Friday, October 23, 2009

సెకండ్ టర్మ్ ఆర్నెల్లేనని వైఎస్సార్ కి ముందే తెలుసా !

రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కొద్దిరోజులకే ప్రియతమ నేత వైఎస్సార్ కి ఓ చేదు నిజం తెలిసింది. `సెకండ్ టర్మ్ సీఎంగా తాను ఆరునెలలు కూడా ఉండనేమో...'- అన్న తలంపు ఆయన్ని కలిచివేసింది. ఇది ఎలా సాధ్యమైంది? రెండోసారి సీఎంగా ఆర్నెళ్లుకూడా ఉండవని ఆయనకు ఎవరు చెప్పారు? ఏ భవిష్యవాణి ఆయనకు ఈ హెచ్చరికలు చేసింది...ముందుగానే తెలిసినా వైఎస్సార్ జాగ్రత్తలు తీసుకోలేకపోయారా? -
ఆసక్తికరమైన కథనం...
త్వరలో
`నారదలోకం'లో మీముందుంచబోతున్నాం.
-ఎడిటర్
(kanvasas@gmail.com)

జగన్ గెలిచినట్టా, ఓడినట్టా?

జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ యాత్ర సాఫల్యమైందా, లేక వైఫల్యతే ఎదురైందా అంటే ఖచ్చితంగా చెప్పలేం. వైఎస్సార్ మరణానంతరం చురుగ్గా సాగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదగాలని ఆశించడమే ప్రధాన భూమిక పోషించింది. గడచిన 50 రోజులుగా చెలరేగుతున్న ఊహాగానాలకు తెరదింపే ప్రయత్నం కాంగ్రెస్ అధిష్ఠానం చేసింది. జగన్ ఢిల్లీయాత్రలోని రెండు కోణాలను స్పృశిద్దాం...
గెలిచినట్టే...
  • కొంతకాలంగా మేడం సోనియాను కలవాలన్న లక్ష్యం నెరవేరింది. అది కూడా రోశయ్య కంటే ముందే కలవాలన్న కోరిక తీరింది.
  • రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై తన అభిప్రాయాన్ని మేడంకు చెప్పే అవకాశం దక్కింది.
  • `అన్నీ నాకిడిచిపెట్టేయ్ జగన్, నేను చూసుకుంటా...'అంటూ సోనియా చెప్పడంతో జగన్ లో నూతనోత్సాహం వెల్లివిరిసింది.
  • `రాబోయే కాలమంతా మీలాంటి యువనేతలదే'-అంటూ సోనియా అనడంతో జగన్ లో ఆశలు చిగరించాయి.
  • దక్షిణాదిన ఉన్న ఏకైక కాంగ్రెస్ పాలితరాష్ట్రంలో పార్టీ అంతర్గత కుమ్ములాటలు తగవని సోనియా అనడంతో జగన్ లో మార్పుకు బీజం పడింది.
  • మేడం సోనియా పట్ల సంపూర్ణ విశ్వాసం ఉంచడానికి ఈ పర్యటన దోహదపడింది.
  • అధిష్ఠానం పట్ల గౌరవం పెరగడానికి పర్యటన పనికొచ్చింది. తన ప్రమేయం ఉన్నాలేకున్నా జరిగిన అప్రదిష్ఠ మచ్చలను చెరిపేసుకోవడానికి దోహదపడింది.
  • ఇప్పట్లోకాకపోయినా భవిష్యత్ లో తనకలలు నెరవేరుతాయన్న ఆశలు చిగురించాయి.
ఓడినట్టే...
  • మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వెల్లడవుతున్న వేళలో ఎవ్వరినీ నొప్పించడం మేడంకు ఇష్టంలేదు. సరిగా అదే సమయంలో జగన్-కెవీపీ ద్వయం సోనియాను కలిశారు. మేడం వారితో కొద్దిసేపు మాట్లాడారు. కొన్ని పత్రికల్లో వచ్చినట్టు ఆమె వీరితో సుదీర్ఘంగా (45 నిమిషాలో గంటో) చర్చించలేదు. ఆమె కాసేపు మాట్లాడిన తరువాత అక్కడే ఉన్న సీనియర్లతో తాజా పరిణామాలు చర్చించారు.
  • `అన్నీ నాకిడిచిపట్టేయ్ జగన్, నేను చూసుకుంటా..' అని సోనియా అనడంలోని అంతరార్థమేమిటో జగన్ కు అర్థంకాలేదు. ఈ మాటల్ని పాజిటీవ్ గా తీసుకోవాలో, నెగెటీవ్ గా తీసుకోవాలో తెలియని అయోమయ పరిస్థితిని ఎదుర్కున్నారు.
  • నిన్నమొన్నటి వరకూ ఎప్పుడూ తన వయసు గురించికానీ, అనుభవం గురించికానీ మాట్లాడని జగన్ ఢిల్లీ నుంచి వచ్చీరాగానే వాటి ప్రస్తావన తెస్తూ, `నా వయసు 37 ఏళ్లే. భవిష్యత్ చాలా ఉంది. సీఎం కుర్చీ అంటే తేలిగ్గా లాక్కునే మామూలు కుర్చీకాదు. నేను అధిష్ఠానం చెప్పినట్టు నడుచుకుంటాను. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేస్తాను'
  • తండ్రి దర్మరణం పాలైన తరువాత జగన్ ఢిల్లీ వెళ్లడం ఇదే మొదటిసారి. స్టాండింగ్ కమిటీ సమావేశం నెపంతో రోశయ్య కంటే ముందే ఢిల్లీ వెళ్ళి తనమనసులోనిమాట మేడం చెప్పే పయత్నం చేశారు. జగన్ కుటుంబానికి కలిగిన నష్టం, శోకాన్ని దృష్టిలో ఉంచుకుని సోనియా అపాయింట్మెంట్ ఇచ్చారు.
  • కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క రాష్ట్రంలో బలోపేతమవుతున్న టైమ్ లో ఏ రాష్ట్రంలో కూడా అనిశ్చిత పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతోనే జగన్ వివాదానికి ఫల్ స్టాప్ పట్టేయాలని సోనియా భావించారు. అందకే స్టాండింగ్ కమిటీ సమావేశం పేరిట జగన్ ను ఢిల్లీ రప్పించి ఆయన చెప్పిందివిని, తాను చెప్పదలచ్చుకున్న రెండు ముక్కలూ చెప్పేశారు.
  • అధిష్ఠానం నిర్ణయానికి జగన్ కట్టుబడేలా జగన్ ని ఒప్పించగలిగారు.
  • జగన్ తరువాత అదేరోజు కే.కేశవరావు కూడా సోనియాను కలిశారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడిన మాటలనుబట్టి, అధిష్టానం తన పంతం నెగ్గించుకున్నట్టే కనబడింది. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ముందు పిల్లచేష్ఠలు కుదరవని చెప్పడంలో అదిష్ఠానం సఫలీకృతమైనట్టు అర్థమైంది. అదిష్ఠానం ఎలా చెబితే అలా నడుచుకుంటానంటూ జగన్ ఇప్పుడు చెప్పారనీ, కానీ, ఈమాటేదే నెలరోజుల ముందే అని ఉంటే, జగన్ అనుచరగణం వల్ల ఇంతగా డామేజ్ అయిఉండేది కాదన్న అర్థం వచ్చేలా కేకే చెప్పారు. కేకే మొహంలో సీనియర్లే గెలిచారన్న ఆనందం కనిపించడం కొసమెరుపు.
- కణ్వస

Thursday, October 22, 2009

సుస్థిరతకు పట్టం

దేశ ప్రజలు ఏమి కోరుకుంటున్నారో మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో మరోసారి తేటతెల్లమైంది. జావాబుదారీతనం, సుస్థిరపాలన కావాలని ఏ రాష్ట్ర ప్రజలైనా కోరుకోవడం సహజం. వీటితోపాటుగా దేశాన్ని ముక్కచెక్కలు చేసే ప్రాంతీయ పార్టీలకంటే, జాతీయతాభావంతో ఏకతాటిపై నడిపించే సత్తా ఉన్న పార్టీకే పట్టం కట్టాలన్న ప్రజలమనోభావాలకు అద్దంపట్టేలా మహారాష్ట్ర, హర్యనా, అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మహారాష్ట్ర, హర్యానాల్లో మునుపటి అంత బలాన్ని సంపాదించుకోకపోయినా ప్రభుత్వాలు ఏర్పాటుచేయగల సత్తాను మాత్రం కాంగ్రెస్ పార్టీ చాటుకుంది. ఇక అరుణాచల్ ప్రదేశ్ లో ఇందుకు భిన్నంగా కాంగ్రెస్ ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. మహారాష్ట్రలో కాంగ్రెస్, దాని మిత్రపక్షం ఎన్సీపీ ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించింది. మతతత్వ పార్టీలకు మరోమారు ఓటర్లు బుద్ధిచెప్పారు. అయితే ప్రాంతీయపోకడలను రెచ్చగొట్టే మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) మాత్రం అనుకున్నట్టుగానే బలం పుంజుకుంది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ - బోకర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. సుశీల్ కుమార్ షిండె కుమార్తె ప్రణీతి షిండె సోలాపూర్ నుంచి గెలుపొందారు. రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ కుమారుడు రాజేంద్ర షెకావత్ అమరావతి నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హూడా - 72, 100 ఓట్ల తేడాతో ప్రత్యర్థిని ఓడించారు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ కు అధినేత ఓంప్రకాష్ చౌతాలా తాను పోటీ చేసిన రెండు సీట్లలోనూ గెలుపొందారు. సావిత్రి జిందాల్ హిస్సార్ లో మరోసారి విజయకేతనం ఎగురవేశారు. కాగా, లోక్ భారతిపార్టీ తరఫున పోటీ చేసిన వినోద్ కాంబ్లీ పరాజయం చవిచూశారు.

అది ప్రమాదమే, కుట్రకాదు

వైఎస్ఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుట్రతోనే కూలిపోయిందంటూ `సాక్షి' పత్రిక, `సాక్షి' ఛానెల్ ఊదరగొట్టాయి. కుట్రజరిగినట్టేనంటూ కొత్త సిద్ధాంతాన్ని జనంమీద రుద్దడానికి తీవ్రాతితీవ్రంగా ప్రయత్నించాయి. అయితే నిజానికి హెలికాప్టర్ కూలడంలో ఎలాంటి కుట్ర జరగలేదు. `కూలింది కుట్రతోనే?' అంటూ పేజీలకుపేజీలు రెండురోజుల పాటు రాసేసిన సాక్షి పత్రిక -ఆ తరువాత మెత్తబడింది. చెప్పిన విషయాలే చెప్పిచెప్పి విసుగుపుట్టిందేమో ఆ `కట్టుకథ'ని అంతటితో ఆపేసింది. హెలికాప్టర్ కూలడానికి కుట్ర జరగలేదనీ, అది కేవలం ప్రమాదవశాత్తు కూలిందని ఏవియేషన్ నిపుణుడు ఎస్.ఎన్.రెడ్డి చెబుతున్నారు. కూలడంలో కుట్రజరిగిందంటూ జనాన్ని నమ్మించడానికి ఆ పత్రిక లేవనెత్తిన అంశాలనూ, ఇప్పుడు ఏవియేషన్ నిపుణులు చెబుతున్న వాస్తవాలను ఓ సారి మీరే చదవండి...
సాక్షి: హెలికాప్టర్ కూలడంలో ఏదో కుట్ర జరిగింది. (అదేమిటో స్పష్టంగా చెప్పకపోయినా పేలుడు వల్ల కూలిందేమోనన్న అర్థం వచ్చేలా రాసింది)
నిపుణులు: బాంబులు పెట్టడంవల్లగానీ, లేదా ఏ ఇతర పేలుడువల్లకానీ హెలికాప్టర్ కూలినట్టు కనబడటంలేదు. నిజంగా విస్ఫోటనం జరిగిఉంటే హెలికాప్టర్ శకలాలు దాదాపు పదికిలోమీటర్ల పరిధిలో చెల్లాచెదురుగా పడిఉండేవి. కానీ అలా జరగలేదు. ప్రమాదశాత్తే హెలికాప్టర్ కూలిఉంటుంది.
సాక్షి: బెల్ 430 హెలికాప్టర్ బేగంపేట విమానాశ్రయంలోని హ్యాంగర్లలో అరకొర భద్రత నడుమ ఉంచారు.
నిపుణులు: వీఐపీలు వినియోగించే హెలికాప్టర్లను నిలిపిఉంచడానికి సొంతంగా హ్యాంగర్లు ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సొంత హ్యాంగర్ లేకపోవడంతో గత 20 ఏళ్లుగా ఏవియేషన్ అకాడమీ హ్యాంగర్ లోనే నిలుపుతున్నారు.
సాక్షి: హెలికాప్టర్ రక్షణ భాద్యతను పట్టించుకోలేదు.
నిపుణులు: హెలికాప్టర్ రక్షణ భాద్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే. అయితే ఏవియేషన్ అకాడమీ హ్యాంగర్ లో ఉంచడం వల్ల ఏవియేషన్ అధికారులు కూడా పట్టించుకున్నారు. అకాడమీ సొంత ఖర్చుతో కెమేరా మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటుచేశారు.
సాక్షి:
నిర్ణీత ఎత్తులో వెళ్ళాల్సిన హెలికాప్టర్ తక్కువ ఎత్తులో ఎందుకు ప్రయాణించింది? దిశ ఎందుకు మార్చారు?
నిపుణులు: వాతావరణ పరిస్థితులు సరిగాలేనప్పుడు హెలికాప్టర్ ని సురక్షితంగా గమ్యం చేర్చేందుకు పైలెట్ దిశను మార్చవచ్చు. అలాగే, ఎత్తు తగ్గించవచ్చు.
సాక్షి: సాంకేతిక లోపంతోనే హెలికాప్టర్ కూలిందేమో..
నిపుణులు: యాంత్రిక లోపం వల్ల రోటర్ వేగం తక్కువగా ఉండిఉంటే, హెలికాప్టర్ చెట్లకు తగిలిఆగిపోయేది. కానీ అలాజరగలేదు.ఆ సమయంలో గంటకు 260 నుంచి 270 కిలోమీటర్ల వేగంతో హెలికాప్టర్ ప్రయాణిస్తున్నట్టు తెలిసింది. అంటే యాంత్రిక లోపం లేనట్టే.
సాక్షి: హెలికాప్టర్ తయారీలో నాసిరకం విడిభాగాలు వాడారేమోనన్న అర్థం వచ్చేలా రాసింది.
నిపుణులు: అలాంటి అవకాశాలే ఉండవు. హెలికాప్టర్ కూలడంలో ఎలాంటి కుట్రలేదు. కేవలం వాతావరణం సహకరించక పోవడం వల్లనే గతితప్పి కూలిఉంటుంది.
- కణ్వస

Wednesday, October 21, 2009

సోనియాను కలువనున్న జగన్

ఎట్టకేలకు మేడం సోనియాను కలిసి మాట్లాడే అవకాశం జగన్ కు రాబోతున్నది. దసరా పండుగకాగానే సోనియా నుంచి పిలుపు వస్తుందని గంపెడాశ పెట్టుకున్న జగన్ కు నిరాశే ఎదురైంది. వైఎస్సార్ దుర్మరణంపాలై 50 రోజులు దాటినా తన ఏకైక డిమాండ్ ను అధిష్ఠానం పట్టించుకోలేదన్న బాధ జగన్ లోనూ, ఆయన అనుచరగణంలోనూ పేరుకుపోయింది. ఇక ఉండబట్టలేక ఫైనాన్స్‌ స్టాండింగ్‌ కమిటీ మీటింగ్ నెపంతో జగన్ బుధవారం ఢిల్లీ వెళ్ళారు. తండ్రి మరణానంతరం మొదటిసారిగా జగన్ హస్తినలో కాలుమోపారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ వీరప్ప మొయిలీని జగన్, కేవీపీ కలిశారు. ఏమాట్లాడుకున్నారో చెప్పమని మీడియా కేవీపీని అడిగినా ఆయన పెదవివిప్పలేదు. జగన్ సంగతి సరేసరి. అయితే మొయిలీ మాత్రం ఈ భేటీ గురించి ప్రస్తావిస్తూ, ఇది కేవలం మర్యాదపూర్వకంగా జరిగిందేనంటూ తేల్చిపారేశారు. పైగా, అధిష్ఠానానికి వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా మేడం సోనియా ఊరుకోవడంలేదనీ, సున్నితమైన ప్రతి అంశాన్ని అధిష్ఠానం సునిశితంగా పరిశీలిస్తున్నదని పరోక్షంగా మొట్టికాయవేశారు.
ఒకవేళ జగన్ కోరికను మన్నించి సోనియా పిలుపు పంపించినా ఉభయుల మధ్య మర్యాదపూర్వకంగానే భేటీ ఉండవచ్చు. అంతకు మించి ఏదో ఊహించడం అత్యాశే అవుతుంది. తండ్రి మరణానంతరం మొదటిసారిగా ఢిల్లీకి వచ్చారుకనుక జగన్ కోరికను మేడం మన్నించవచ్చు.
జగన్ ఢిల్లీ వెళ్ళిన సమయానికి సోనియా అక్కడలేరు. ఆమె ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉన్నారు. అది ముగించుకుని గురువారం సాయంత్రానికి ఢిల్లీకి చేరుకుంటారు. వచ్చీరాగానే మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల గురించి సమీక్షిస్తారు. అవసరాన్నిబట్టి వ్యూహరచనలు చేసే పనిలో పడతారు. మరీ ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపైనా, ముఖ్యమంత్రి పదవిని ఎన్సీపీతో పంచుకునే విషయంపైనా ఇప్పటికే కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతోంది. ఈ తలనొప్పిల నడుమ జగన్ ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కోరిక, లేదా అభ్యర్థన విషయం తెరమరుగు అవుతుంది.
అంతా అనుకూలంగా ఉంటే శుక్రవారం మాత్రమే జగన్ మేడం సోనియాను కలిసే అవకాశం ఉంటుంది. ఆ భేటీ కూడా కేవలం నిమిషాల్లోనే పూర్తి కావచ్చు. పరామర్శలకే పరిమితం అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
-కణ్వస

రామ్‌చరణ్‌ కి ముచ్చటగా మూడోది !


మగధీర చిత్రం హిట్‌ కావడంతో జోరుమీదున్న రామ్‌చరణ్‌తే మూడో చిత్రం బుధవారం ప్రారంభమైంది. నగరంలోని నోవాటెల్‌ హోటల్‌లో అంజనా ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత నాగబాబు విలేకరులతో మాట్లాడారు. ఈ చిత్రంలో కథానాయకగా జెనీలియాను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, దాసరినారాయణరావు, డి. రామానాయుడు, అల్లు అరవిందు, రాఘవేందరావు తదితరులు పాల్గొన్నారు.

జగన్‌ ఏకవాక్య ప్రకటన

జగన్ ఢిల్లీకి వెళ్లగానే మేడం సోనియాను కలుస్తారని అంతా అనుకున్నారు. కానీ అక్కడ సీను వేరేరకంగా ఉంది. మీడియా చుట్టుముట్టి అసలు సంగతి రాబడదామని ఎంతగా ప్రయత్నించినా జగన్ చివరకు ఏకవాక్యంతో సరిపెట్టారు. ఫైనాన్స్‌ స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు బుధవారం ఢిల్లీ వచ్చిన కడప ఎంపీ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిసేందుకు అనుమతి కోరామనీ వేచి చూస్తామని చెప్పారు. అంతే సంగతులు...
ఇట్లు, చిత్తగించవలెను.

వైఎస్సార్ అల్లుడి గుప్పెట్లో వందలకోట్లు !

వైఎస్సార్ ఎక్కిన హెలికాప్టర్ కూలడంలో కుట్ర జరిగిందంటూ ఒక పక్క సంచలనాత్మక కథనాలు వెలువడుతున్న నేపథ్యంలోనే మరోపక్క వైఎస్సార్ కుటుంబసభ్యులపైన కూడా నీలినీడలు పరుచుకుంటున్నాయి. ఎస్ఎంఎస్ ల ద్వారా, ఫోన్ల ద్వారా చెప్పుకుంటున్న గుసగుసలకు అక్షర రూపం కల్పిస్తే...
  • వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన కుమారుడు జగన్ కు ఇచ్చింది ఇవ్వగా కోట్లాది రూపాయలను అల్లుడు బ్రదర్ అనిల్ కు ఇచ్చారు.
  • వైఎస్సార్ కొన్ని విషయాల్లో అల్లుడి మాటలనే విశ్వసించేవారు. ఆ సమయంలో జగన్ మాట వినేవారు కారు.
  • వ్యాపార వ్యవహారాల్లో జగన్ కు మద్దతు ఇచ్చినా, రాజకీయ ఎత్తుగడల విషయంలో తండ్రీకొడుకుల మధ్య తేడాలు వచ్చేవి. అలాంటి సమయాల్లోనే అల్లుడు అనిల్ దగ్గరయ్యేవారు.
  • ప్రియమిత్రుడు కేవీపీ, అల్లుడు అనిల్ చెప్పిన మాటలు వినడంతో వైఎస్సార్ తన కుమారుడు జగన్ కు కొన్ని సందర్బాల్లో దూరం అయ్యారు.
  • మతపరమైన వ్యవహారాలు నడపడంలో దిట్ట అయిన బ్రదర్అనిల్ మామగారిని ఇట్టే ఆకర్షించుకున్నారు.
  • వందలాది కోట్లు బ్రదర్ అనిల్ తన గుప్పెట్లో పెట్టుకున్నారు.
  • వైఎస్సార్ దుర్మరణంతో ఆ ఇంట్లో ఒక్కసారిగా `శూన్యత' ఆవరించింది. (ఇది రాజకీయ శూన్యత కాదు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన శూన్యత)
  • ఆ శూన్యత నుంచి విభేదాల చిచ్చు రగులుకుంది. అది చివరకు బావ, బావమరిదిల మధ్య అఘాతాలు సృష్టిస్తోంది.
  • తండ్రి అప్పగించిన వందలాది కోట్లు ఇవ్వమంటూ జగన్ ఒత్తిడి తెచ్చారు. కేవీపీ చేత మధ్యవర్తిత్వం చేయించారు.
  • కేవీపీ సౌమ్యంగా సాగించిన మధ్యవర్తిత్వం నచ్చకపోవడంతో జగన్ ఆ పెద్దాయన్ని కూడా పక్కనపెట్టారు.
  • కుటంబవ్యవహారాలు చక్కదిద్దడానికి జగన్ ఇప్పుడు ఒంటరి పోరాటానికి దిగారు.
  • తండ్రి మరణంతో తలెత్తిన ఈ ఆర్థిక సమస్యనుంచి ఎలా బయటపడాలా అని జగన్ తీవ్రంగా ఆలోచిస్తున్నారు.
కూలింది కుట్రతోనే- అంటూ వైఎస్సార్ తనయుడు అనుమానాలు వ్యక్తం చేస్తున్నందున దర్యాప్తు, విచారణ మరింత కట్టుదిట్టంగా జరుపవచ్చు. అదే జరిగితే అసలు సంగతి ఎలా ఉన్నా, తీగలాగితే డొంకంతా కదిలినట్టు అవుతుందన్న భయం వైఎస్సార్ బంధువర్గంలో వ్యక్తమవుతోంది.
మరి ఈ ఆరోపణల్లో నిజం ఎంతో... నారాయణ...నారాయణ...

రోశయ్యకు కొండా సురేఖ సలాం

అసంతృష్ట మంత్రులంతా నెమ్మదిగా రోశయ్య పంచన చేరుతున్నారు. ఆయనకు సలాంలు కొడుతున్నారు. సీఎల్పీ సమావేశం పెట్టేలోగా మంత్రులంతా రోశయ్యకు తమ పూర్తి మద్దతు తెలపాలనీ, అప్పుడే సీఎల్పీ మీటింగ్ ఉసెత్తాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. వైఎస్సార్ మరణంతో ఒక్కసారిగా భావోద్వేగం ఎగిసిపడిన నేపథ్యంలో తొందరపడకుండా తగిన సమయంలో నే నిర్ణయం తీసుకోవాలని సోనియా భావిస్తున్నారు.
ఆనం, బోత్సా, రఘువీర వంటి వారు ఒక్కొక్కరుగా తోకముడుచుకుని రోశయ్య చెంతకు వస్తుంటే, కొండా సురేఖ మాత్రం కొరకరాని కొయ్యలా మారిందని జనం ఇప్పటికీ అనుకుంటున్నారు. అయితే, ఇందులో నిజంలేదు. కొండా సురేఖ కూడా రోశయ్య మాస్టారిని శరణుజొచ్చింది. రోశయ్యను తాత్కాలిక సీఎంగానే చూస్తూ, సీఎల్పీ మీటింగ్ పెట్టాయాల్సిందేనంటూ తెగ డిమాండ్ చేస్తున్న సురేఖలో ఇప్పుడిప్పుడే భావోద్వేగం తగ్గుముఖం పడుతోంది. వైఎస్సార్ కుటుంబం చేసిన మేలుకంటే, ఉన్నపదవే ముఖ్యమంటూ ఆమె శ్రేయోభిలాషులు హితవు పలకడంతో సురేఖ మెత్తబడినట్టు తెలుస్తోంది. రహస్యంగా రోశయ్యను కలిసి, తప్పులుంటే క్షమించమంటూ అర్థించినట్టు చెప్పుకుంటున్నారు. అయితే, ఉన్నట్టండి ప్లేట్ తిప్పేయలేననీ, అందుకు కొంత వ్యవధి కావాలని రోశయ్యను కోరారట. పెద్దాయన పెద్దమనసుతో ఒకే అనడంతో సురేఖ ఇప్పుడు వ్యూహాత్మకంగా మీడియా ద్వారా అంచెలంచెలుగా మొత్తబడే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని విశ్వసనీయంగా తెలిసింది. మరో వారం రోజుల్లో కొండా సురేఖ భేషరుతుగా, బహిరంగంగా రోశయ్య మాస్టారికి మద్దతు ఇవ్వడం ఖాయమనే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
-కణ్వస

Tuesday, October 20, 2009

జగన్ Vs రవి ప్రకాష్

రాజకీయాల్లో ఏవైనా జరగొచ్చు. ఫలానా వ్యక్తి రాజకీయాల్లోకి ఎందుకు వస్తాడులే అని అనుకంటే, హఠాత్తుగా ఎంట్రీ ఇచ్చేసుకోవచ్చు. సినీరంగం నుంచి ఓ ఎన్టీఆర్, ఓ చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చేశారు. అనేక రంగాలవారు, అనేక వృత్తుల వారు రాజకీయాల్లోచేరి రాణించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా వినబడుతున్న టాక్ ఏమిటంటే, ఎలక్ట్రానిక్ మీడియా కింగ్ గా భాసిల్లుతున్న రవిప్రకాష్ అతి త్వరలోనే పొలికల్ ఎంట్రీ ఇచ్చేస్తున్నారని. అంతేకాదు, కాంగ్రెస్ అధిష్ఠానం ఆశీస్సులతోనే రవిప్రకాష్ ఇకపై జగన్ కు పోటీ కావచ్చు. ఈ ఊహగానాలకు ఊతం ఇస్తున్న అంశాలు ఇవి....
  • సాక్షి పత్రికలో అక్టోబర్ 19 (సోమవారం) ప్రచురితమైన ప్రత్యేకకథనం (కూలింది కుట్రతోనే?) వచ్చింది. ఈ కథనానికి టివీ9 స్పందిస్తూ అదే రోజు రాత్రి ఏడున్నర గంటలకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని (కుట్ర సిద్ధాంతం) ప్రసారం చేసింది.
  • సాక్షి పత్రికలో వచ్చిన కథనానికి వెంటనే స్పందించాలంటూ రవిప్రకాష్ తన సిబ్బందికి ఆదేశాలిచ్చారు.
  • ముఖ్యమంత్రి రోశయ్యకూ, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికీ మనం సపోర్ట్ చేయాలంటూ సిబ్బందికి సంకేతాలు పంపించారు.
  • వెంటనే టివీ9 సిబ్బంది ఉరుకులూ పరుగులుపెట్టి సాక్షి `కుట్ర' సిద్ధాంతాన్ని వెలికిలాగారు.
  • ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో టివీ9 పాతుకుపోవడంతో సహజంగానే ఆయారాష్ట్ర ప్రభుత్వాలతోనూ, అటు కేంద్ర ప్రభుత్వంతోనూ అనేక పనులు ఉంటాయన్న ఉద్దేశంతోనే రవిప్రకాష్ చాలా బ్యాలెన్స్ గా వ్యవహరిస్తున్నారు. అదేసమయంలో కేంద్రం నుంచి వచ్చిన సంకేతాలను అందిపుచ్చుకుని రాజకీయ ప్రవేశానికి పావులు కదిపారు. అందులో భాగంగానే వరద బాధితుల సహాయం కోసం ప్రత్యేక ర్యాలీ పెట్టేసి ప్రజలకు చేరువకావడానికి ప్రయత్నించారు.మరో పక్క రోశయ్యకు మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు.
  • జగన్ వర్గం బలోపేతం అవుతున్న నేపథ్యంలో ఆయనకు చెక్ పెట్టాలంటే మరో యువశక్తి ఉండాలన్న కాంగ్రెస్ అధిష్టానం వ్యూహం ప్రకారమే రవిప్రకాష్ నడుచుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం.
  • ఇదే జరిగితే, రాబోయే కాలంలో జగన్ కు రవిప్రకాష్ రాజకీయంగా గట్టి పోటీ ఇవ్వవచ్చు.
- కణ్వస

కేవీపీని టార్గెట్ చేసిన `సాక్షి'

`కూలింది కుట్రతోనే?' అంటూ అక్టోబర్ 19 (సోమవారం) సంచలన కథనాన్ని ప్రచురించిన `సాక్షి' దినపత్రిక మర్నాడు (20వ తేదీ మంగళవారం) మరో కథనంతో ముందుకొచ్చింది. ఈసారి `అగస్టా ఎందుకు రాలేదు'? అంటూ పాఠకుల్ని ప్రశ్నించింది. మొదటి రోజు ప్రశ్నతోనే బిత్తరపోయిన పాఠకుడు, మర్నాడు మరో ప్రశ్న రావడంతో అవాక్కయ్యాడు. ఇంతకీ జగన్ పెట్టుకుంది న్యూస్ పేపరో, `కొశ్చిన్ పేపరో' తెలియక జుట్టుపీక్కున్నాడు. రెండున్నర రూపాయలుపెట్టి కొనుక్కున్న పేపర్ కావడంతో పాఠకుడు గతిలేక చదవడం మొదలుపెట్టాడు. ఈ `అగస్టా' ఏమిటీ, అది ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారో తెలుసుకుందామని మ్యాటర్ లోకి వెళితే, సాక్షి `అంతరంగం' ఆవిష్కృతమైంది. ఆ వివరాలు...
హెలికాప్టర్ కూలడానికి ముందే అధికారులు అంతులేని నిర్లక్ష్యం వహించారు.
(బాగానే ఉంది. నాటి ముఖ్యమంత్రి వైఎస్సారే ఉన్నతాధికారులను దగ్గరుండి నియమించుకున్నారు. కాకుంటే ఆయన ప్రియమిత్రుడు కేవీపీ సలహామేరకు ఆ పని చేశారు. అధికారుల నిర్లక్ష్యం అని ఇప్పుడు సాక్షి అక్కసు వెళ్లగక్కితే అది ఎవరికి తగులుతుంది...దివంగత నేతకా, లేక కేవీపీకా..? తండ్రిమీద బురదజల్లలేడు కనుక జగన్ తన `పేపర్ రాకెట్' ను కేవీపీ `అంకుల్'పై గురిపెట్టాడు. ఢిల్లీలో తన పని కేవీపీ చక్కపెట్టలేకపోయాడన్న అక్కసే అక్షరాల రూపంలో కనబడుతున్నట్టుంది)
అగస్టా వెస్ట్ లాండ్ హెలికాప్టర్ ఉండగా బెల్ 430ని ఎందుకు వినియోగించారు?
(ఎవరు వినియోగించారో కూడా చెబితే బాగుండేది. (అసలు ఉద్దేశం ఏమంటే, ప్రజా భద్రత, రక్షణ వ్యవహారాల కమిటీ చైర్మన్ హోదాలో ఉన్న కేవీపీదే తప్పు అని చెప్పడమే. ఆయన్నే టార్గెట్ చేయడం.)
వైఎస్ ని ఎక్కించుకోవడానికి ముందు బెల్ 430 విమానం బేగంపేట విమానాశ్రయంలోనే అరకొర భద్రత ఏర్పాట్ల మధ్యనే పడిఉంది.
(బేగంపేట విమానాశ్రయాన్ని పట్టించుకోవాల్సిన అధికారులు నిద్రపోయారన్నదే దీని భావం. మళ్ళీ ఇక్కడా కేవీపీపైనే `సాక్షి' గురిపెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తోంది)
ఇలాంటి కొశ్చిన్ మార్కులతో, అస్పష్టంగా ఏదో కుట్రజరిగిందన్న ఆలోచనలతో పుంఖానుఫుంఖాలుగా వార్తా కథనాలను ప్రచురించడంతో సాక్షి ఏ లక్ష్యాలను చేరుకుంటుందో చూడాలి. అయితే ఒకటి మాత్రం నిజం, ఇప్పుడు కేవీపీ, రేపు రోశయ్య, ఎల్లుండి మరో పుల్లయ్య...ఇలా ఒక దుర్ఘటనపై బురదజల్లుకుంటూ పోతుంటే చివరకు జనం ఆ పేపర్నీ, దాని యాజమాన్యాన్ని నిలదీస్తారు. ఉన్నతాధికారులందర్నీ వైఎస్సారే స్వయంగా తెచ్చి తనపక్కన పెట్టుకున్నప్పుడు ఇక ఎవర్ని నిందించి ఏం లాభం. పైగా వైఎస్సార్ ఆప్తమిత్రుడు కేవీపీ దుర్ఘటన అనంతరం జగన్ సీఎం కావాలని తపించారు. తనకు తోచిన సలహాలు చెప్పారు. అయినా జగన్ వర్గీయులు నానాయాగీ చేస్తుండటంతో ఆ పెద్దాయన మౌనవ్రతంబూనారు. అదే సమయంలో ఇటు జగన్ వర్గీయులు కేవీపీని టార్గెట్ చేయడం ప్రారంభించారు. అందులో భాగంగానే `అగస్టా ఎందుకు రాలేదు?' అంటూ `సాక్షి' మరో అనుమానాస్త్రం సంధించడం.
-కణ్వస

Monday, October 19, 2009

కుట్ర గుట్టు ముందుగా విప్పిన నారదలోకం

వైఎస్సార్ ఎక్కిన హెలికాప్టర్ కూలడంలో కుట్ర జరిగినట్టు సాక్షి పత్రికలో వచ్చిన ప్రత్యేక కథనానికి నారదలోకం స్పందిస్తూ -సాక్షిరాసింది కుట్రతోనే? అంటూ విశ్లేషణాత్మక కథనాన్ని సోమవారం ఉదయంమే అందించాం. ఎలక్ట్రానిక్ మీడియా (ముఖ్యంగా టీవీ ఛానెళ్లు) పెరిగిన ఈ రోజుల్లో కూడా వెంటనే సాక్షిలో ఉద్దేశపూర్వకంగా వచ్చిన కథనాన్ని విశ్లేషిస్తూ వార్తలు రాలేదు. అన్నింటికంటే ముందుగా నారదలోకం బ్లాగ్ స్పందించింది. ఆ తరువాత రాత్రి ఏడున్నరగంటలకు కుట్ర సిద్ధాంతమంటూ టివీ-- 9లో ఒక ప్రత్యేక కథనం వచ్చింది. ఎఐసిసీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ కూడా హెలికాప్టర్ కూలడంలో కుట్ర ఉన్నదన్న వార్తా కథనాన్ని ఖండించారు. ఇలాంటి ఉహాజనత వార్తలను ఇవ్వకూడదంటూ హితవుపలికారు.
నిన్నకాక మొన్న (విజయదశమినాడు) జన్మించిన నారదలోకం న్యూస్ బ్లాగ్ నదురుబెదురులేకుండా మొత్తం మీడియాలో కెల్లా ముందుగా సాక్షి రాసింది కుట్రతోనే అంటూ కథనం ఇవ్వడాన్ని పాఠకులు ఈ పాటికి గమనించే ఉంటారు. నారదలోకం సాహసోపేతమైన కథనాలకు వెనుక ఉన్న బలం పాఠకులే. ఇక ముందు కూడా వాస్తవకోణాలను ఆవిష్కరించడంలో ముందే ఉంటామని హామీ ఇస్తూ...
- ఎడిటర్

రోశయ్య పక్షాన కేవీపీ?

వైఎస్సార్ ఆప్తమిత్రుడు కేవీపీకి కాలం కలిసిరావడంలేదు. గడచిన నాలుగైదేళ్లుగా తన మాటనెగ్గించుకున్న కేవీపీ ఇప్పుడు తన స్నేహితుని కొడుకు జగన్ కి సీఎం పోస్టు ఇప్పించలేకపోతున్నాడు. ఇప్పటికే పలుమార్లు ఢిల్లీలో గోడువెళ్లగక్కుకున్నా ఫలితం దక్కలేదు. మరో పక్క జగన్ అనుయాయులు చేస్తున్న నానా ఆగీతో కేవీపి విసిగిపోయారు. చెప్పినా వినని అధిష్టానం, రెచ్చిపోతున్న జగన్ సేన కేవీపీకి మనస్తాపం కలిగిస్తున్నాయి. దీంతో ఏదో ఒక రోజు రోశయ్య పక్షానికే తన ఓటు వేసే పరిస్థితి రావచ్చన్న వాదన బలపడుతోంది.
అధిష్టానం మనోగతాన్ని గ్రహించిన కేవిపి ఆ విషయాన్ని జగన్‌కు స్పష్టం చేసినట్లు తెలిసింది. అధిష్టానం మనకు అను కూలంగా లేనందున, అధినేత్రి మనసు మారి అనుకూల నిర్ణ యం తీసుకునే వరకూ మౌనంగా ఉండాలని, ఆ లోగా ఎమ్మె ల్యేలు, మంత్రులతో ఎలాంటి ప్రకటనలు చేయించకుండా ఉంటే బాగుంటుందని జగన్‌కు ఇటీవలే సలహా ఇచ్చినట్లు తెలిసింది. అయితే, జగన్‌ వర్గీయులు మాత్రం ఆయనను సిఎం చేయాలన్న పట్టుదలతోనే ఉన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల్లో అధిష్టానంపై వ్యతిరేకంగా అసహనం పెరుగు తోంది. సంపూర్ణ మెజారిటీ ఉన్నందున బయటకెళ్లిపోదామని జగన్‌పై ఒత్తిడి చేస్తున్నారు. దీనితో కెవిపి పరిస్థితి ఇరకాటంలో పడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ఉన్న సమా చారం ప్రకారం.. త్వరలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక నిర్ణ యానికి రానున్నట్లు తెలుస్తోంది. కెవిపి మాత్రం వారిని ఇంకా సముదాయిస్తూనే ఉన్నారు. కానీ, వారంతా ఎవరిమాట వినే పరిస్థితి లేదు. ఇంకోవైపు.. డిసిసిలు, జిల్లా స్థాయి నాయకులు జగన్‌ ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు కట్టుబడి ఉంటామని హామీలిస్తున్నారు. జగన్‌ శిబిరం మాత్రం న్యాయం జరగకపోతే బయటకొచ్చేయాలంటూ ఆవేశంతో ఊగిపోతోంది.
ఈ నేపథ్యంలో.. కెవిపి పాత్రేమిటన్న అంశం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ జగన్‌పై అనుచరుల ఒత్తిడి పెరిగి ఆయన ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే అప్పు డు కెవిపి ఎటు వైపు ఉంటారన్న ఆసక్తికరమైన ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. తన తర్వాత జగన్‌ను సిఎంగా చూడా లన్నది వైఎస్‌ కల. అలాంటి ప్రాణమిత్రుడి కుమారుడైన జగన్‌ను సిఎంగా చేసేందుకు కెవిపి తన ప్రయత్నాలు చేసి చివరి వరకూ శ్రమించారు. అది ‘ఇప్పట్లో’ అసాధ్యమని తేలిపోయింది. ఈ క్రమంలో జగన్‌ శిబిరం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే అప్పుడు కెవిపి పాత్రేమిటన్నదే పార్టీ నేతల సందే హం. జగన్‌తోనే ఉంటూ వైఎస్‌ మాదిరిగానే ఆయన ఉన్నతికి కృషి చేస్తారా? అదే జరిగితే ఇప్పుడు కొనసాగుతున్న ప్రజా రక్షణ, భద్రత కమిటీ ఛైర్మన్‌ పదవికి నైతిక విలువల ప్రకారం రాజీనామా చేస్తారా? లేక.. తనను ఈ స్ధాయికి చేర్చిన కాంగ్రె స్‌ నిర్ణయించిన రోశయ్య పక్షం బాహాటంగా నిలుస్తారా? వంటి ప్రశ్నలన్నీ ఇప్పుడు కాంగ్రెస్‌లో చర్చనీయాంశమయ్యాయి.
తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ముఖ్యమంత్రి రోశ య్యతో కెవిపి రాజీ కుదుర్చుకునే ప్రయత్నాలు ప్రారంభించి నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లేముందు కెవిపి సిఎంను కలిశారు. అధిష్టానం అందించిన సంకేతాలను, మనోగతాన్ని తాను జగన్‌కు స్పష్టం చేశానని, అయినప్పటికీ వారంతా ఎవరి మాట వినే పరిస్థితిలో లేరని వివరణ ఇచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో తన పాత్ర నామమాత్రమేనని, మీకు వ్యతిరేకంగా తానెలాంటి చర్యలను ప్రోత్సహించడం లేదని, మంత్రులకు సైతం మీకు సహకరించమని సూచించానని కెవిపి ఆయనకు వివరిం చినట్లు తెలిసింది. దానికి తగ్గట్టే ఇటీవలి కొద్దిరోజుల నుంచి కెవిపి సిఎంతో సన్నిహితంగా ఉండేందుకు యత్నిస్తున్నారు. పేషీలో రోజూ ఆయనను కలుస్తున్నారు. విఐపిలను తీసుకువెళ్లి వరద బాధితులకు విరాళాలిప్పిస్తున్నారు.

ఫోకస్ : సాక్షి `రాసింది' కుట్రతోనే?


ప్రియతమనేత వైఎస్సార్ దుర్మరణానికి దారితీసిన హెలికాప్టర్ దుర్ఘనటపై సాక్షి (అక్టోబర్ 19) దినపత్రికలో `కూలింది కుట్రతోనే?' అంటూ పతాకశీర్షికన విశ్లేషణాత్మక కథనం ప్రచురించింది. ఆరోజు, సెప్టెంబర్ రెండవ తేదీన రచ్చబండ కార్యక్రమానికి హాజరవడంకోసం జనహృదినేత వైఎస్సార్ హెలికాప్టర్ లో చిత్తూరు జిల్లాకు బయలుదేరిన కొద్దిసేపటికే నల్లమల అటవీప్రాంతంలోని పావురాలగుట్ట వద్ద హెలికాప్టర్ కూలిపోవడంతో దుర్మరణం పాలయ్యారు. ఇది జరిగిన 50 రోజులకు సాక్షి పత్రికలో కుట్రతోనే హెలికాప్టర్ కూలిందన్న అర్థం వచ్చేలా ఒక కొశ్చన్ మార్క్ తగిలించి ప్రత్యేక కథనం ప్రచురించారు. ఈ కథనాన్ని పూర్తిగా చదివిన తరువాత అసలు కుట్ర ఏమిటో అర్థంకాక బుర్రగోక్కోవాల్సిందే. ఎవరైనా దుండగలు విద్రోహక చర్యకు పాల్పడి ఉంటారనే విషయాన్ని కొట్టిపారేయలేమని దర్యాప్తు అధికారులు అంగీకరించడం గమనార్హం అంటూ ముక్తాయింపు పలికారు. ఈ విషయం చెప్పడానికి ఇంత `సీను' (ఇంత కవరేజ్)అక్కర్లేదు.
  • మొత్తం కథనం చదివిన తరువాత పరిశోధనాత్మకంగా కొత్త విషయాలు ఏం చెప్పారో ఒక పట్టాన అర్థంకావు. కుట్ర ఉన్నదని తేల్చేటప్పుడు బలమైన పాయింట్లు ఉండాలి. నిజంగా అలాంటివి ఏవో ఉండిఉంటే వాటిని లోపల దాచేసుకుని (చెప్పాలనుకున్న అసలు సంగతులు చెప్పకుండా) సాదాసీదా అంశాలు, గ్రాఫ్ లు, చిత్రాలతో పేజీ నింపేశారు.
  • ఇదంతా చదివిన వారికి హెలికాప్టర్ కూలడంలో కుట్ర ఉన్నదన్న భావంకంటే, అసలు ఈ కథనాన్ని రాయడంలోనే రాజకీయ మతలబు ఉన్నదన్నట్టు అర్థమవుతోంది. ఒకవేళ అదే నిజమైతే ఏ లక్ష్యంతో ఈ అస్త్రాన్ని సంధించారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
  • కుట్రఏమిటో చెప్పకుండా, ఆ కుట్ర ఎవరు పన్నారో తెలుపకుండా నాన్చుడి ధోరణిలో రాయడం వల్ల ఆ పత్రిక ఏం సాధించాలనుకుంటున్నది?
  • ఎవరో గిట్టని వాళ్లు మన ప్రియతమనేత ఎక్కిన హెలికాప్టర్ ని కూల్చేశారని చెప్పడం వల్ల రాష్ట్రంలో ఉన్నట్టుండి అలజడి పెరిగిపోదా...దానివల్ల ఎవరికి లాభం?
  • ప్రజల్లో తలెత్తే అలజడి ప్రభుత్వ వ్యతిరేకతకు దారితీయదా?. ఇది ప్రభుత్వ పనితీరుని స్తంభింపచేయవచ్చు. ముఖ్యమంత్రి రోశయ్యకు కూడా ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటే తప్పకుండా మనస్తాపం కలుగుతుంది.
  • ప్రజలనుంచి ఒత్తిడి పెరిగితే దాని ప్రభావం పార్టీ అధిష్టానంమీద కూడా పడుతుంది.
  • పార్టీ కళ్లు తెరిస్తే, వాస్తవాలు గ్రహిస్తే, కొత్త సీఎం ఎంపికలో వేగిరపడుతుంది.
  • ఒక మహా కుట్రవల్ల మహానేతను కోల్పోయామన్న భావన నిజానికి తీవ్రభావోద్వేగాలను రేకెత్తిస్తుంది.
  • `కుట్ర' అన్న పదమే అత్యంత శక్తివంతమైన అస్త్రం. దీన్ని ప్రయోగించడంద్వారా ఎవరు ఏమి ఆశిస్తున్నారన్న సందేహం కలుగుతుంది.
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన మీడియా కచ్చితమైన సాక్షాధారాలు లేకుండా కేవలం దర్యాప్తు బృందం ఎప్పుడో , ప్రారంభదశలోనే చెప్పిన అంశాల ఆధారంగా కుట్రతోనే కూలినట్టు రాయడం ఏమేరకు సమంజసం. ఇదంతా చూస్తుంటే సాక్షి పత్రికే కుట్రతో రాసిందని జనం అనుకోరా? మరి దీనికి ఆ పత్రిక ఏమని సమాధానమిస్తుంది?
నారాయణ...నారాయణ...

Sunday, October 18, 2009

సెటైర్ : సూక్తుల కేసీఆర్!

విలేఖరి లంబు తెలంగాణభవన్ వైపు ఓసారి చూశాడు. ఎందుకో ఆ భవన్ ని చూడగానే అతగాడికి అరుంధతి సినిమాలోని పాడుపడ్డ కోట గుర్తుకువచ్చింది. భవన్ వైపు అడుగులు వేయాలంటే భయపడుతున్నాడు. ఎప్పుడు దగ్గరకు వెళ్ళినా లోపలి నుంచి కేసీఆర్ మాటలు కర్ణకఠోరంగా వినబడుతుండేవి. ఆ ముచ్చట యాదవగానే లంబు చెవుల్లో కేసీఆర్ పవర్ ఫుల్ డైలాగ్ లు వినిపించసాగాయి....
`ఓరేయ్...రారా...ఇన్నాళ్లుగా తెలంగాణ ఇవ్వకుండా కుళ్లబెట్టి, బొందపెట్టి మీరు కులుకుతార్రా...రండిరా...ఓసేయ్ బొమ్మాళీ...(ఈవెడవరో! సోనియానా?) తెలంగాణ ఇవ్వకుంటే నిన్నునేను వదలా...వదలను బొమ్మాళీ వదల. ఓరేయ్ రా... అడుగుముందుకేయ్. నువ్వు వేసే ఒక్కొక్క అడుగు నీ బొందకు దగ్గరవుతుందిరా...నిన్ను వదలా...నీకు బొందపెడ్తా...పాడికడ్తా...రారా..రా...'
అందుకే లంబుకు తెలంగాణభవన్ కు వెళ్లాలంటే భయం. కానీ ఏంచేస్తాడు పాపం. ఎడిటర్ హుకం చేశాడయె...`వెళ్ళు, తెలంగాణభవన్ కు వెళ్ళు. కేసీఆర్ ప్రెస్ మీట్ పట్టాడు. ఏదో నాలుగు మంచి మాటలు చెప్తాడట...వెళ్ళి కవర్ చేయ్..'
ఇక, గతిలేక లంబు తెలంగాణభవన్ వైపు భయంభయంగా అడుగులువేసుకుంటూ వెళ్తున్నాడు. గేటు దగ్గరకు వచ్చేసరికి దుర్గంధం స్థానే సుగంధం ముక్కుపుటాలకు సోకింది. మళ్ళీ అరుంధతి సినిమా గుర్తుకువచ్చింది. భయంగా చూశాడు. `ఇది భ్రాంతికాదుకదా...' అనుకుని ఒళ్లు గిల్లుకున్నాడు. కాదు, నిజమే...పరిమళ అగర్ బత్తి వాసనలు వస్తున్నాయి. అంతలో కేసీఆర్ ఒక సాధుపుంగవునిలా, శాంతమూర్తిలా ఎదురుపడ్డారు.
`రావోయ్ లంబు రా... ఎంటీ సంగతులు?'
`అదేంటి సార్....అది నేను అడగాల్సిన ప్రశ్న'
`అంతా బాగున్నారా?'
`సార్! మళ్ళీ నేను అడగాల్సిన ప్రశ్న వేస్తున్నారు. సార్, మీ పార్టీలో అంతా బాగున్నారా?'
`లోకాంసమస్తాం సుఖినోభవంతు'
`అదేంటీసార్! మీనోట సంస్కృతం...'
`దీని అర్థం తెలుసా?'
`అంటే, కొద్దిగా తెలుసు సార్..పూర్తిగా...'
`నేను చెప్తా రాస్కో...ఈ లోకాలన్నీ చల్లగా ఉండాలి. ఎవ్వరూ కొట్టుకోకూడదు. గిల్లుకోకూడదు'
`అంతా కలిసిఉంటేనేకదా సార్...చల్లగా ఉండేది. కలిసిఉంటే కలదు సుఖం అని కూడా మనవాళ్లు అన్నారుగా. అలాంటప్పుడు ప్రత్యేక తెలంగాణ ఎందుకు సార్?' అమాయకంగా అడిగాడు లంబు.
`అది ఉద్యమం. ఆగదు. ఇది సూక్తి ... సాగుతూనే ఉంటుంది.'
ఈసారి లంబుకి నిజంగానే అర్థంకాలేదు. బుర్రగోక్కున్నాడు.
`యత్రనారీ పూజ్యంతు తత్ర...'
`మళ్లీ, ఇదేంటీసార్...!?'
`అంటే, ఎక్కడ మహిళలు పూజింపబడుదురో...'
`ఆంధ్ర ఉద్యోగులను మరెందుకు వెళ్లగొడుతున్నారు సార్. అందులో మహిళలు కూడా ఉన్నారుగా...'
`అది ఉద్యమం. నీకో విషయం తెలుసా... నిప్పులు చిమ్మతు నింగికి నేనెగిరితే నిభిడాశ్చర్యంతో వీరే...నెత్తురు కక్కుతూ నేలకు నేరాలిపోతే నిర్దాక్షణ్యంగా వీరే... ఇక్కడ వీరే అంటే...'
మళ్ళీ ఇదేంటీసార్...!
`అలజడి మన జీవితం కావాలి, ఆందోళన మన ఊపిరి కావాలి. తిరుగుబాటు మన వేదాంతం కావాలి...'
`సార్...మీకేమైందిసార్?'
కేసీఆర్ పాతసినిమాలోని పాట అందుకున్నాడు...
`నమ్మరే, నేను మారానంటే నమ్మరే...నేనొకనాడు...'
`నమ్ముతాం సార్...నమ్ముతాం. ఆపండిసార్ మీ పాట..'
`అయితే, ఈ కవిత విను...చిరకాలం జరిగిన మోసం...బలవంతుల దౌర్జన్యాలు, ధనవంతుల పన్నాగాలు...ఇంకానా ఇకపై సాగవు.'
కేసీఆర్ సూక్తులకూ, కవితలకు లంబు భయపడి ఒక్క గెంతుగెంతాడు. మెట్లు ఎక్కాడో, జారాడో తెలియదు. తలుపులు తోసుకుని వచ్చాడో, లేక విరగ్గొట్టుకు వచ్చాడో అంతకన్నా తెలియదు. క్షణాల్లో బయటకువచ్చేశాడు. ఆ పాత బూతులకంటే, ఈ కొత్త కవిత్వాలు వినడం మరీ కష్టమనిపించింది. అంతే, ఉరుకో..ఉరుకు. వెనక నుంచి...తెలంగాణ భవన్ నుంచి ఇంకా సూక్తులు, శ్లోకాలు వినబడుతూనే ఉన్నాయి...
కణ్వస

రోశయ్యా, ఇలాగైతే ఎట్లాగయ్యా? (పార్ట్-2)

ముఖ్యమంత్రిగా ఉండేవారిలో ప్రధానంగా ఉండాల్సన లక్షణం `సహనం'. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, ఇప్పటి రోశయ్య సీఎంగా ఉన్నప్పటికీ ఉన్న తేడాను ప్రజలు గుర్తిస్తున్నారు. అంతేకాదు, వైఎస్సార్ జనహృదయనేతగా ఎందుకు మారారో, రోశయ్య సార్ ఎందుకు మారలేకపోతున్నారో కూడా పోల్చి చూసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో రోశయ్య బీపీ పెంచేసుకుని అన్నమాటలను ఉటంకిస్తూ, అదే వైఎస్సార్ అయితే ఎలా మాట్లాడిఉండేవారో తెల్సుకుంటే ఈ ఇద్దరి నేతల మధ్య ఉన్న అంతరం మీకు ఇట్టే తెలుస్తుంది.
రోశయ్య: (ఓలేరుపల్లెపాలెంలో గండిపడటాన్ని అక్కడి గ్రామస్థులు చెప్పినప్పుడు) గండి ఎందుకు పడింది? కారకులు ఎవరు? తదితర విచారణ నిమిత్తం నేను రాలేదు. బాధితులను పరామర్శించి భరోసా ఇవ్వడానికి వచ్చాను. ( రోశయ్య మాస్టారు అందుకే వచ్చిఉండవచ్చు. ఇందులో నిజంలేకపోలేదు. గ్రామస్థులకు అడ్డుతగులుతూ రోశయ్య కుండబద్దలుకొట్టినట్టు చెప్పడంతో వారంతా కంగుతిన్నారు.)
వైఎస్సార్: (ఇదే పరిస్థితుల్లో వైఎస్సార్ ఉండిఉంటే ఆయన చెప్పే పద్ధతి) అమ్మలారా, అక్కలారా, తమ్ముళ్లారా, చెల్లెళ్ళారా.... ఓ ఒక్కరికీ కష్టం కలుగుకుండా చూస్తాను. ఓలేరుపల్లెపాలెం వద్ద గండి పడినట్టు చెబుతున్నారూ, దీని గురించి హైదరాబాద్ కు వెళ్లగానే వెంటనే చర్యలు తీసుకుంటానూ, అప్పటిదాకా ఓపికపట్టండీ..ఎవ్వరికీ కష్టం కలగకుండా చేస్తాను.
రోశయ్య: (వరద బాధితులతో) నేను చెప్పేది వినడం ఇష్టంలేకుంటే చెప్పండి. ఒకరిద్దరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మిగతా వాళ్లు మౌనంగా ఊరుకుంటారా?
వైఎస్సార్: (ఇదే పరిస్థితిలో మాట్లాడాల్సి వస్తే) మాట్లాడే స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. ఆ మాట్లాడుతున్న వారు ఇలా వచ్చి బిగ్గరగా చెప్పండి. మీరు చెప్పేది ఆచరణయోగ్యమైతే వెంటనే పరిష్కరిస్తాం. తమ్ముళ్లూ రండీ...రా అక్కా నువ్వు రా...చెప్పు నీ కష్టాలేమిటో...
రోశయ్య: (పరిహారం భూమి యజమానులే తీసుకుంటున్నారనీ, కౌలు రైతులు ఫిర్యాదు చేసినప్పుడు) కౌలు రైతులూ, భూయజమానుల మధ్య సరైన అవగాహన ఉండాలి. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తోంది. దాన్ని ఎవరైతే తీసుకోవాలో వారే తీసుకోవాలి. అంతకు మించి ప్రభుత్వం ఏం చేయగలదు? (దీంతో జనం అవాక్కయ్యారు)
వైఎస్సార్: (ఇలాంటి సందర్బంలో ఎదురైతే) మీ సమస్య అర్థమైందీ, కౌలుదారీ వ్యవస్థలో మార్పులు చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఇచ్చే పరిహారం కౌలుదారులకు కూడా వర్తించేలా చట్టాలను సవరిస్తాం. అవసరమైతే ఇందుకోసం ఢిల్లీ వెళ్తాం. (జనం చప్పట్లు)
రోశయ్య: (మెరక ప్రాంతంలో ఇళ్లు కట్టించి ఇవ్వాలని ఒక మహిళ గట్టిగా అడిగితే) అలా గట్టిగా అరవమాకు. ఏదైనా ఉంటే కాగితంమీద రాసివ్వండి. అధికారులు చూస్తారు.(అదికారులు ఎలా చూస్తారో తెలిసిన జనం ఇక సీఎంకు చెప్పి ప్రయోజనం లేదని ఢీలాపడిపోయారు)
వైఎస్సార్: (ఇదే పరిస్థితి ఎదురైతే) అమ్మా, నీ ఆవేదన అర్థమైందీ. వెంటనే ఈ సమస్యను పరిష్కరిస్తాం. అందరికీ పక్కా ఇళ్లు కట్టించాలన్నదే మా ప్రభుత్వ నిర్ణయం. దాన్ని వెంటనే అమలుచేస్తాం. (జనం తప్పట్లు)
రోశయ్య: (గండి పూడ్చలని గ్రామస్థులు వెళుతుంటే పోలీసులు అడ్డుకున్నారంటూ ఒక వ్యక్తి ఆరోపించినప్పుడు) ఏమయ్యా! ఎవరైనా పోలీసులు ఎక్కువ నష్టం కలిగించారని చూస్తారా? ఎందుకు అలా అభాండాలు వేస్తారు? (రాష్ట్ర పోలీస్ వ్యవస్థపై రోశయ్యగారికి ఉన్న నమ్మకం జనాన్నినోరువెళ్లబెట్టేలా చేసింది)
వైఎస్సార్: బాధ్యతా రాహిత్యంగా ఎవరు ప్రవర్తించినా ఊరుకోనేదేలేదు. ప్రజాసంక్షేమానికి అడ్డుతగిలే పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటాం. మీరు చెప్పిన విషయాన్ని పరిశీలిస్తాం.ఇకపై అలా జరగకుండా చూస్తాం. (సంతృప్తి చెందిన జనం)
రోశయ్య మాస్టారిలో రాజకీయ అనుభవం నిండుగా ఉంది. కానీ లౌక్యమేలేదు. రోశయ్య దీన్ని అలవరుచుకుంటే ఈ నాలుగున్నరేళ్లూ లాగగలుగుతారు. లేకుంటే ఎప్పుడో ఒకప్పుడు అధిష్ఠానం చేతిలో మొట్టికాయ తింటారు. ఇంకో రకంగా చెప్పాలంటే ఈయనలోని మైనస్ గుణమే, జగన్ కు రేపు ప్లస్ గా మారవచ్చు.
-కణ్వస

Saturday, October 17, 2009

సెటైర్: గ`మ్మత్తు' కేసీఆర్

కేసీఆర్ ప్రవర్తన చాలా చిత్రవిచిత్రంగా ఉంటున్నది. క్షణంలో మాటమార్చేస్తున్నారు. అవునన్నది కాదంటున్నారు. కాదన్నది అవునంటూ అడ్డంగా వాదించేస్తున్నారు. ముఖం చూస్తుంటే కాసేపు `ఫుల్' కొట్టేసినట్టుగా ఉంటే, మరికాసేపు `చుక్క' ముట్టనట్టుగా ఉంది. అసలు ఆయనలో ఇద్దరు కేసీఆర్లు కనిపిస్తున్నారు. `ద్విముఖ జీవి'ని చూసినట్టనిపిస్తోంది. ఈ వింత ప్రవర్తనకు కారణమేమిటో తెలుసుకునేముందు ఆయనగారి `డబుల్ ధమాకా' ఏంటో చూద్దాం.
సమైక్యవాదం:
`ముందు ఆంధ్రప్రదేశ్...నేను అంటున్నది ముందు...`మందు' కాదు... మీడియా, సరిగా రాసుకోండి...ముందు ఆంధ్రప్రదేశ్. ఆ తరువాతనే తెలంగాణ. (ఢిల్లీలో కంటి ఆపరేషన్ చేయించుకున్నతరువాత మొదటిసారిగా మీడియాతో మాట్లాడుతూ అన్న ఈ మాటల్లో సమైక్య వాద లక్షణాలు కనిపించాయి)

`నేను అలా అన్నానా...మీడియా తప్పుగా అర్థం చేసుకుంది. ముందు ఆంధ్రప్రదేశ్ లేదూ, `మందూ' అంతకన్నాలేదు. తెలంగాణ నా ప్రాణం. అదే నా ఊపిరి. తెలంగాణ కోసం సాయుధపోరాటం చేస్తాం. ఈ ఆంధ్రావోళ్లను రానివ్వం. వెళ్లగొడతాం...బడితపూజ చేస్తాం...బొందలుపెడతాం.'(హైదరాబాద్ వచ్చాక అన్న మాటలివి)
సోనియా ఓ దేవత:
`సోనియాగాంధీ ఓ దేవత. ఆమె చాలా మంచివారు. పరిస్థితిని సరిగా అర్థం చేసుకోగలరు. (ఢిల్లీలో అన్న మాటలు)
`సోనియానా, గీనియానా మాకెందుకూ, మా పని మాకు గావాల్న. ఈళ్ల గురించీ, ఆళ్ల గురించి మాట్లాడే టైం లేదు. ఉద్యమం చేయాల్న' (హైదరాబాద్ వచ్చాక)
రోశయ్యలో మాహాత్మా:
`రోశయ్య, ఆ పెద్దాయనలో నాకు ఓమహాత్మ, ఓ పొట్టి శ్రీరాములు కనిపిస్తున్నారు.' (ఢిల్లీలో చెప్పింది)
`రోశయ్యను నేను పొగడ్లా, మాకేం అవసరం. అసలు ఈ కాంగ్రెసోళ్లను మేము పొగడం. మా పన్లు మాకున్నాయి. ప్రీజోన్ విషయంలో పోరాటం ఎలా చేయాలాని మేం ఆలోచిస్తున్నాం. తీరకలేదు. ఏమంటావ్ ఈటెల రాజేందర్' (హైదరాబాద్ ప్రెస్ మీట్ లో)
వైఎస్సార్ - వరదలు;
`వైఎస్సార్, జగన్ వల్లనే వరదలొచ్చాయ్. హైదరాబాద్ రాగానే అసలు సంగతి చెప్తా' (ఢిల్లీలో)
`వైఎస్సార్ నేనూ చాలాకాలం కలిసే ఆలోచించాం. వాళ్లబ్బాయ్, మా అబ్బాయ్ రామారావుతోటి వాడే. ఏమంటావ్ ఈటెల...జగన్ వయసు ముప్పయిమూడా, ముప్పయినాలుగా...?' (కొడుకు వయసు గుర్తురాక ఈటెలను అడిగి కన్ ఫర్మ్ చేసుకోవాల్సి వచ్చింది) జగనూ, మావాడూ ఒక ఈడువాళ్లు. జగను మా అబ్బాయిలోంటి వాడు.'
అది నోరా..? అవేం మాటలు..?? కాసేపు హైవేమీద, అంతలో కాసేపు గతుకుల రోడ్డుమీద పోతున్నట్టున్నాయేంటీ కేసీఆర్ మాటలు..!!.అని మీకూ అనిపించిందా..అయితే అలా ఎందుకు కేసీఆర్ మాట్లాడారో అసలు కారణం చెబుతా...చదవండి..
అసలు కారణం:
ఢిల్లీలో కంటి ఆపరేషన్ చేయించుకోవడానికి డాక్టర్ ని కలిసినప్పుడు ఆయనగారు కేసీఆర్ చేత మందు మాన్పించే ప్రయత్నం చేశారు. మీకు `మందు' కావాలా, ఉద్యమం కావాలా? సిన్సియర్ గా చెప్పండి...అని డాక్టర్ అడిగారు.
ఆ బాలహీన క్షణంలో కేసీఆర్ తడుముకోకుండా...`నాకు ఉద్యమమే కావాలి. తెలంగాణ నా ప్రాణం...నా ఊపిరి....' అంటూ ఆవేశపడ్డారు. పెనం వేడిగా ఉన్నప్పుడే దోశ వెయ్యాలన్నట్టుగా డాక్టర్ వెంటనే కేసీఆర్ నుంచి ప్రామిస్ తీసేసుకున్నారు. మాటమీద నిలబడే తత్వం ఉన్నవాడు కాబట్టి కేసీఆర్ ఆ క్షణం నుంచీ మందు మానేశారు. కానీ రోజులు గడుస్తున్నకొద్దీ కేసీఆర్ లో మార్పులొచ్చేశాయి. ద్విముఖజీవిలా మారిపోయారు. ఏ ముఖం ఎప్పుడు ఎలా మాట్లాడుతుందో అర్థంకాక మీడియా చేతులెత్తేసింది. ఈ వింత ధోరణికి కారణం ఏమిటా అని ఆరాతీస్తే అసలు విషయం తెలిసింది. `మందు' కొట్టేవాడు ఒక్కసారిగా మానేస్తే, అంటే ఫుల్ నుంచి నిల్ అయితే, కొన్నాళ్లు ఫల్ కొట్టినట్టే హాంగోవర్ తప్పదట. కాసేపు ఫుల్ పవర్. అంతలో నిల్ `నీరసం' పట్టేస్తుంటాయి. ఈ గ`మ్మత్తు' చేష్టలే ఇప్పుడు మనం కేసీఆర్ లో చూస్తున్నాం. ఇదీ సంగతి...నారాయణ....నారాయణ...
- కణ్వస

సెటైర్: ఒబామా నోబెల్ వెనుక బుష్ హస్తం?!

అమెరికా అధ్యక్షుడు ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి రావడంతో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది మేథావులు బుర్రలుగోక్కుంటున్నారు. తనకు నోబెల్ శాంతి ప్రైజ్ వస్తే వీళ్లంతా ఇంతలా బుర్రెందుకు గోక్కుంటున్నారో ఓ పట్టాన ఒబామాకు అర్థంకాలేదు. ఆమాటకొస్తే, తన పేరు నోబెల్ జ్యూరీ ఎందుకు సెలెక్ట్ చేసిందో కూడా నల్లజాతి శ్వేతసౌధాదీశునికి అర్థంకావడంలేదు. వెంటనే ఫోన్ అందుకున్నాడు. ప్రపంచ పటంలో తనకు గర్తున్న దేశాల అద్యక్షులకూ, ప్రధానులకు ఫోన్లు చేయడం మొదలుపెట్టాడు. ఫ్రాన్స్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, ఇరాన్, ఇరాక్, అర్జెంటీనా, చైనా...ఇలా ఆయా దేశాల అధినేతలను అడిగాడు. ఏమిటో వాళ్లు చెప్పిందేదీ మన బ్లాక్ చాంపియన్ కి సంతృప్తి ఇవ్వలేదు. ఇంకా ఏ దేశాలున్నాయా...అని ఆలోచిస్తుంటే, వెంటనే మొన్నీమధ్యనే జి-20 దేశాల సమావేశాల్లో కలుసుకున్న భారత ప్రధాని మన్మోహన్ చటుక్కన గుర్తుకువచ్చారు. అంతే ఢిల్లీకి ఫోన్ కలిపాడు.
ఒబామా: గుడ్ మార్నింగ్ మన్మోహన్ సింగ్ జీ.. నాకో సందేహం.
మన్మోహన్: ఆఁ..ఆఁ...గుడ్ ఈవినింగ్... త్వరగా చెప్పండి, అవతల మేడం సోనియా పిలుస్తున్నారు?
ఒబామా: అదే, అర్థమైచావడంలేదు.
మన్మోహన్: ఏమిటీ, చావడం అర్థంకావడంలేదా...?
ఒబామా: చావడం కాదు, రావడం... అదే, నోబెల్ ప్రైజ్ నాకెందుకు ఇచ్చారో అర్థం కావడంలేదు.
మన్మోహన్: అదా! నీ బండపడ... ఇందులో అర్థంకాకపోవడానికి ఏముందీ...జార్జి బుష్ వల్లనే కదా నీకీ అవార్డు వచ్చింది.
ఒబామా: అదేంటీ, జార్జి బుష్ నాకు శత్రువు, ఆయన వల్ల నాకు నోబెల్ ప్రైజ్ రావడమేమిటీ? అర్థంకాలా, కాస్తంత వివరంగా చెప్పండి. సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నా...
మన్మోహన్: అసలు కథ చెప్పాలంటే, మనం ఆరువేల సంవత్సరాల వెనక్కి వెళ్లాలి.
ఒబామా: యూమీన్..సిక్స్ థౌజండ్ ఇయర్స్...!
మన్మోహన్: అవును, సిక్స్ థౌజండ్ ఇయర్సే. అప్పట్లో మా ఏరియాలో ద్వాపరయుగం నడిచేది. ఆకాలంలో నరకాసురుడు అనే ఓ విలన్ ఉండేవాడు. వాడు భూమ్మీద శాంతిలేకుండా చేశాడు. యుద్ధాలేయుద్ధాలు. చావులేచావులు. భూమికి పెనుముప్పుగా మారాడు.
ఒబామా: ఓహ్ఁ...ఈజిట్?
మన్మోహన్: ఎస్, ఇటీజ్ ...ఇక అప్పుడు శ్రీకృష్ణుడు తన వైఫ్ సత్యభామతో కలిసి వార్ కి వెళ్ళాడు. నరకాసురుణ్ణి వధించి ప్రపంచానికే పీస్ తీసుకొచ్చాడు. జనం ఆనందంగా దీపావళి చేసుకున్నారు.
ఒబామా: ఓహ్ఁ... గ్రేట్. కానీ, నాదో డౌట్. ఈ కథకీ, నా నోబెల్ కీ ఏమిటట సంబంధం?
మన్మోహన్: వస్తున్నా, అక్కడికే వస్తున్నా... ఒక వ్యక్తి హీరో కావాలన్నా, లోకరక్షకునిగా మారాలన్నా, అతనే గొప్పవాడవ్వాల్సిన పనిలేదు. అతని శత్రువు లోకకంఠకుడు అయితే చాలు. అలాంటి ఎనిమీని ఓడిస్తే, అఖండ కీర్తి అందుకోవడం ఖాయం. ఇదే ఈ కథలోని నీతి.
ఒబామా: అర్థంకాలా...
మన్మోహన్: (మనసులో) వీడికెవడ్రా ఇచ్చింది నోబెల్ ప్రైజ్. (పైకి) మీ ఏరియాలో బుష్ లేడూ, వాడూ, నేనిప్పుడు చెప్పిన కథలోని నరకాసురుడు ఒకటే టైప్. ఇప్పుడు అర్థమైందా...
ఒబామా: అంటే, బుష్ వల్లనే నాకు నోబెల్ వచ్చిందా?
మన్మోహన్: ఎస్. ఇదే కరెక్ట్. బుష్ యుద్ధాలు చేసి, సిటీలనుకూల్చి, ఆర్థికమాంద్యం తెచ్చేసి, టెర్రర్ పెంచి ప్రపంచాన్ని పీల్చి పిప్పిచేశాడు.
ఒబామా: ఎస్..ఇదీ కరెక్టే... నా ఎన్నికల ప్రచారంలో ఇదే ఘాటుగా చెప్పాను.
మన్మోహన్: అదీ సంగతి, అలా నువ్వు ఘాటుగా బుష్ ను తిట్టబట్టీ, ఓడించబట్టీ, నోబెల్ జ్యూరీ వాళ్లకు నచ్చేసి నీకు నోబెల్ శాంతి ప్రేజ్ ఇచ్చారు.
ఒబామా: మీరు చెప్పింది నిజమే అనిపిస్తోంది. అయితే మన్మోహన్ జీ... మీరు నాకో మాటివ్వాలి.
మన్మోహన్: ఏంటది? త్వరగా చెప్పు, మేడం కాల్స్ మీద కాల్స్ చేస్తున్నారు.
ఒబామా: ఈ విషయం అమెరికన్ మీడియాకు చెప్పకండి. ప్లీజ్.

- కణ్వస

సెటైర్ :`రేచీకటి' రోశయ్య పగటి దీపావళి

రోశయ్య వ్యాఖ్యలపై బోలెడు జోకులొచ్చేస్తున్నాయి. అలాంటి జోకుల్లో ఒకటి దీపావళి టపాసుగా మీకోసం...
సెప్టెంబర్ 2 : ముఖ్యమంత్రి వైఎస్సార్ గారెక్కిన హెలికాప్టర్ కనపిచండంలేదు. అక్కడెక్కడో నల్లమల అడవుల్లో చిక్కుకుపోయినట్టు చెబుతున్నారు. చీకటి పడుతోంది. ఇక మీ ముఖ్యమంత్రిని మీరే కాపాడుకోవాలి. స్థానికులు వెతికి గాలించండి. ఇక్కడ మేము చేసేది ఏమీలేదు. చీకటి పడుతోంది. వెళ్లండి...మీ సీఎంను మీరే వెతుక్కోండి....
అక్టోబర్ 2: వరదలొచ్చేశాయి. పైనుంచి వరదనీరు రావడంతో ఏ క్షణంలోనైనా మీ ఊర్లు మునిగిపోవచ్చు. చీకటి పడుతోంది. ఇక మీ ఊర్లను మీరే కాపాడుకోండి. ప్రభుత్వం చేసేదేమీలేదు. ఈ రాత్రికి మీ ప్రాణాలు మీరే రక్షించుకోండి. మీరు,బతికుంటే తీరుబడిగా వచ్చి పలకరిస్తాం. చీకటి పడుతోంది. సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండి.
అక్టోబర్ 17: దీపావళి వచ్చేసింది. చీకటి పడుతోంది. ఈలోపే టపాకాయలు కాల్చేసుకోండి. చీకటి పడ్డాక ఏదైనా జరిగితే ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు. పొద్దున్నే కాల్చుకుంటే మంచిది. రాత్రిపూటైతే మీ ఒళ్లూఇళ్లూ మీరే కాపాడుకోవాలి.
నవంబర్ 2 : చీకటి పడుతోంది. పెద్దవాడ్నయ్యాను. నేనేమీ చేయలేను. ఇక మీ కొత్త సీఎంను మీరే వెతుక్కోండి.
- కణ్వస

సర్వ శుభకరం...ఈ ఆనంద దీపావళి

ఈ దీపావళి మీకూ, మీ కుటుంబసభ్యులకూ, మీ బంధుమిత్రులకు
సర్వశుభాలను అందించాలని కోరుకుంటూ....

Friday, October 16, 2009

దీపావళి ఏరోజు జరుపుకోవాలి ?

మరో దీపావళి పండుగ వచ్చేస్తోంది. అయితే దీపావళి ఎప్పుడు జరుపుకోవాలంటూ `నారదలోకం' సంపాదకవర్గాన్ని అనేక మంది ఈ-మెయిల్స్ ద్వారా, ఫోన్ ద్వారా అడుగుతున్నారు. నరకచతుర్దశి ఎప్పుడొస్తుంది? శనివారంనాడు చతుర్దశి అయితే, మరి పండుగ మర్నాడు ఆదివారం అవుతుందికదా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తిథులుమారే సమయాలను బట్టీ, పండుగ తలంట్లు, టపాసులు కాల్చుకునే ఆచారవ్యవహారాలనుబట్టిచూస్తే శనివారమే నరక చతుర్దశి అవుతుంది. ఆ రోజు పొద్దున్నే తలంట్లు పోసుకోవాలి. అదే రోజు రాత్రివేళ ఆనందంగా దీపావళి జరుపుకోవడం శుభకరం. ఇప్పటికే రాష్ట్రాన్ని కీడు పట్టిపడీస్తున్న వేళలో ఆదివారం రాత్రి దీపావళి పండుగ జరుపుకోవడం ఏ రకంగా చూసినా మంచిది కాదని జ్యోతిష పండితులు చెబుతున్నారు. శనివారం తెల్లవారుఝామున పండుగ తలంట్లు పోసుకోవడం శుభకరం. సరిగా ఆవేళలో నరక చతుర్దశి నడుస్తుంటుంది. నరకాసురుడి వధ అనంతరం తలంట్లు పోసుకోవడం మన ఆచారం. ఇక అదే రోజు, శనివారం రాత్రివేళ దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి పూజాదికాలు పూర్తిచేసుకుని టపాసలు కాల్చాలి. బంధుమిత్రులతో కలిసి మధురపదార్ధాలు (స్వీట్స్) ఆరగించాలి.
ఈ ఏడాది తిథులు ఎలా మారాయో, దీపావళి అమావాస్య ఎప్పుడు వచ్చిందో సవివరంగా చూడండి...
  • త్రయోదశి శుక్రవారం మధ్యహ్నాం 2.31తో పూర్తవుతుంది.
  • ఆ తరువాత చతుర్దశి ప్రారంభమై అది శవివారం మధ్యాహ్నాం 12.37 వరకు ఉంటుంది.
  • అంటే శనివారం మధ్యాహ్నం తరువాత అమావాస్య వచ్చేస్తుంది.
  • శనివారం రాత్రి అమావాస్యే అందుకే శనివారమే దీపావళి.
  • ఈ అమావాస్య ఘడియలు ఆదివారం ఉదయం 11గంటల 40 నిమిషాల వరకు ఉంటాయి.
  • ఆ తరువాత కార్తీకమాసం పాడ్యమి మొదలవుతుంది.
  • పైన పేర్కొన్న టైమింగ్స్ భారతకాలమానం ప్రకారం వేసినవి,
ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే kanvasas@gmail.comకి మెయిల్ చేయండి.
- కణ్వస

Thursday, October 15, 2009

`వారాల' రోశయ్య! !

(ఆదివారంనాడు అరటి మొలిచింది...పాట స్టైల్ లో)
ఆదివారంనాడు ఆపద్ధర్మ సీఎం అయ్యాడు.

సోమవారం నాడు `పెద్దల'మాట జవదాటనన్నాడు.
మంగళవారంనాడు మనసుకే ఇష్టంలేదన్నాడు.
బుధవారంనాడు `బుద్ధి' జనులు పొగడగా ఉక్కిరిబిక్కిరైనాడు.
గురువారంనాడు గుళ్లూగోపురాలు తిరిగాడు.
శుక్రవారంనాడు తనంతవాడే లేడన్నాడు.
శనివారంనాడు `సీ'బ్లాక్ లోకి దూసుకెళ్ళిన రాజమార్తాండ!
చకచకా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను మార్చేస్తూ,
నమ్మినోళ్లకి దీపావళి బోనస్సులిచ్చేస్తూ,
చకచకా `వారాలు' నెట్టుకొస్తున్న
`శేఠ'య్యా, నీచతురత బహు భేషయ్యా.

- మన్నవ

Wednesday, October 14, 2009

రోశయ్యా, ఇలాగైతే ఎట్లాగయ్యా? (పార్ట్-1)

రోశయ్యకు ఐదు పదులకు పైగానే విశేషంగా రాజకీయ అనుభవం ఉంటే ఉండవచ్చు. కానీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎంతటి సంయమనం పాటించాలో, మరెంతటి హుందాగా మసులుకోవాలో ఈ పెద్దాయన వైఎస్సార్ పక్కనే ఉంటూ అన్నేళ్లు రాజకీయ సావాసం చేసినా వొంటపట్టించుకోలేదు. అసెంబ్లీలో వైఎస్సార్ పెద్దకాపుదారుడిగా ఉన్న రోశయ్య ఆవేశపడినప్పుడల్లా ప్రతిపక్ష సభ్యులు నిరుత్తురలయ్యేవారు. అందుకే రోశయ్యను కొందరు `రోష'య్య అని కూడా చాటుమాటుగా పిలుచుకుంటున్నారు. ఇక పస్తుత విషయానికి వస్తే, రాజకీయంగా ఆయన శిఖరాగ్రానికి చేరారు. వైఎస్సార్ అనూహ్య మరణంతో ఎనభయేళ్లు నిండిన వయసులో ఆయనను ముఖ్యమంత్రి పదవి వరించింది. వైఎస్సార్ తనయుడు జగన్ సీఎం సీట్లో కూర్చోవాలని తెగ ప్రయత్నిస్తున్న టైమ్ లో అధిష్ఠానం ఆశీస్సులతో రోశయ్య ఆ పదవి దక్కించుకున్నారు. తాత్కాలిక ముఖ్యమంత్రి సీను ముగిసిన తరువాత రోశయ్యలో ఆవేశం పెరగడం మొదలైంది. మొదటి నుంచి `కట్టె, కొట్టె, తెచ్చే' అన్నట్టుగా మాట్లాడే నైజం ఉన్న రోశయ్య ప్రజారంజకుడు కాలేడన్న విమర్శలు వస్తున్నాయి. ఏ విషయంపైనైనా తెగేసి చెప్పడం, కుండబద్దల కొట్టడం సీఎం సీట్లో కూర్చున్న వ్యక్తికి సరిపడదని చెప్పేవారేలేకపోవడంతో రోశయ్య తరచూ పప్పులో కాలేస్తున్నారు. ఆయన చుట్టూ ఉన్న నాయకులుగానీ, అనుచరగణంలోని వారుకానీ ఆయన రాజకీయ అనుభవమంత వయస్సు కూడా ఉన్నవాళ్లు కారు. అందుకే ఈ పెద్దాయనకు మనసులోని మాట చెప్పి కొరివితో తలగోక్కోవడం ఎందుకని చాలా మంది నోరుమూసుకుంటున్నారు. ఆమాట కొస్తే, ఈ వ్యాస రచయత వయసు కూడా రోశయ్య రాజకీయ అనుభవమంత లేదు.
అయితే, ఒక సమర్ధవంతమైన ముఖ్యమంత్రి దారితప్పుతున్నప్పుడు, ప్రజలకు దూరమవుతున్నప్పుడు తెలియజెప్పాలన్న బాధ్యతను గుర్తెరిగి ఈ వ్యాసపరంపరకు పూనుకోవడం జరిగింది. పొగడ్తలతో ముంచెత్తే భట్రాజులకంటే, సద్వివిమర్శలు చేసేవారే నయం. మంచి మాటలు చెప్పడానికి వయసుతో సంబంధం లేదు. చిన్నవాళ్లు కూడా చక్కని సూచన చేసినప్పుడు దాన్ని పాజిటీవ్ దుక్పథంతో స్వీకరించాలి. రోశయ్య ఆ పని చేస్తారని ఆశిస్తున్నాం. అలా జరగకపోతే అది వైరి వర్గీయులకు అవకాశం ఇచ్చినట్టే అవుతుందని హెచ్చరిస్తున్నాం. ముఖ్యమంత్రిగా ఉన్న రోశయ్యకూ, దివగంత నేత వైఎస్సార్ కూ మధ్య ఉన్న తేడాలేమిటో విశ్లేషించుకోవాల్సిందే.
వరద ప్రాంతాల్లో బాధితులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడో, లేదా అంతకు ముందు సీఎంగానే మీడియా ముందు మాట్లాడిన సందర్భాలనో పరిగణలోకి తీసుకుంటే రోశయ్య `సీనియారిటీ' ఆయన పాపులారిటీకి అక్కరకు రావడంలేదని అనిపిస్తోంది.
(మిగతా వివరాలు తరువాయి భాగంలో)
-కణ్వస

Monday, October 12, 2009

లేచింది మహిళా లోకం

ఈసారి నోబెల్ ప్రైజ్ లు అందుకోవడంలో మహిళలు పోటీ పడుతున్నారు. ఆర్థికశాస్త్రంలో అమెరికా వనిత ఎలినర్ ఓస్ట్రోం నోబెల్ బహుమతికి ఎంపిక కావడంతో ఇప్పటివరకు ఈ ఏడాది అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డుకు ఎంపికైన మహిళల సంఖ్య ఐదుకు పెరిగింది. మరో ఆశ్చర్యకరమైన సంగతేమిటంటే, 1969లో ఎకనామిక్స్ లో నోబెల్ బహుమతిని చేర్చినప్పటి నుంచి ఇంతవరకు ఓ మహిళకు ఈ పురస్కారం దక్కలేదు. 1886లో ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించడానికి ముందు రాసిన విల్లులో ఆర్థిక శాస్త్రంలో విశేష కృషి చేసిన వారికి బహుమతి ఇవ్వమంటూ పేర్కొనలేదు. అయితే నోబెల్ జ్యూరీ ఆ తరువాత ఈ రంగాన్ని కూడా చేర్చారు. ఎలినార్ ఓస్ట్రోంతో పాటుగా ఆలివర్ విలియంసన్ సంయుక్తంగా నోబెల్ బహుమతిని అందుకుంటారు. డిసెంబర్ 10న నోబెల్ జయంతి రోజున స్వీడన్ రాజు చేతులమీదగా వీరిద్దరూ నోబెల్ పురస్కారాలను స్వీకరిస్తారు.
రోమానియాలో పుట్టి జర్మనీలో స్థిరపడిన హెర్టా ముల్లెర్, సాహిత్యంలో నోబెల్ బహుమతి అందుకుని నాలుగవ వనితగా నిలిచారు. కాగా, మెడిసన్ రంగంలో ఎలిస్బత్ బ్లాక్ బర్న్, కరోల్ గ్రీడెర్ (అమెరికా), రసాయన శాస్త్రంలో ఆదా యోనత్ (ఇజ్రేల్) కూడా నోబెల్ బహుమతులు అందుకున్న మహిళామణుల జాబితాలో చేరారు.
2004లో ముగ్గురు మహిళలకు నోబెల్ బహుమతులు దక్కాయి.

హెచ్చరిక: భూకంపం రాబోతుందా !

భూ వాతావరణంలో పెను మార్పులు వచ్చినట్టే, భూమి లోపలి పొరల్లో కూడా అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని భూగర్భశాస్త్రవేత్తలు చెబుతున్నారు. సముద్ర ఉపరితల జలాలు విపరీతంగా వేడెక్కడం వల్ల `ఎల్ నినో' అనే విపరీత పరిస్థితి ఏర్పడటంవల్లనే ఇప్పుడు అనేక దేశాల్లో (ఇందులో భారత్ కూడా ఉంది) అయితే కరువులు, కాకుంటే జలప్రళయాలు చోటుచేసుకుంటున్నాయి. వీటికి తోడుగా భూగర్భ పొరలు కదలిపోతున్నాయి. ఈ కారణంగానే సముద్రగర్భంలో పెను భూకంపాలు వచ్చి తద్వారా సునామీలు సంభవిస్తున్నాయి. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో కరువు, వరదలు వచ్చిపడ్డాయి. ఈ విపరీత పరిణామాలు ఇక్కడితో ఆగవనీ, పెను భూకంపాలు కూడా రావచ్చని భూగర్భశాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఒక వేళ అదే జరిగితే, మానవ తప్పిదాల వల్ల జననష్టం ఎక్కువగా ఉంటుందని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మానవ అవసరాల కోసం ఇటవల కాలంలో బహుళ అంతస్థుల భవనాలు వెలిశాయి. ఒకనాటి అడవులు, కొండలు ఇప్పుడు కాంక్రీట్ జంగిల్స్ గా మారిపోయాయి. ఫలితంగా ఒక మోస్తరుగా భూమికంపించినా జననష్టం అపారంగా ఉంటుంది. పైగా భూకంపాలను చాలా ముందస్తుగా గుర్తించడం కష్టమే. నాగరికత పేరిట మనం సృష్టించుకున్న అత్యాధునిక సౌకర్యాలే మనకు ఉరితాళ్లుగా మారబోతున్నాయని కూడా పర్యావరణ నిపుణులు ఆవేదన చెందుతున్నారు. సాధ్యమైనంతవరకూ ప్రకృతిని గౌరవిస్తూ, దాని పరిధికి లోబడే జీవించడం నేర్చుకుంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు బతికిబట్టకట్టగలిగే అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు. మరి, దీనిపై మీరేమనుకుంటున్నారు. మీ కామెంట్స్ మాకు పంపించండి. రాబోయే విపత్తులను అధిగమించడానికి ఏం చేయాలో సూచించండి.
-కణ్వస

రవిప్రకాష్ పొలిటికల్ ఎంట్రీ?

మీ ఊహనిజమే. రవిప్రకాష్ అంటే మీరు అనుకుంటున్న రవిప్రకాషే. టివీ 9ని ఎంతో సమర్థవంతంగా నడుపుతున్న రవిప్రకాషే. ఆయనేంటీ, రాజకీయాల్లోకి రావడమేమిటని కాస్తంత ఆశ్చర్యపోవచ్చు. కానీ జరగబోతున్నది అదే. ఈ ప్రతినిధి అత్యంత గోప్యంగా సేకరించిన సమాచారం ప్రకారం ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
  • చాలాకాలం క్రిందటే వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పడే ఒక సందర్భంలో రవిప్రకాష్ ని ఎంకరేజ్ చేస్తూ, `మీ లాంటి యూత్ రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది. ప్రజలను చైతన్యవంతుల్ని చేయడంలో మీలాంటి వాళ్ల సహకారం ఎంతో అవసరం' అని చెప్పారు.
  • మీడియా శక్తివంతమైనదే అయినా, ప్రజలకు సేవ చేయడానికి మీడియాకంటే రాజకీయాలే సరైన వేదికన్న భావన రవిప్రకాష్ లో కలిగించారు.
  • వైఎస్సార్ ఒక ఉద్దేశంతో రవిప్రకాష్ తో ఈ ప్రోత్సాహకరమైన మాటలు చెబితే, వాటినే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానం మరో రకంగా ఉపయోగించుకుంటున్నది.
  • జగన్ వంటి యువనేత ఒక పక్క ప్రజాభిమానాన్ని సంపాదించుకుంటూ తనదైన బలాన్నీ, బలగాన్నీ పెంపొందించుకుంటున్నప్పుడు అతగాడికి చెక్ పెట్టాలంటే మరో యువశక్తి కావాలని కాంగ్రెస్ అధిష్ఠానం చూస్తోంది. సినీరంగం నుంచి కానీ, లేదా మీడియా రంగం నుంచి కానీ ఎవరైనా అలాంటి యువకెరటం ఉంటే పని సులువవుతుందని అధిష్ఠానం అనుకుంది.
  • సరిగా అదే సమయంలో సినీనటుడు రాజశేఖర్ పీసీసీ కార్యాలయంలో డిఎస్ కి ఓ సూచన చేశారు. గతంలో కొంతమేరకు ఆసక్తి కనబరిచిన రవిప్రకాష్ ను ఇందుకోసం వినియోగించుకోవచ్చని చెప్పడంతో పావులు చకచకా కదిలాయి. కర్నూలుకి వరద వచ్చినప్పుడు రవిప్రకాష్ మీడియా ద్వారా ప్రజలకు చైతన్యం కలిగించిన తీరు ఢిల్లీ పెద్దలను ఆకర్షించింది. వెంటనే రాజశేఖర్ ద్వారా ఓ సందేశం రవిప్రకాష్ కు చేరింది.
  • టివీ 9 కేవలం ఆంధ్రప్రదేశ్ కే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా పాతుకుపోవడంతో వ్యాపారపరంగా అటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతోనూ, ఇటు కేంద్రంలోని యుపీఏ సర్కార్ తోనూ అనేక అవసరాలు సహజంగానే ఉంటాయి. ఇది కాదనలేని సత్యం. ఈ నేపథ్యంలో ఉభయతారకంగా ఉంటుందని రవిప్రకాష్ భావించారు.
  • వరదబాధితుల సహాయార్థం అట్టహాసంగా ర్యాలీలు చేపట్టారు. రవిప్రకాష్ తన టీమ్ తో ప్రజల ఫీలింగ్స్ ని తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టారు.
  • టివీ ఛానెల్ కి సీఈఓ గా ఉన్న రవిప్రకాష్ అంతా అనుకూలిస్తే, అతి త్వరలోనే రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీని మరింతగా బలోపేతం చేయవచ్చన్న సంకేతాలు కనబడుతున్నాయి.
- కణ్వస

Sunday, October 11, 2009

సెటైర్: `సీఎం' ఫ్లూ స్లోడౌన్

లంబు: హమ్మయ్యా, మొత్తానికి `సీఎం ఫ్లూ' తగ్గుముఖం పట్టిందిరా.
జంబు: సీఎం ఫ్లూనా...! ఇదేంటిరా స్వైన్ ఫ్లూకి కొత్త వర్షనా..?
లంబు: కొత్త వర్షన్ కాదు, అధిష్ఠానానికి పెద్ద టెన్షన్. నిన్నమొన్నటి వరకు సీనియర్లు, జూనియర్లంతా సీఎం ఫ్లూకి ఎటాకైనవాళ్లే.
జంబు: ఎట్లా... ఇంతకీ ఈ సీఎం ఫ్లూ ఏంటీ, దాని సింప్టంమ్స్ ఏమిటీ..?
లంబు: ఈ వ్యాధి సోకితే, పేషెంట్ కీ ఏ కుర్చీ చూసినా సీఎం ఛైర్ లాగానే కనబడుతుంటుంది. దాన్ని అమాంతం లాక్కుని కూర్చోవాలనిపిస్తుంది. ఎక్కువగా పగటి కలలు కంటుంటారు. తాము సీఎం అయిపోయినట్టూ, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లు పెట్టేసినట్టూ , హెలికాప్టర్లలో చక్కర్లు కొడుతున్నట్టూ కలలు కంటుంటారు. దొరికిన చిత్తుకాగితాలుపోగేసి మొదటి ఫైల్ మీద సంతకం పెట్టినట్టు ఫీలైపోతుంటారు. మీడియా మైక్ చూడగానే మైకం కమ్ముతుంటుంది. అసలు, స్వైన్ ఫ్లూ వస్తే పేషెంట్ కే టెన్షన్. కానీ సీఎం ఫ్లూ వస్తే అధిష్టానానికి టెన్షన్...ప్రజలకు ఎటెన్షన్...మీడియాకు కలెక్షన్స్.
జంబు: వ్యాధి ముదిరితే మధ్యంతర ఎలెక్షన్స్. బాగానే ఉంది, ఇంతకీ సీఎం ఫ్లూ ఎంత మందికొచ్చిందేంటీ?
లంబు: చెబుతా లిస్ట్ రాసుకో...కాంగ్రెస్ లో...1. జగన్, 2. వీహెచ్, 3. డీఎస్, 4. కేకే, 5. జానారెడ్డి, 6. జైపాల్ రెడ్డి, 7....
జంబు: చాల్చాలు, ఇంతమందా...! ఇంతకీ ఈ రోగానికి మందుందా?
లంబు: లేకేం, హైకమాండ్ పూటకో డోసేస్తునే ఉంది.
జంబు: ఎవరికీ?
లంబు:రోశయ్యకు.
జంబు: జబ్బు వాళ్లకైతే, మందు రోశయ్యకెందుకూ..!?
లంబు:కాంగ్రెస్ ట్రీట్ మెంటే అంత. రోశయ్యకు ఓవర్ డోసిచ్చి బలోపేతం చేస్తే మిగతా వాళ్లంతా కోమాలోకి వెళ్ళిపోతారన్లే...
జంబు: ఇదేనేట్రా, సీఎం ఫ్లూ తగ్గుముఖం పట్టడమంటే...!
- మన్నవ

సెటైర్: క్విక్ గన్ జగన్...మైండ్ బ్లాక్!

లంబు: ఏరా జంబుగా, క్విక్ గన్ జగనేందిరా సైలెంటైపోయాడు?
జంబు: క్విక్ గన్ జగనా? వాడెవడూ...క్విక్ గన్ మురుగన్ బ్రదరా?
లంబు: కాదురా, వైఎస్సార్ సన్నూ..మన జగనన్న..సైలెంట్ గా ఉన్నాడెందుకా అనీ...!
జంబు: గన్ లో బులెట్లయిపోయాయేమోరా.
లంబు: బులెట్లేందిరా?
జంబు: అదేరా, మొదట్లో సానుభూతి బులెట్ గురెట్టాడా, ఆ తరువాత భావోద్వేగం బులెట్ వదిలిపెట్టాడా, ఆపై సాక్షి మిషన్ గన్ తో రోజుకో 20 బులిటెన్లు వదిలిపెట్టాడా..ఏదీ టార్గెట్ కి తగల్లేదాయే. అంతేకాక, రోశయ్యకే ఫుల్ సపోర్టిచ్చేస్తూ హైకమాండ్ ఇచ్చిన దెబ్బకి మనోడికి మైండ్ బ్లాకైపోయుంటుంది.
లంబు: అంటే, ఎవరు కొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో, వాళ్లే కొట్టారన్నమాట.
జంబు: అంతేగామరీ, మొక్కై వొంగనిదే మానై వొంగదని ఆళ్లకీ అర్థమైపోయింది.
లంబు: పాపం మనోడికే ఇంకా అర్థంకాలా...
- కణ్వస

మీడియాను నమ్మలేం...

ఎడిటర్స్ వాయిస్
మీడియా అనేక సర్వేలు నిర్వహిస్తుంటోంది. ఇటు పత్రికలు, అటు టివీ ఛానెళ్లు పోటీపడి మరీ సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఎన్నికలప్పుడైతే ఈ సర్వేల హోరు అంతాఇంతాకాదు. అలాగే, పోల్ ద్వారా కూడా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంటోంది. వైఎస్సార్ మరణానంతరం కొద్ది గంటల్లోనే రెండు ప్రముఖ ఛానెళ్లు `జగన్ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా?' అన్న ప్రశ్నను సంధిస్తూ ఎస్ఎంఎస్ పోలింగ్ కండెక్ట్ చేశాయి. ప్రజల్లో భావోద్వేగం పతాకస్థాయిలో ఉన్న వేళలో ఇలాంటి పోలింగ్ పెట్టడం వల్ల సహజంగానే జగన్ పక్షానే ఎక్కువ ఓట్లు పడ్డాయి. సుమారుగా దాదాపుగా 90 శాతం మంది దాకా జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నట్టు చూపించారు. భావోద్వేగాలు తగ్గిన తరువాతనే ప్రజల్లోని కచ్చితాభిప్రాయాన్ని రాబట్టవచ్చన్న ఉద్దేశంతో `నారదలోకం' ఇదే ప్రశ్నపై (జగన్ ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారా?) పోలింగ్ నిర్వహించింది. ఇందులో 8 శాతం మంది మాత్రమే జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నట్టు తేలగా, 92 శాతం మంది వారసత్వంగా జగన్ ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారన్న వాదనను వ్యతిరేకించారు.
అలాగే, `నారదలోకం' మరో ఆసక్తికరమైన అంశంపై కూడా పోలింగ్ పెట్టింది. మీడియా చెప్పేవన్నీ నిజాలేనా? అన్న ప్రశ్న నెట్ జన్స్ ను అడిగింది. కనీసం ఒక్కరు కూడా మీడియా చెప్పేవన్నీ నిజాలని చెప్పకపోవడం ఆశ్చర్యకరంగానే అనిపించినా, ఈ పోల్ వాస్తవకోణాలను స్పృశించిందనే చెప్పాలి. ఇప్పటి వరకు నిర్వహించిన రెండు పోల్ ల ఫలితాలను మీరు మన బ్లాగ్ (నారదలోకం)లో చూడవచ్చు.
నిజాలను నిర్భయంగా చెబుతామని ప్రకటించుకునే మీడియా పట్ల విశ్వసనీయత ఇంతగా పడిపోవడానికి కారణాలు ఏమిటో విశ్లేషించుకోవాల్సిందే. జర్నలిజం క్యాపిటలిస్ట్ ల చేతుల్లో చిక్కుకున్న తరువాత మీడియా పట్లనే గౌరవం తగ్గిపోతున్నదా? అందుకు ఈ పోల్ ఒక సంకేతంగా నిలిచిందా? ఈ దిశగా ఆలోచించాల్సిందే. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియాది అత్యంత కీలకమైన స్థానమే. అందుకే దీన్ని `ఫోర్త్ పిల్లర్' గా చెప్పుకుంటాం. అలాంటి ఫోర్త్ పిల్లర్ పునాదాలు కదిలిపోతున్నాయా? దీనికి ఎవరు బాధ్యులు? మీడియాను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య ప్రియులందరి మీదా ఉంది. కాదంటారా? మీ అభిప్రాయాలను వెంటనే పోస్ట్ చేయండి. ఈ ఉద్యమంలో మీరూ భాగస్వాములుకండి. మీ సలహాలు అందివ్వండి.
-కణ్వస

Saturday, October 10, 2009

స్పెషల్: ఏంటట బిగ్ బీలో స్పెషాలటీ?


బిగ్ బీ 67వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అక్టోబర్ 11తో ఆయన 67వ వసంతంలోకి అడుగిడబోతున్నారు. ఈ సందర్భంగా అమితాబ్ స్పెషాలటీలు ఏమిటో తెలుసుకుందాం.


  • పాజిటీవ్ దృక్పధం: ఎన్ని కష్టాలు ఎదురైనా నిబ్బరంగా నిలిచి, మళ్ళీ కెరీర్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవడానికి ఇది సాయపడింది.

  • పట్టుదల: చిన్నప్పటి నుంచీ సినిమాలంటే పిచ్చి ఇష్టం. అందుకే 20వ ఏటనే తనసొంతఊరు అలహాబాద్ ని వదిలిపెట్టేసి బాలీవుడ్ రాజధాని అయిన బొంబాయి చేరుకున్నారు.

  • డైలాగ్ కింగ్: సన్నగా పుల్లలా ఉన్నాడు. ఇతను సినిమాల్లో పనికారడనుకున్న నిర్మాతలే అమితాబ్ డైలాగ్ లకు మంత్రముగ్ధులై అతని ఇంటి ముందు క్యూ కట్టడం విశేషం.

  • మెగాస్టార్: పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీలేదని నిరూపించాడు. 1970, 80 దశకాల్లో తిరుగులేని హీరోగా నిలిచాడు. మెగాస్టార్ అయ్యాడు.

  • బహుముఖ ప్రజ్ఞాశాలి: సినీనటునిగా ఉంటూనే ప్లేబ్యాక్ సింగర్ గా గుర్తింపు పొందారు. నిర్మాతగా మారారు. టెలివిజన్ ప్రెజెంటర్ గా అవతారమెత్తారు. కౌన్ బనేగా కరోడ్ పతీ పేరు చెప్పగానే కళ్లముందు అమితాబ్ రూపమే మెదులుతుంది.

  • రాజకీయం: 1984 నుంచి 89 వరకు పార్లమెంట్ సభ్యునిగా ఉన్నారు.

  • పర్సనల్: భార్యపేరు జయాబచన్. ఇద్దరు పిల్లలు. శ్వేతనందన్ (కూతురు), అభిషేక్ బచ్చన్ (కుమారుడు). అందాల సుందరి ఐశ్వర్యారాయ్ ని కోడలిగా చేసుకున్నారు.

  • ఆచారాలు: దైవభక్తి ఎక్కువ. హిందూ ఆచారాలను పాటిస్తుంటారు.

  • విశ్వరూపం: జంజీర్ తో కొత్త వొరవడి సృష్టించుకున్న అమితాబ్ ఆ తరువాత షోలే, దివార్, డాన్ వంటి చిత్రాల్లో అందనంత ఎత్తుకు ఎదిగారు. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు.

  • విషాదం: 1982లో కూలీ చిత్రం షూటింగ్ జరుగుతున్నప్పుడు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తరువాత 2005లో మరోసారి ఆరోగ్యం క్షీణించింది. అయినా కోలుకుని తనదైన శైలిలో సాగిపోతూనే ఉన్నారు.

  • బిగ్ బీ ఎట్ ప్రెజెంట్: మూడు సినిమాలు రాబోతున్నాయి. (అల్లాదీన్ - అక్టోబర్ 20న రిలీజ్, పా - డిసెంబర్ 4న, తీన్్ పట్టీ వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండున) బిగ్ బాస్ - 3 టివీ షోలో హోస్ట్ గా ఉండబోతున్నారు.

  • బిగ్ బ్లాగ్: బిగ్ బీ.బిగ్ అడ్డా. కామ్ ద్వారా 2008 ఏప్రిల్ నుంచి ప్రత్యేక వ్యాసాలు రాస్తూ అభిమానుల మన్ననలు అందుకుంటూనే ఉన్నారు.

సెటైర్: కేసీఆర్ తిట్లకు అర్థాలే వేరులే

కేసీఆర్ వాక్చాతుర్యం అంతాఇంతాకాదు. ఆయన నోరు విప్పితే చాలు పవర్ ఫుల్ పదాలు దూకేస్తుంటాయి. అందుకే ఆయనగారి వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదమవుతుంటాయి. గొడవ ఎక్కువైతే, కేసీఆర్ చాలా తాపీగా `అంత లొల్లెందుకు, ఇదంతా మా తెలంగాణ యాస. మేమట్టనే అంటాం' అంటూ తేల్చిపారేస్తారు. కేసీఆర్ కంటి ఆపరేషన్ చేయించుకుని ఢిల్లీ నుంచి వరద బాధితులను పరమర్శించడానికని రాష్ట్రంలో కాలుమోపగానే తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. పనిలో పనిగా హెలికాప్టర్ దిగుతూ పడ్డారు కూడా...కొద్దిలో ముక్కు నేలకు తాకే ప్రమాదం తప్పిపోయింది.
కేసీఆర్ తాజాగా విసిరిన పవర్ ఫుల్ మాటలు, వాటి అర్థాలు ఓ సారి చూద్దాం...
`దిక్కుమాలిన చావుచచ్చిన వైఎస్సార్ పీనుగ హైదరాబాద్ కు రాకముందే జగన్ ని సీఎం చేయాలని రాజ్ భవన్ యాత్రచేపట్టింది ఎవరు?'
కేసీఆర్ వ్యాఖ్యలకు ప్రతిపదార్థం చూద్దాం...
దిక్కుమాలిన= అనూహ్యంగా, దిగ్భ్రాంతికరంగా
చావుచచ్చిన= మరణించిన, మృతిచెందిన, కాలం చేసిన, స్వర్గస్థులైన, దివంగతులైన.
వైఎస్సార్ పీనుగ = వైఎస్సార్ శవం, వైఎస్సార్ మృతదేహం, వైఎస్సార్ పార్థివ శరీరం
ఇక కేసీఆర్ వ్యాఖ్యలోని అసలు భావం చూద్దాం..
`దిగ్ర్బాంతికరంగా, అనూహ్యంగా మరణించిన వైఎస్సార్ పార్థివ శరీరం హైదరాబాద్ కు చేరకముందే జగన్ ని సీఎం చేయాలని రాజ్ భవన్ యాత్ర చేపట్టింది ఎవరు?'
కేసీఆర్ తిట్లకు అర్థాలే వేరులే అని ఇప్పటికైనా మీరు నమ్ముతారా...
- కణ్వస
Tags: Telangana KCR Telugu

పోకస్: బలహీనపడిన జగన్ - 3

వైఎస్ మరణానంతరం రాజకీయంగా శూన్యత ఏర్పడిందనీ, స్తబ్దత చోటుచేసుకుందని ఎవరైనా అంటే అందులో నిజం లేదనే చెప్పలి. ఎందుకంటే, వైఎస్సార్ పార్థివ శరీరానికి అంత్యక్రియలు పూర్తికాకముందే వివిధ పార్టీల శిబిరాల్లో అత్యంత రహస్యంగా వ్యూహాత్మకంగా ఎత్తుగడలు చోటుచేసుకున్నాయి. కాకపోతే ఒక పెద్ద నాయకుడు ఉన్నట్టుండి కనుమరుగు కావడంతో ఎల్లెడలా భావోద్వేగం చోటుచేసుకున్నమాట వాస్తవమే. ఆ భావోద్వేగమే జగన్ వంటివారికి అదనపు బలాన్ని అందించింది. నిజానికి ఇది బలుపా, వాపా అన్నది ఈ యువనాయకుడు గ్రహంచేలోపే అధిష్ఠానం వద్ద - శక్తివంతుడైన యువనేతకు జరగరాని అన్యాయం జరిగిపోయింది. భావోద్వేగం నుంచి ఎగిసినపడిన ఆవేశం జగన్ రాజకీయ కెరీర్ కు మేలు చేయకపోగా కీడు చేసింది. సరిగా ఇదే సమయంలో ప్రత్యర్థులు బలం పుంజుకోవడం ప్రారంభించారు.
ఇదే శీర్షికన మొదటి రెండు భాగాల్లో ప్రస్తావించినట్టు తాత్కాలిక ముఖ్యమంత్రే అనుకున్న రోశయ్య పూర్తిగా సీఎం సీటును ఆక్రమించుకున్నారు. అధిష్టానమంత్రాన్ని వల్లెవేస్తూ తన స్థానాన్ని బలోపేతం చేసుకున్నారు. అదే, జగన్ ఈ పని చేయలేకపోయారు. పావురాలగుట్టకు చేరువలోని నల్లకాలువ వద్ద బహిరంగ సభ పెట్టినప్పుడు జగన్ కనీసం ఒక్క మాట కూడా పార్టీ గురించి కానీ, లేదా అధిష్ఠానం గురించి కానీ ప్రస్తావించలేదు. అధిష్టానమంత్ర మహిమను జగన్ సరిగా అర్థం చేసుకోలేకపోయారు. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీగానీ, అందులోని సీనియర్ నేతలు కానీ ఈ యువనేత మనోభావాలను సరిగా అవగతం చేసుకోలేకపోయారు. జగన్ అనుయాయుల ప్రేలాపనలు, చేష్టలు యువనేతపై రుద్దే ప్రయత్నం చేశారు. ఎప్పటికప్పుడు అధిష్ఠానానికి మరిన్ని కల్పించి చేరవేశారు. సరిగా అదే సమయంలో జగన్ మౌనవ్రతం వీడి వాస్తవాలను స్పష్టంగా వెల్లడించి ఉంటే పరిస్థితి మరోరకంగా ఉండది. జననేత మహాభినిష్క్రమణ తరువాత ఆయన కుమారుడు తండ్రి స్థానంలో కూర్చోవాలనుకోవడంలో తప్పలేదు, కానీ, అందుకు ఆయన ఎంచుకున్న మార్గంలో వైరి వర్గాల వారు అనేక హర్డిల్స్ సృష్టించారు. ఫలితంగా జగన్ ఉన్నట్టుండి రాజకీయంగా బలహీనుడయ్యారు.
రోశయ్య, చంద్రబాబు బలోపేతులైనట్టుగానే ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కూడా అదునుచూసి పావులు కదుపతూ, బలపడే ప్రయత్నం ప్రారంభించారు. సీఎం కావాలన్న ఆయన ఆశ ఎలాగో ఇప్పట్లో తీరదు కనుక మరోదారిలో సాగతూ, గౌరవప్రదమైన సీటు (వీలైతే హోం మంత్రి పదవి) దక్కించుకోవాలనుకున్నారు. జగన్ ప్రభావం వల్ల రోశయ్య ప్రభుత్వం మైనార్టీలో పడితే, ఆదుకోవడానికి తనవద్ద ఉన్న 18 మంది ఎమ్మేల్యేలను సిద్ధం చేసే పనిలోపడ్డారు. అయితే ఇందుకు ప్రతిగా హోంశాఖ కావాలని చిరంజీవి రోశయ్యను కోరినట్టు తెలిసింది. తిరుపతిలో రోశయ్యను కలుసుకుని దాదాపు గంటన్నరసేపు ముచ్చట్లు జరిపిన చిరంజీవి తన మనసులోని మాటను బయటపెట్టినట్టు చెప్పుకుంటున్నారు. ఈ రకంగా చిరంజీవి బలోపేతమవుతూ, జగన్ పై పరోక్షంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరి, తెరాస అధినేత కేసీఆర్ ఏ విధంగా పావులు కదుపుతున్నారు? జగన్ కు వ్యతిరేకంగా ఎలాంటి ఎత్తుగడలు వేస్తున్నారన్న ఆసక్తికరమైన విషయాలను కూడా విశ్లేషించుకోవాల్సిందే...
(కేసీఆర్ ఎత్తుగడలు తరువాయి భాగంలో)
-కణ్వస