Thursday, December 31, 2009

హ్యాపీ న్యూ ఇయర్

నారదలోకం పాఠకులకు
2010
నూతన సంవత్సర శుభాకాంక్షలు
అతిత్వరలోనే మళ్లీ మీ ముందుకు విశేష వార్తలు తీసుకువస్తానని మాట ఇస్తూ ...
మీ కణ్వస
kanvasas@gmail.com

Monday, December 7, 2009

ప్రత్యేక రాష్ట్రం - పది ప్రశ్నలు

ఆంధ్రప్రదేశ్‌ విభజన ప్రస్తావన మళ్ళీ నలుగురి నోటా వినిపిస్తున్నది! విభజనోద్యమం విద్యా ర్థులు, ఉద్యోగి వర్గాల చేతుల్లోకి వెళ్లడంతో అది తీవ్రరూపమే ధరిస్తున్నది. సమష్టి రాష్ట్రంలో తమకు అన్యాయాలు జరుగుతున్నవని తెలంగాణ సోదరులు చాలాకాలంగా ఘోషిస్తున్నారు. అయితే,విభజనకు సంబంధించిన కొన్ని క్లిష్ట సమస్యలు,వాటికి పరిష్కార మార్గాలను కూడా నిర్ణయించుకున్న తర్వాత విభజన ఆలోచన చేయడం జరిగింది.
'రాష్ట్రాన్ని విభజించడమంటే,కాగితాన్ని రెండు ముక్కలుగా చించడం కాదు! దానికి బోలెడు తతంగముంది అని ఆ మధ్య పిసిసి మాజీ అధ్యక్షులు కె.కేశవరావు అన్నమాట అక్షరాల నిజం. ఔను! రాష్ట్రవిభజన అనేది చెప్పేంటత సులభంకాదు. ఒక రాష్ట్రాన్ని విభజించడానికి రాజ్యాంగం సుదీర్ఘమైన కార్యక్రమాన్ని నిర్దేశించింది. విభజనకు ముందు ఎన్నో ప్రశ్నలకు,లేదా ఏర్పడబోయే సమస్యలకు సమాధానాలను కూడా సిద్ధం చేసు కోకుండా విభజన గురించి నిర్ణయించడమంటే, పైకి వచ్చే మార్గం చూసుకోకుండా నూతిలోదూకడం వంటిదే! ఆ ప్రశ్నలు ఏదో ఒక ప్రాంతానికి సంబంధించినవి కావు. అవి మొత్తం రాష్ట్రానికి సంబంధించినవి,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవశ్యం ఆలోచించవలసినవి.
1953లో సమష్టి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని వేరు చేసినపుడు నేను ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశంగారికి కార్యదర్శిగా పనిచేసిన అనుభవంతో అప్పటి నాయకులు, ప్రజలు ఎదుర్కొనవలసిన సమస్యలను స్వయంగా చూసినవాడిని.ఆప్రశ్నలు
1.ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగితే, మిగిలిన ఆంధ్ర ప్రాంతానికి రాజధాని ఏది?1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు రాజధాని కోస్తా జిల్లాలలో విజయవాడ-గుంటూరు పట్టణాల మధ్య వుండాలని ఆప్రాంతంవారు, కాదు, రాయలసీమలోనే వుండాలని ఆప్రాంతంవారు ఆందోళనలే చేశారు.చివరికి,1937లో దేశోద్ధారక కాశీనాథుని శివనాగేశ్వరరావు గృహం 'శ్రీబాగ్‌లో సర్కారు,రాయలసీమ ప్రాంతాలకు చెందిన నాయకుల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం,రాయలసీమ వారు రాజధానినే కోరుకున్నందున, కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు పెట్టాలని నిర్ణయించారు.
ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం
2.ఇప్పుడు కూడా రాయలసీమవారు అదే కోరవచ్చు. రాష్ట్రాన్ని విభజిస్తే రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేయాలని రాయలసీమ హక్కుల సమితి ఎప్పటి నుంచో అంటున్నది.అసలు రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేయాలని 1953కు పూర్వం నుంచి రాయలసీమ మహాసభ కోరుతూ వచ్చింది.ఆతరువాత భారత రాష్ట్రపతి పదవి,అంతకు పూర్వం ఆంధ్రప్రదేశ్‌కు రెండుసార్లు ముఖ్యమంత్రిత్వం వహించిన నీలం సంజీవ రెడ్డి ఒక దశలో రాయలసీమ మహాసభకు అధ్యక్షులుగా వున్నారు. రాష్ట్ర విభజన జరిగితే, రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేయాలనో లేదా రాజధానిని కర్నూలులోనో, తిరుపతి లోనో,మరొకచోటో నెలకొల్పాలని ఆ ప్రాంతం వారు కోరవచ్చు.
3. మరి,విశాఖపట్నం ఇప్పటికే ఎన్నో పరిశ్రమలతో,నౌకానిర్మాణ కేంద్రం,ఉక్కు ఫ్యాక్టరీలతో అంతర్జాతీయ నగరంగా పరిఢవిల్లుతున్నదని,కాబట్టి దానినే ఆంధ్రరాష్ట్ర రాజధానిని చేయాలని ఆ నగరవాసులు, లేదా ఉత్తరాంధ్ర జిల్లాల వారు కోరవచ్చు.
4. అన్నట్టు, రాష్ట్రవిభజన జరిగితే,శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్నం జిల్లాలతో 'ఉత్తరాంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ కొంతకాలంగా వినవస్తున్నది.నిజానికి,విశాఖపట్టణాన్ని ఆంధ్ర రాష్ట్ర రాజధాని చేయాలని ఉత్తరాంధ్ర ఉక్కుమనిషి సర్దార్‌ లచ్చన్న 1953లోనే కోరారు.
భవనాలకు సొమ్ము ఏది?
5.ఎక్కడ కొత్త రాష్ట్రరాజధాని పెట్టినా,హైదరాబాదులో వలె ప్రభుత్వ కార్యాలయాలకు,అసెంబ్లీ,సెక్రటేరియట్‌లకు, హైకోర్టుకు,ఇంకా ఎన్నింటికో బ్రహ్మాండమైన భవనాలు కావాలి.వాటిని నిర్మించడానికి ఎన్నివేల కోట్ల రూపాయలు కావాలి. వీటిని ఎవరిస్తారు?ఆంధ్ర ప్రాంతంలో ఒక ఆధునిక రాజధానీ నగరాన్ని నిర్మించడానికి ఎంతకాలం పడుతుంది? అంతకు వరకు కొత్త రాష్ట్ర రాజధాని ఒక 'కాందిశీకుల శిబిరంగానే వుండవలసిందేనా? అని ఆ ప్రాంతం వారు అడగరా?'రాష్ట్ర విభజన జరిగితే,అనంతపురం జిల్లాను కర్ణాటకలో కలిపితే,మాకు నేత్రావతి నదీ జలాలు పుష్కలంగా లభించి,మేము బాగా అభివృద్ధి చెందుతామని ఆ జిల్లాకు చెందిన అప్పటి మంత్రి ఒకరు పేర్కొన్నారు.
ముస్లింల కోర్కె
6 'ప్రత్యేక రాష్ట్రానికి మేము వ్యతిరేకం,రాష్ట్ర విభజన చేసేటప్పుడు మమ్మల్నికూడా సంప్రదించండిఅని ఆ మధ్య ఢిల్లీలో జాతీయ సమగ్రతా మండలి సమావేశంలో,కొన్ని దశాబ్దాలుగా హైదరాబాదు నగరంలో తమ ప్రాబల్యం చెలాయిస్తున్న ఎమ్‌ఐఎమ్‌కు చెందిన ఎమ్‌పి అసదుద్దీన్‌ ఒవైసీ పేర్కొన్నారు.7 అంతేకాదు రాష్ట్రాన్ని రెండు ముక్కలో,మూడు ముక్కలో చేస్తే దాదాపు 60 లక్షల జనాభా వున్న హైదరాబాదు నగ రాన్ని కూడా ప్రత్యేక రాష్ట్రం చేయాలన్న డిమాండ్‌ కూడా ఎమ్‌ఐఎమ్‌ నుంచి వినిపించడంలేదా?8.'హైదరాబాద్‌లేని రాష్ట్రం తలలేని మొండం వంటిది.ఆమహానగరంలేని ప్రత్యేక రాష్ట్రం మాకెందుకని విభజనవాదులు ఇదివరకే ధ్వనించారు.హైదరబాద్‌ నగరం చుట్టూ వున్నది తెలంగాణా ప్రాంతమే కాబట్టి హైదరాబాద్‌ను ఎలా వేరు చేస్తారని వారివాదన.అది కూడా వాస్తవమే.9 'హైదరాబాద్‌ నగరాన్ని ఈ స్థాయికి తీసుకు రావడానికి మాపెట్టుబడి,మాకృషి ప్రధానకారణం. దాన్ని ఎలా వదిలివేస్తామని ఆంద్ర ప్రాంతం వారి వాదనగా కనిపిస్తున్నది.10 రాష్ట్ర విభజన జరిగితే,కృష్ణా,గోదావరి నదీజలాలపై ప్రాజెక్టులపై నిర్మాణం సమస్య మరింత జటిలం కావచ్చు.అది రెండు ప్రాంతాల మధ్య నిత్య వివాదంగా పోరాటంగా పరిణమించవచ్చునని నీటి పారుదల సమస్యల నిపుణులు ఆందోళన చెందుతున్నారు. కాగా,ఈ సమస్యలు, ప్రశ్నలనింటినిచూస్తే, రాష్ట్రవిభజన వ్యవహారం తేనెతుట్టెను కదపడం వంటిదని బోధపడటం లేదా?
- తుర్లపాటి కుటుంబరావు (`వార్త' సౌజన్యంతో)

Tuesday, November 24, 2009

సెటైర్: ఓటరు - గ్రేటరు

`గ్రేటర్' హైదరాబాద్ మహానగరంలోని ఓ పౌరుడు. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే, మధ్యతరగతి ఉద్యోగస్థుడు. అతగాడు ఆరురోజులు పనిచేసేదే `ఆదివారం' రాకకోసం. ఆదివారం రాకపోతుందా అన్న ఆ ఒక్కఆశే అతగాడ్ని మిగతారోజుల్లో పరుగులుపెట్టిస్తుంది. అన్ని ఆదివారాల్లాగానే ఈ ఆదివారం కూడా గ్రేటర్ రెస్ట్ తీసుకుంటున్నాడు. ముసుగుతన్ని పడుకున్నాడు. పొద్దున్న కాఫీ, టిఫినీలు బెడ్ మీదనే లాగించాడు. మళ్ళీ ముసుగుతన్ని పడుకున్నాడు. మధ్యాహ్నం భోజనం లాగించేసి కాసేపు టివీలో సినిమాలు చూశాడు. పెళ్లాంబిడ్డలతో కబుర్లాడాడు. రాత్రి పెందలాడే మళ్ళీ ముసుగుతన్ని పడుకున్నాడు. మంచి నిద్రపట్టేసింది. అంతలో ఎవరో వచ్చి తట్టిలేపారు. `ఛీ, అదివారం పూట కూడా హయిగా పడుకోనివ్వరు...' అంటూ విసుక్కున్నాడు గ్రేటర్. కానీ, ఆ వచ్చినవాడు పట్టువదలని విక్రమార్కుడిలా ఉన్నాడు. అందుకే మళ్ళీమళ్లీ తట్టిలేపుతూనే ఉన్నాడు. దీంతో గ్రేటర్ కి ముసుగుతీయక తప్పలేదు.
`ఎవరునువ్వు?' గట్టిగానే కసురుకున్నాడు గ్రేటర్.
`నేను ఓటర్ని...లే..త్వరగాలే...'
గ్రేటర్ కి కోపం నశాలానికంటింది.
`ఏంటీ లేచేది. సిటీబస్సులో స్టాండింగ్ ప్యాసింజర్లా ఏంటీ నీ చూపు. ఈవేళ ఆదివారం, నేను లేవను.'
`కాదు, నువ్వు లేవాల్సిందే. అది నీ బాధ్యత'
`ఎందుకులేవాలి. అసలు లేవమని అడిగే హక్కు నీకెక్కడిది? రాంగ్ సైడ్ ఓవర్ టేక్ చేసేవాడిలా ఏంటా చూపు? ఇంతకీ నువ్వెవరివి?'
`నేను ఓటర్ని..'
`అయితే, నన్నులేపే హక్కు నీకెక్కడిది...?'
`ఓటరుగా నిన్ను లేపే హక్కు నాకుంది. నిన్ను చైతన్యం చేయాలనే వచ్చాను. అసలు నేనెవరో కాదు, నీలోని ఓటర్ని....
`అదీ, అట్లా చెప్పు. గ్రేటర్ హైదరాబాద్ లో వేరేవాళ్లయితే, ఇలాంటి సాహసానికి దిగరు. నాలోనివాడివికాబట్టే నీకీ తెగువ. ఉండు, నీపనిబడతా...'
గ్రేటర్ మంచం దిగి ఓటరు పని పట్టాలని లేవబోయాడు. అంతలో ఆదివారం రెస్టావ్రతంలో ఉన్నానని తెలుసుకుని...
`ఊహూ, నేను రెస్ట్ల్ లో ఉన్నాను కనుక నువ్వు బతికిపోయావు. పో, నన్ను డిస్ట్రబ్ చేయకు.'
`నువ్వు పొమ్మంటే పోవడానికి నేను మామూలు మనిషినికాను. ఓటర్ని. నా బాధ్యతలు నేను చేసుకుంటూ పోతాను.'
`ఏంటీ నీ బాధ్యత?'
`నేచేత ఓటు వేయించాలి.'
`ఓహ్..గుర్తుకువచ్చింది. గ్రేటర్ ఎన్నికలుకదా...అయినా అది సోమవారం కదా..'
`పిచ్చినా గ్రేటరూ, ఆదివారం వెళ్లిపోయింది. తెల్లవారుజామైంది.. మరికాసేపట్లో తెల్లవారబోతున్నది. లే, లేచివెళ్ళి పవిత్రమైన ఓటువెయ్యి.'
`అబ్బో చాలా పెద్దమాటలే మాట్లాడుతున్నావ్. ఏ పార్టీవాళ్లైనా చేతులు తడిపారా ఏంటీ?'
`నేను ఎలాంటి ప్రలోభాలకు లొంగను. ఊరికే మాటలతో కాలక్షేపం చేయకు, ఓటు వేయడానికి సిద్ధంకా...'
`ఎందుకు ఓటు వేయడం?'
`అదేం పిచ్చి ప్రశ్న. నీ నగరాన్ని నువ్వు అభివృద్ధి చేసుకోవద్దూ...'
ఆ మాటలకు గ్రేటర్ పగలబడినవ్వాడు. మంచంమీద అటూఇటూ పొర్లుతూమరీ నవ్వాడు.
` పిచ్చినా ఓటరూ, ఆర్నెళ్లకిందట ఓటు వేశాం ఏం జరిగింది?
అవి జనరల్ ఎలెక్షన్స్.'
`పీకావులే లాజిక్. మాకా విషయం తెలియదా. ఆ ఎలెక్షన్సప్పుడు ఇచ్చిన హామీలే తీర్చలేదు. ఇప్పుడేమీ పీకుతారట.'
`ఇవి గ్రేటర్ ఎన్నికలు. గ్రైటర్ హైదరాబాద్ లో రోడ్లు వెడల్పు అవుతాయి.
ఛా...నిజమా!'
`మాన్ హోల్స్ కనిపించవు'
`ఛా..నిజమే!!'
`ఎక్కడబడితే అక్కడ ప్లైఓవర్లు...'
`ఎందుకూ, కూలడానికా...?'
`మెట్రో రైళ్లు...'
`ఎక్కడా, కాగితాలమీదనా...?'
`బోలెడన్నీ సిటీబస్సులు'
`ఎందుకూ, ట్రాఫిక్ లో ఉన్నవే ముందుకు కదలడంలేదు. కొత్తవెందుకూ!!'
`నగర వాసులందరికీ ఆరోగ్యం'
`ఎట్టా!! కాలుష్యం ఇట్లా ఉంటే ఆరోగ్యం ఎట్లా వస్తుందబ్బా?!'
గ్రేటర్లందరీ భద్రత
`ఎక్కడా, గోకుల్ ఛాట్ లోనా, లుంబినీ పార్క్ లోనా...పాతబస్తీలోనా, అబిడ్స్ సెంటర్లోనా?'
` నువ్వు అలా అనకూడదు. మనిషి ఆశావాది. గ్రేటర్ లో కొత్త పాలన వచ్చేస్తుంది. నువ్వు ఓటు వేస్తే మెరుగైన పాలన వస్తుంది. లే, లేచి ఓటువెయ్యి.'
` చాల్లే, చెప్పొచ్చావ్...అభాగ్యనగర వాసులకు అంత సీను లేదు. వేరే ఎక్కడికైనా వెళ్ళి ఓటు నీతులు చెప్పుకో...పో..'
`ఆ చెప్పడం మరిచాను, ఓటు వేయడానికి నీకు ఈరోజు సెలవు ఇచ్చారు. తెలుసా...'
`హాయ్... నిజమే, సమయానికి గుర్తుచేశావ్. ఇంకానయం మంచం దిగలేదు. ఆదివారం పక్కన సోమవారం కూడా సెలవా...భలే ఛాన్స్ లే..లలలా...లలలా లక్కీ ఛాన్స్ లే...'
`మరి నా ఓటు సంగతో...'
`రెండురోజులు సెలవు వస్తే ఏంటీ నీ నస. అసలే, చలిగా ఉంది. పొద్దున్నే గోలపెట్టకు. నువ్వు నాలోని వాడివేకదా...వచ్చేయ్...దుప్పట్లో దూరు..హాయిగా, వెచ్చగా పడుకుందాం. మనకెందుకు చెప్పు, ఈ ఓట్లూ, గీట్లు. ఎవరు వచ్చినా ఒరిగేదిలేదు. గ్రేటర్ హైదరాబాద్ వాసిగా నా కష్టాలు నాకు తప్పవు. సెలవు అయిందంటే హైదరా`బాధ'లే..రా, వచ్చేయ్..దుప్పట్లో దూరేయ్..'
అంతే, ఓటరు మారుమాటమాట్లాడకుండా గ్రేటర్ దుప్పట్లో దూరి ముసుగుతన్ని పడుకున్నాడు.
ఫలితం: హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో కేవలం 44.15 శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి.
- కణ్వస

Sunday, November 22, 2009

సెటైర్: బిల్ గేట్స్ ని దాటిన జగన్

ఇటీవల ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన ప్రపంచం లోని అత్యధిక ధనవంతుల జాబితా ను చూసి అమెరికన్ ప్రెసిడెంట్ ఒబామా కి ఒక డౌట్ వచ్చింది. అదేమిటంటే, కేవలం వైట్ మనీ తో వేసే లెక్క లు ఎంత వరుకు కరెక్టు అని!
వెంటనే ఒక ఆలోచన వచ్చింది. ఒక రహస్య సమావేశం ఏర్పాటుచేసి, ప్రపంచం లోని ధనవంతులదరిని పిలిచి, వారి బ్లాక్ మనీ వివరాలు కూడా తెలుసుకుని, ఆ తరువాత అసలు సిసలైన ప్రపంచ ధనవంతులెవరో తేల్చేసుకుందామని అనుకున్నాడు. ఆ వెంటనే, తన PA ని పిలిచి సమావేశానికి ఏర్పాట్లు చేసేయమన్నాడు. సమావేశ వివరాలు గోప్యంగా ఉంచుతామని అత్యంత గోప్యంగా హామీ ఇవ్వడంతో ప్రపంచం నలుమూలల నుంచీ ధనికులు తమ బ్లాక్ మనీ రహస్యాల చిట్టా విప్పడం మొదలుపెట్టారు. ముందుగా బిల్ గేట్స్ చాలా హుందాగా లేచాడు. టై సరిచేసుకున్నాడు. గొంతు విప్పాడు....
బిల్ గేట్స్: ఎస్, నేను మైక్రోసాఫ్ట్ కింగ్ ని నా సంపాదన ... ఫ్యూర్ వైట్... నాలుగువేల కోట్ల డాలర్లు. బ్లాక్ కూడా మరో నాలుగువేల కోట్లు ఉందనుకోండి...సో, వైటైనా, బ్లాక్ అయినా, నేనే అత్యంత ధనికుణ్ణి...ఎనీ డౌట్.
అనిల్ అంబానీ: నా వైట్ మనీ 1750 కోట్ల డాలర్లు. బ్లాక్ 8వేల కోట్ల డాలర్లు. టోటల్ గా సుమారు 10 వేల కోట్ల డాలర్లు. నేనే గ్రేట్. (సోదరుడు ముఖేష్ వైపు చూస్తూ ఎగతాళి నవ్వు నవ్వాడు)
ముఖేష్ అంబానీ: ఓరేయ్ అనిల్. నువ్వు పిల్లోడివేరా... వయసులోనూ, వైట్ లోనేకాదు, బ్లాక్ లోనూ నీకంటే ఎక్కువేరా... టోటల్ గా నా దగ్గర 15 వేల కోట్లు ఉందిరోయ్... నేనే నెంబర్ వన్.
ఇలా ఒక్కొక్కరూ లేచి తమ బ్లాక్ అండ్ వైట్ వివరాలు కలర్ పుల్ గా చెబుతుంటే అప్పుడు లేచాడు ఓ తెలుగోడు.
చంద్రబాబు: ఒక్కసారి నా లిస్టు చూస్తుంటే మీకే తెలుస్తుందీ, నేను ఎలా ముందుకు పోతున్నానో...నా వైట్, బ్లాక్ కలిపితే, 32వేల కోట్ల డాలర్లు. ఆ విధంగా తెలుగుజాతి ముందుకుపోతుంది. అందుకే మీకు చెబ్తున్నాను, హైదరాబాద్ ని నెంబర్ వన్ చేశాను, అదే మాదిరిగా, నేనూ నెంబర్ వన్ అయ్యాను.
ఇదే సమావేశానికి లేటుగా హాజరై చివరి వరసలో కూర్చున్న అల్లుఅరవింద్ తన బావ చిరంజీవితో అంటున్నాడు...
అల్లుఅరవింద్: చూశావా బావా...నేను ముందు నుంచి చెబ్తునే ఉన్నాను. సినిమాటికెట్లకంటే, పార్టీ టికెట్లు అమ్ముకుంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయని. పదేళ్లకిందటే నువ్వు పార్టీ పెట్టిఉంటే, మనమే నెంబర్ వన్ అయ్యేవాళ్లం బావా...
ఇంతలో జగన్ మైక్ పట్టుకుని మాట్లాడటం మొదలుపెట్టారు. అంతా పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయారు. జగన్ తనదైన శైలిలో తలఎడమ పక్కకి వొంచుతూ, చాలా అమాయంకంగా చెప్పుకుపోతున్నాడు....
జగన్: బ్లాక్ మనీ అయినా, వైట్ మనీ అయినా, అందరికీ ఆదర్శం మా నాన్నగారే. ఆయన బాటలో నడుస్తున్న నేను బ్లాక్ అండ్ వైట్ లో ఎంత కూడబెట్టానని మిస్టర్ ఒబామా అడుగుతున్నారు. అయితే నేను చెబ్తున్నాను, అన్నీ కలర్ పేజీలు వేస్తున్న సాక్షిలో ఉన్నదంతా బ్లాక్ మనీనే...ఇంకా చెబ్తున్నా, నా బ్లాక్ అండ్ వైట్ మొత్తం కలిపి సుమారుగా 1లక్షా 36వేల 760 కోట్ల డాలర్ల వరకు ఉండొచ్చు...ఇంకా..

అప్పటిదాకా సైలెంట్ గా ఉన్న ఒబామాకు కళ్లు బైర్లుకమ్మాయి. `ఔరా' అని ఇంగ్లీష్ లో అనుకుంటుండగానే తన పక్కనే కూర్చున్న బిల్ గేట్స్ అవుట్ పుట్ రాని ప్రోగ్రాం లాగా సడన్ గా దబీమని పడిపోయాడు. గిలగిలా కొట్టుకోవడం మొదలుపెట్టాడు. నీళ్లు చల్లి లేపాక ఒకటే మాట కలవరిస్తున్నాడు....
బిల్ గేట్స్: నేను ఇండియా పోతా...నేను ఇండియా పోతా....పోతా...పో...

- రాజేష్

Saturday, November 14, 2009

రోశయ్య నోట `చిరు'నామస్మరణ

గ్రేటర్ ఎన్నికల్లో ప్రజారాజ్యంతో పొత్తుల వ్యవహారం బెడిసికొట్టినా కాంగ్రెస్ లో ఆశలు చావలేదు. ఈసారి మీడియాకు చిక్కకుండా అత్యంత రహస్యంగా ప్రజారాజ్యం పార్టీని ఏకమొత్తంగా కాంగ్రెస్ లో విలీనం చేయడానికి బేరసారాలు జరుగుతూనే ఉన్నాయి. ఇదంతా బిహైండ్ ద కర్టెన్ వ్యవహారం కాగా, రోశయ్య మాస్టారు `చిరు'నామస్మరణకు దిగారు. బాలలదినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులతో రోశయ్య మాట్లాడుతూ ప్రస్తుత తరం నటుల్లో చిరంజీవి అంటే తనకు మక్కువ అంటూ ముచ్చటైన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏ ఉద్దేశంతో అన్నా, దానికి రాజకీయ రంగులు పులుముకున్నాయి. చిరంజీవి గొప్పనటుడంటూ రోశయ్య కితాబు ఇచ్చారు. చిరంజీవిని నెమ్మదిగా కాంగ్రెస్ ముగ్గులోకి దింపడంకోసమే రోశయ్య మాస్టారు ఇలా చిరునామస్మరణ చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

`గాలి' - కోడా ఇద్దరూ ఇద్దరే

ఓబుళాపురం గనుల్లో అక్రమాలున్నాయన్న ఆరోపణలు ఎదుర్కుంటున్న గాలిజనార్దనరెడ్డికీ, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడాకి కొన్ని సారూప్యతలు ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం...
సవాల్: తమపై మోపబడిన ఆరోపణలు నిజమని కోర్టులో నిర్ధారణ అయితే (కావని అన్నదే వారి దీమాలా కనబడుతోంది) రాజకీయాల నుంచి శాశ్వతంగా నిష్కమిస్తానంటూ ఇటు గాలి, అటు కోడా ఇద్దరూ సవాళ్లు విసిరారు.
ట్రంప్ కార్డ్ : ఇద్దరి చేతులో ట్రంప్ కార్డులున్నాయి. గాలి తన పేరులో రెడ్డి అన్న కులం పేరు ఉండటం వల్లనే చంద్రబాబు నాయుడు దాడిచేస్తున్నారనీ, ఒక వేళ తనపేరులో `రెడ్డి' అన్న పదం లేకుంటే పరిస్థితి మరోరకంగా ఉండేదని గాలి `కులం' కార్డు తీస్తే, మరో పక్క మధుకోడా `ట్రైబల్' కార్డు తీశారు. తాను గిరిజనుడైనందునే తనపై విరుచుకుపడుతున్నారని ఆరోపిస్తున్నారు.
ఎదిగినతీరు: వీరిద్దరూ ఇంచుమించూ ఒకేలా ఎదిగారు. ఎనిమిదేళ్ల కితం గాలిపేరుగానీ, అటు మధుకోడా పేరుగానీ ఎవ్వరికీ తెలియదు. మధుకోడా రోజువారీ కూలీ కుటుంబం నుంచి వేలాది కోట్లు సంపాదించుకునే స్థాయికి ఎదిగాడు. గాలి ఓ మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ అండదండలతో విశ్వరూపం చూపించారు. ఇద్దరూ ఇనుప ఖనిజం గనులను నమ్ముకునే (అమ్ముకునే) కోట్లకు పడగలెత్తారు. ఆ తరువాత రాజకీయలవైపు దృష్టిపెట్టారు. అటుపై ఏకంగా సీఎం సీట్లో కూర్చోవడం, లేదా కూలదోయడం వంటి చర్యలకు పాల్పడ్డారు.
మధుకోడా ఏకంగా ముఖ్యమంత్రి సీట్లో కూర్చోగా, గాలి కర్నాటక సీఎం సీటుని అతలాకుతలం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తన `సోదరుడు' (ఈమాట గాలి జనార్దనరెడ్డి తాజ్ బంజారా హోటల్ లో మీట్ ద ప్రెస్ లో చెప్పారు) ఎప్పటికైనా అవుతాడని బల్లగుద్ది మరీ గాలి చెప్పేశారు.

Sunday, November 8, 2009

సెటైర్: ఈ గాలీ,ఆ జగనూ, అంతలో అద్వానీ

`పవర్' పాలిటిక్స్ కి వరుసావావి ఉండదు. నీరు ఎటు పల్లం ఉంటే అటు ప్రవహిస్తున్నట్టూ, గాలి ఎటువీస్తే అటే `పవర్' కదులుతున్నట్టుగా ఉంది ప్రస్తుత రాజకీయ పయనం. ఈ పాలసీని ఆసరాగాతీసుకునే కర్నాటకలో గాలిసోదరులు ఓ ఆటఆడిస్తున్నారు. కర్నాటక సీఎం యడ్యూరప్ప, గాలి సోదరుల మధ్య రేగిన చిచ్చు చల్లార్చాలని బిజెపీ అధిష్ఠానం నడుం బిగించింది. సరిగా ఈ నేపథ్యంలో అద్వానీ, గాలి జనార్ధనరెడ్డి మధ్య ఫోన్ సంభాషణ ఇలా సాగింది...
అద్వానీ: హలో గాలి జనార్ధనేనా?
గాలి: ఎస్, గాలి స్పీకింగ్ హియర్..
అద్వానీ: (స్వగతం) అంతే, మనీపవర్ నెత్తికెక్కితే డైలాగ్స్ ఇలాగే ఉంటాయి,(పైకి) హలో గాలి, నేను అద్వానీని.
గాలి: ఏంటిసార్, తొందరగా చెప్పండి, అవతల శంషాబాద్ నోవాటెల్ లో నా ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్ళాలి.
అద్వానీ: ఉండవయ్యా, నీ అసాధ్యం కూలా...తొందరపడకు. అయినా బెంగళూరులో మంచి హోటల్స్ చాలానే ఉంటే, శంషాబాద్ హోటలెందుకట...
గాలి: అదాసార్, చంద్రబాబు గతంలో హైదరాబాద్ హోటల్ లో ఎమ్మెల్యేలను మూసేసి సీఎం సీటు దక్కించుకోలా. ఆ స్పూర్తితోనే హైదరాబాద్ ఎంచుకున్నా.
అద్వానీ: సర్లే, ఆ పాత వెన్నుపోట్ల మాటెత్తకు, నాకు వెన్నులో చలిపుట్టుకొస్తోంది. ఇంతకీ నీ డిమాండ్లేమిటి?
గాలి: పెద్దగా డిమాండ్లేమీలేవుసార్. నాకొన్నది ఒకటే డిమాండ్.
అద్వానీ: హాహ్హహ్హాఁ...ఒకటేనా, చెప్పేయ్, త్వరగా తీర్చేస్తా.
గాలి: జగన్ ని సీఎం చేయాలి.
అద్వానీ: జగనా, అతనెవరూ...నీ దగ్గరున్న 50 మంది ఎమ్మెల్యేల్లో ఒకడా..అయినా ఈ పేరు వినలేదే.
గాలి: అతను కర్నాటక ఎమ్మెల్యే కాదుసార్.
అద్వానీ: మరీ!
గాలి: ఆంద్రా ఎంపీ. వైఎస్సార్ కొడుకు జగన్
అద్వానీ: అదేంటయ్యా! కాంగ్రెస్ ఎంపీ అయిన జగన్ ని మనమెలా సీఎంని చేస్తామయ్యా?
గాలి: అవన్నీ నాకు తెలియవుసార్. జగన్ ని సీఎం చేయాల్సిందే.
అద్వానీ: అది కుదరదయ్యా, ఇంకేదైనా అడుగు
గాలి: నాకు ఇంకేమీ వద్దుసార్. మా జగనన్న సీఎం అవ్వాల్సిందే.
అద్వానీ: (స్వగతం) ఓర్నాయనో, ఆంధ్రా జాఢ్యం కర్నాటకకు పట్టుకున్నట్టుంది. ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్టుంది.
గాలి: ఏంసార్. మాట్లాడటంలేదు. ఒకేనా. చెప్పండి. అవతల టైం లేదు. ప్రభుత్వం కూల్చేయాలి. కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వాలి. జగన్ ని సీఎం చేయాలి.
అద్వానీ: ఓరినా గాలో...అంతపని చేయకయ్యా. సర్లే సీఎంని చేద్దాం.ఇంతకీ ఏ రాష్ట్రానికి సీఎంని చేయాలి. ఆంధ్రాకా, కర్నాటకకా
గాలి:అదీ...అదీ...సార్, ఒక్క నిమిషం లైన్ లో ఉంటారా...జగన్ ని అడిగి చెప్తా.
అద్వానీ: (స్వగతం) ఈ గాలి ఎప్పుడు ఎటువీస్తుందో అర్థంకావడంలేదు. కొంపదీసి గుజరాత్ కి సీఎంని చేయమని అడగడుకదా...
గాలి: సార్, తెలిసిందిసార్. మా జగనన్న ఆంధ్రకే సీఎం కావాలనుకుంటున్నాడు.
అద్వానీ: అమ్మయ్యా, నా టెన్షన్ తగ్గింది. మరైతే మధ్యలో నేనేం చేయాలయ్యా. నీ డిమాండ్ నాకర్థం కావడంలేదు.
గాలి: అవన్నీ నాకు తెలియదుసార్. జగన్ సీఎం అవ్వాలి. లేకుంటే నా 50 మంది ఎమ్మెల్యేలు...
అద్వానీ: ఆపవయ్యా, నీ రికార్డింగ్. ఆగిన రైల్లో చైన్ లాగేసే ఫేసూనువ్వూ...కాస్త ఆలోచించుకోనీ...ఆఁ, సర్లేవయ్యా, నేను సోనియాతో మాట్లాడతా...ఎలాగో ఒప్పిస్తా. జగన్ ని ఫ్యామిలీతో ఢిల్లీ వెళ్ళి సోనియాను కలవమను. సెంటిమెంట్ అక్కరకు వస్తుంది.
గాలి: అట్లాగే సార్, త్వరగా తేల్చండి... అవతల నోవాటెల్ వాడు నా గనులు పిండుతున్నాడు. ఇంకొన్నాళ్లయితే, నా ఆస్తిమొత్తం లాక్కుంటాడేమో...
- టి. రాజేష్

కొత్త శీర్షిక: న్యూ కామెంట్ ప్లీజ్

అభిమాన `భ్లాగులోళ్లు' (బ్లాగర్స్) చూపిస్తున్న ఆదరణకు `నారదలోకం' కృతజ్ఞాతాభివందనాలు. ఇప్పుడు మీకోసం కొత్త శీర్షిక `న్యూకామెంట్ ప్లీజ్' ప్రారంభిస్తున్నాం. రాజకీయ, సామాజిక అంశాలపై సరదాగా మేమిచ్చే ప్రశ్నకు మీరు వెనువెంటనే కామెంట్ చేయవచ్చు. మీ కామెంట్స్ సరదాగా ఉండాలిసుమా... పోస్ట్ అయిన కామెంట్స్ లో చురుకైన వాటిని ఎంపికచేస్తాం. మేము రెడీ, మరి మీరు రెడీనా...
ప్రశ్న: జగన్ ఏం సాధించాడు?
మా సమాధానం : `కొండ'ను తవ్వి సురేఖను పట్టాడు
మరో సమాధానం: ఢిల్లీవెళ్ళి ఫ్యామిలీ ఫోటో దిగాడు
ఇలా మీరు కూడా మీ న్యూకామెంట్స్ ని పంపించండి.
మీ కామెంట్స్ ని ఇ-మెయిల్ ద్వారా కూడా పంపవచ్చు.
kanvasas@gmail.com

Saturday, November 7, 2009

ఫ్యామిలీ చిత్రం: జగన్ సకుటుంబ ఢిల్లీ యాత్ర

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తనయుడు, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి శనివారం ఆకస్మికంగా ఢిల్లీకి వెళ్లారు. వెళుతూ వెళ్తూ తన వెంట తల్లి విజయలక్ష్మీ, భార్య భారతీ రెడ్డి, సోదరిణి షర్మిల కూడా వెంటబెట్టుకుని వెళ్ళారు. శనివారం ఉదయం ఆకస్మికంగా ఢిల్లీకి చేరుకోవడంలో మతలబు ఏమిటనే అంశం రాజకీయ వర్గాల మధ్య చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యంగా, సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి కె.రోశయ్య ఢిల్లీకి శుక్రవారం సాయంత్రం తొలిసారి వెళ్లారు. తొలిరోజున ఆయన రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీతో భేటీ అయ్యారు. తన పర్యటన రెండో రోజైన శనివారం ఉదయం ప్రధాని మన్మోహన్ సింగ్‌తో భేటీ అయ్యారు. సాయంత్రం పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశం కానున్నారు.
ఇంతలో జగన్మోహన్ రెడ్డి తన తల్లి, భార్య, సోదరితో ప్రత్యక్షం కావడం అందరినీ విస్మయానికి గురి చేసింది. అధిష్టానం నుంచి ఎలాంటి పిలుపు లేకుండానే ఆయన ఢిల్లీకి వెళ్లడం వెనుక మతలబు ఏమిటన్నదే అసలు ప్రశ్న.

Thursday, November 5, 2009

సచిన్ కి జేజేలు


మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ మరో సరికొత్త రికార్డును తన ఖాతాలో జమచేసుకున్నాడు. వన్డే క్రికెట్లో మరెవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన సచిన్, 17వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్ గా నిలిచాడు. ఆస్ట్రేలియా జట్టుతో గురువారం హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఐదవ వన్డేలో 7పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సచిన్ ఈ రికార్డును నమోదు చేసుకున్నాడు. సచిన్ రికార్డు కోసమే ఎదురు చూస్తున్న క్రీడాభిమానులు ఒక్కసారిగా ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు.
ది గ్రేట్ సచిన్ కి జేజేలు చెప్పండి....

`గ్రేటర్' కేసీఆర్ ఔట్

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమరం నుంచి టిఆర్ఎస్ తప్పుకుంది. గ్రేటర్ ఎన్నికల కంటే ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమమే తమ టార్గెట్ అని కేసీఆర్ తెల్చిచెప్పేశారు. `గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు మాకోలెక్కకాదు. ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం. పోటీ చేయం. తెలంగాణ ఉద్యమం జోరేమిటో చూపిస్తాం...' అంటూ ఫైనల్ గా డిసైడ్ అయిపోయారు. ఈనెల 6వ తేదీ శుక్రవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమ సంస్థల నేతలతో సమావేశాలు, సదస్సులు నిర్వహిస్తారట.
ఒకవైపు వీటిని నిర్వహిస్తూనే మరోవైపు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు వీలుగా కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళాలనుకుంటున్నారు. ఈనెలాఖరు నుంచి ఆమరణ నిరాహార దీక్షకు రెడీ అంటున్నారు.
తెలంగాణా ప్రజలు నా శవయాత్రలో పాల్గొంటారో లేక విజయయాత్రలో పాల్గొంటారో వారే తేల్చుకోవాలన్నారు. తనను ఆదుకున్నా.. వదిలేసినా అది తెలంగాణా ప్రజల చేతుల్లోనే ఉందని కేసీఆర్ తేల్చి చెప్పారు.
కొసమెరుపు: కేసీఆర్ మాటలు ఇలా ఉంటే, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొంతమంది నేతలు నామినేషన్లు దాఖలు చేసేశారు.

రోశయ్యకు సోనియా ఏం చెప్పబోతున్నారు?

రోశయ్య హస్తిన యాత్ర ఖరారైంది. ముఖ్యమంత్రి అయిన తరువాత రోశయ్య ఢిల్లీవెళ్ళి మేడం సోనియాను కలవబోవడం ఇదే మొదటిసారి. జగన్ సీఎం కావాలని కోరుకుంటూ కొంతకాలంగా ప్రయత్నాలు ముమ్మరంచేస్తూ కంట్లో నలుసుగా మారిన నేపథ్యంలో రోశయ్యకు ఢిల్లీ నుంచి పిలుపువచ్చింది. రాష్ట్రంలో వరద పరిస్థితులను సోనియాకు వివరించడానికే తాను ఢిల్లీ వెళుతున్నట్టుగా రోశయ్య చెబుతున్నా ఆమె ఏం చెప్పబోతున్నారో, రోశయ్య మాస్టారు ఆ తరువాత ఏం చేయబోతున్నారో ఈపాటికే అందరికీ అర్థమైంది. మేడం సోనియా సీఎం రోశయ్యతో ఇలా చెప్పేవచ్చు....
  • మీరు, కొందరనుకుంటున్నట్టుగా తాత్కాలిక ముఖ్యమంత్రికారు. మీరు హ్యాపీగా రూల్ చేసుకోండి.
  • జగన్ వర్గీయుల నుంచి ఇకపై మీకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా మేం చూసుకుంటాం.
  • వీలైనంత త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసుకోండి. నా నుంచి ఎప్పుడూ మీకు గ్రీన్ సిగ్నలే.
  • ఫ్యాక్షనిస్టు రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ లొంగదు. ఇప్పుడు మనకు కావాల్సింది ప్రజలకు సేవచేయగలిగినవారు, భాద్యతలను గుర్తెరిగిన యువత కావాలి.
  • ఎప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు. మేం చెప్పినట్టు మీరు నడుచుకోండి. గ్రేటర్ ఎన్నికల్లో తోకజాడించే నాయకుల పేర్లు పంపించండి.
  • దేశంలో ఇప్పటికే కాంగ్రెస్ బలోపేతమైంది. ఇలాంటి సమయంలో బలహీనపరిచే శక్తులను చూస్తూఊరుకోం. వాటిని ఎలా లొంగదీసుకోవాలో మాకు తెలుసు.
  • మీపని మీరు చేసుకోండి. మంచి సీఎంగా పేరుతెచ్చుకోండి. గుడ్ లక్....

Wednesday, November 4, 2009

ఎడిటర్స్ వాయిస్: `వందేమాతరం' పాడొద్దంటారా?


జాతీయగేయం `వందేమాతరం' పాడవద్దంటూ ముస్లీం మతాధికారుల అత్యున్నత సంస్థ `జమైత్ ఈ ఉలేమ హింద్' (జెఈయు) తీర్మానించింది. ఉత్తరప్రదేశ్ కు ఈశాన్యంగా, ఢిల్లీకి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవ్ బంద్ లో జెఈయు జాతీయ 30వ సర్వసభ్యసమావేశం నవంబర్ మూడున జరిగింది. ఈ సమావేశానికి దేశం నలుమూలల నుండి పదివేల మంది ముస్లీం మత పెద్దలు హాజరయ్యారు. గతంలో (2006లో) దారుల్ ఉలూమ్ ముస్లీంలు వందేమాతరం గేయాన్ని పాడకూడదంటూ జారీ చేసిన ఫత్వాను ఈ సమావేశం ఆమోదిస్తూ తీర్మానించింది. వందేమాతరం గేయంలోని కొన్ని పంక్తులు ఇస్లాం మతభావాలకు విరుద్ధమని సమావేశం ఏకగ్రీవంగా అభిప్రాయపడింది. వందేమాతరం విధిగా పాడాలని ఎవ్వరూ బలవంతం చేయకూడదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును వీరు ఉటంకించారు. వందేమాతరం అంటే తల్లికి నమస్సరించడమే అవుతుందనీ, తమ మతంలో తల్లికి నమస్కరించడమన్నది ఉండదనీ, తాము తల్లిని ప్రేమిస్తామేకానీ, ఆరాధించమని ఈ సంస్థ మతపెద్దలు తేల్చిచెప్పారు. ఏకేశ్వరోపాసనపట్ల తమకున్న విశ్వాసాన్ని చెల్లాచెదురు చేసేలా ఈ జాతీయగేయం ఉన్నదని వారంటున్నారు.
ఇదే సమావేశానికి కేంద్ర హోం మంత్రి చిదంబరం హాజరవడం మరో వివాదాస్పద అంశం. వందేమాతరంపై జెఈయూ తీర్మానాన్ని ఆమోదించిన కొద్దిగంటల్లోనే చిదంబరం అక్కడకు చేరుకుని ఇస్లాం మతాన్ని పరాయి మతంగా చూడలేమనీ, మన ముస్లీంలు గౌరవనీయులైన భారతీయ పౌరులని పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సమావేశాన్ని ఈటివీ (ఉర్దూ చానెల్) ప్రసార హక్కులు తీసుకోవడం మరో విశేషం.
125 సంవత్సరాల కిందట యావత్ జాతిని కదిలించిన వందేమాతరం గేయంలో ఇప్పుడు తప్పులు వెదకడం సమంజసమా? వందేమాతరం గేయంలోని `మాత' అంటే సొంత తల్లికాదు. మాతృభూమి (స్వదేశం) అని అర్థం. సొంతతల్లికి నమస్కరిస్తారా, లేక ప్రేమిస్తారా, కాక గౌరవిస్తారా అన్నది వారివారి మతాచారాల ప్రకారం ఉంటేఉండవచ్చు. కానీ దేశభక్తిని చాటుతూ, మాతృభూమికి నమస్కరించమంటూ సాగే చైతన్య గీతికపై ఇంతటి వివాదం రగిలించడంలో ఈ మతపెద్దల అసలు ఉద్దేశాలు ఏమిటి? `మాత' అన్న శబ్దంలోని విశేష అర్థాన్ని గ్రహించకుండా మొండిగా వాదిస్తూ, భారతదేశంలో ఉంటూ, అన్ని సౌకర్యాలు పొందుతున్న ముస్లీం సోదరులు జాతిఉద్దీపనా గేయాన్ని ఆలపించమంటూ తెగేసి చెప్పడం కుసంస్కారమే అవుతుంది.
జమైత్ ఈ ఉలేమా హింద్ భారీ ఎత్తున నిర్వహించిన జాతీయ స్థాయి సమావేశంలో వందేమాతరం వివాదం నిజానికి అతి ముఖ్యమైన అంశం కాదు. సామాజిక, ఆర్థికపరమై వివక్షకు గురవుతున్న ఇండియన్ ముస్లీంలు వాటికోసం పోరాడాలి. హక్కులసాధన కోసం నడుం బిగించాలి. అంతేకానీ, భారతదేశంలో ఉంటూ, ఆ దేశానికి చెందిన చైతన్య గీతికలను తప్పుపట్టడం, వాటిలో నానార్థాలు వెతకడం మంచిదికాదు. ముస్లీంలంతా భారతీయులమే అనుకునే పక్షంలో ఇలాంటి వివాదాలు తలెత్తవు. కానీ ఇప్పుడు జరుగుతున్నది అందుకు భిన్నమైనదే, నిస్సందేహంగా.
(ఈ వివాదంపై మీ అమూల్యమైన అభిప్రాయాలను పంపించండి.)
-ఎడిటర్

Tuesday, November 3, 2009

గిల్లి లెక్కచూసుకున్న డిఎస్ !

`గ్రేటర్' ఎన్నికల కోసం ప్రజారాజ్యంతో పొత్తు పెట్టుకుంటామంటూ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ చేసిన ప్రకటన చివరకు రసాభాస అయింది.పీఆర్పీతో పొత్తుపెట్టుకోవడాన్ని కాంగ్రెస్ లోని జగన్ వర్గం తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో అటు ప్రజారాజ్యం ఇటు కాంగ్రెస్ లోని రెండు వర్గాల్లోని చిన్నాచితకా నాయకులు మాటలతూటాలను విసురుకున్నారు. పన్నెండు ఛానెళ్లతో వెలిగిపోతున్న తెలుగు మీడియాకు మాత్రం కడుపారా తిట్లుదొరకడంతో ఆరోజుకి ముష్టాన్నం దొరికినంతగా సంబరపడిపోయింది. అయితే, ఈ మొత్తం వ్యవహారం చూశాక ఒక సందేహం కలగకమానదు.
అసలు డీఎస్ ఎందుకు గిల్లినట్టు? ఏమి ఆశించి ఈ రభసకు తెరదీశారు?
పైకి చూడటానికి డిఎస్ తెలివితక్కువగా గిల్లినట్టు కనిపించినా, లోలోపల మాత్రం మహత్తరమైన వ్యూహం ద్యోతకమవుతోంది. ఢిల్లీలో అధిష్ఠానం పెద్దల మధ్య కూర్చున్నప్పుడు డిఎస్ ఈ వ్యూహానికి బీజం వేశారు. జగన్ వర్గంలో ఎంత మంది ఉన్నారు? సీఎల్పీ సమావేశం పెడితే ఎంత మంది చీలిపోతారు? అన్న ప్రశ్నలకు సమాధానం రాబట్టాలంటే ఏదో ఒక ఎత్తుగడ వేయాల్సిందే. సీఎల్పీ సమావేశం పెట్టి రసాభాస అయ్యేదానికంటే, ముందుగానే బలాబలాలు తేలాలంటే ఓ సమస్యను లేవనెత్తాలి. అందుకే డిఎస్ పథకం ప్రకారం చిరంజీవిని ఒక పావుగా వాడుకోవాలనుకున్నారు. గతంలో వైఎస్సార్ సైతం ఇదే పావును కొంతమేర కదిలించారు. ఆ తరువాత రోశయ్య కూడా చిరంజీవికి ఆశ చూపించారు. ఈ నేపథ్యంలో చిరు తప్పకుండా తాము విసిరే వలలో పడిపోతారన్న ధీమాను డిఎస్ వ్యక్తం చేశారు. అందకే అధిష్ఠానాన్ని ఒప్పించి పొత్తు వ్యూహంకు తెరదీశారు.
అనుకున్నట్టే జరిగింది. పీఆర్పీతో పొత్తు అనగానే జగన్ వర్గీయులు మండిపడటం ప్రారంభించారు. రఘువీరా, దానం, సబిత, కోమటి వంటి వాళ్లు విరుచుకుపడ్డారు. కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా జగన్ కు వత్తాసు పలికారు. కొండా సురేఖ సంగతి చెప్పనక్కర్లేదు. ఆమె అప్పటికే రాజీనామాతో తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఆమె భర్త కొండా మురళి కూడా ధ్వజమెత్తారు.
ఈ సీన్లనన్నింటినీ డిఎస్ - రోశయ్య వర్గం నిశితంగా గమనిస్తూ, జగన్ పక్షాన ఉండే నాయకులు పేర్లను రాసుకోవడం ప్రారంభించింది. జగన్ వర్గీయుల జాబితా తయారుచేసుకునే పనిలో పడింది. ఇప్పుడున్నవేడి తగ్గితే ఈ జాబితాలోని పేర్లు తగ్గుతాయన్న నమ్మకాన్ని అధిష్ఠానానికి తెలియజేసింది. ఇక ఈ జాబితాను చూసుకుని అధిష్ఠానం, జగన్ ని బుజ్జగించాలో, బంధం తెంచుకోవాలో తేల్చుకుంటుంది. డిఎస్ పని ఇక్కడితో ముగిసింది.
జగన్ బాటలో ఎవరు వెళతారో, రోశయ్య పంచన ఎవరు ఉంటారో తేల్చుకోవడం కోసం డిఎస్ రచించిన ఈ పొత్తుల వ్యూహం ఫలించింది. పాపం, మధ్యలో చిరంజీవి రాజకీయంగా మరోమారు ప్లాప్ అయ్యారు.
-కణ్వస

Monday, November 2, 2009

ఫోకస్: `సైలెంట్' గానే కూలింది

వైఎస్సార్ ఎక్కిన హెలికాప్టర్ ఎవరి కుట్రతోనో కూలలేదు. వాస్తవం చెప్పాలంటే హెలికాప్టర్ చాలా సైలెంట్ గా కూలింది. ఆ క్షణాల్లో ఓ నిశ్శబ్దమృత్యుగీతక మాత్రమే వినిపించింది. కాక్ పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్) ని విశ్లేషిస్తే కొన్ని ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగుచూశాయి.
  • ప్రమాదం జరగడానికి ముందు హెలికాప్టర్ కూర్చుని ప్రయాణం చేస్తున్నవారెవరూ మాట్లాడుకోలేదు.
  • కనీసం పైలెట్లు కూడా ఎలాంటి ఆందోళన వ్యక్తం చేయలేదు.
  • నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ మాటలెక్కడా వినబడలేదు.
  • హెలికాప్టర్ దారితప్పిందన్న సంగతి కూడా పైలెట్లు పసిగట్టలేకపోయారు.
  • జోరున వర్షం, ఆపైన మబ్బులు దట్టంగా కమ్ముకోవడంతో వారికి ఎదురుగా ఉన్న కొండ కనిపించలేదు.
  • ఆ సమయంలో హెలికాప్టర్ 140 నాట్స్ (గంటకు 259 కిలోమీటర్ల వేగం)తో వెళుతున్నది. (ఒక నాట్ అంటే గంటకు 1.85 కిలోమీటర్ల వేగం)
  • ప్రమాదం వేళకి హెలికాప్టర్ హైదరాబాద్ కి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది.
  • హెలికాప్టర్ లో ఇంధనం బాగానే ఉంది. మరో రెండున్నర గంటలపాటు నిర్విరామంగా ఎగురగలదు.
  • ఉదయం 9గంటల 13 నిమిషాలకు హెలికాప్టర్ తో శంషాబాద్ రాడార్ సంబంధాలు తెగిపోయాయి.
  • మొత్తం ఘటనలో ఎవ్వరినీ నిందించాల్సిన పనేలేదని అర్థమవుతోంది. ఇందులో కుట్ర లేనేలేదన్న విషయం కూడా అవగతమవుతోంది.
-కణ్వస

Sunday, November 1, 2009

సెటైర్: `కొండ' గాలి సోకింది

కొండా సురేఖ పట్టుచీర కట్టుకని, నుదిటమీద పెద్దబొట్టుపెట్టుకుని వడివడిగా వీధిలో నడుచుకుంటూపోతున్నది. ఎడమపక్క ఓ ఇంటిపిట్టగోడమీద ఎన్.డి.తివారీ అన్న నేమ్ ప్లేట్ చూసింది. `యురేకా...దొరికింది...' అంటూ ఆనందోత్సాహంతో కేకలు పెడుతూ, ఆ ఇంట్లోకి దూసుకువెళ్ళింది.
ఇంటిలోపల హాల్ లో సైక్రియాట్రిస్ట్ ఎన్.డి.తివారీ తీరుబడిగా సోపాలో కూర్చుని ఆరోజు వచ్చిన పేపర్లను చూస్తున్నారు. ప్రాక్టీస్ చేసినన్నాళ్లుచేశాడు. ఎంతోమంది మానసిక రోగులకు నయం చేసి రికార్డు సృష్టించాడు. ప్రస్తుతానికి రిటైర్ మెంట్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు డాక్టర్ ఎన్.డి.తివారి.
అలా ఎంజాయ్ చేస్తున్న సమయంలోనే కొండా సురేఖ వడివడిగా లోపలకు వచ్చేసింది.అప్పుడు...
కొండాసురేఖ: నమస్కారమండి, తివారీగారు. మిమ్మల్ని చూడాలని చాలారోజులుగా అనుకుంటున్నాను.
ఎన్.డి.తివారీ: ఓహో అలా అనిపిస్తోందా... (తన దగ్గరకు వచ్చే పేషెంట్లలో చాలా మంది ముందుగా అనేమాట ఇదే కావడంతో తివారీకి అలవాటైపోయింది)
కొండాసురేఖ: నిజంసార్. ఆ రోశయ్యగారిని కలవాలని అనిపించలేదుసార్. నేరుగా మిమ్మల్నే కలవాలనుకున్నా సార్..
ఎన్.డి.తివారీ: ఓహో అలా కూడా అనిపించిందా...ఇంతకీ ఎవరా రోశయ్య? కొత్తగా ఫీల్డ్ లోకి వచ్చారా?
కొండాసురేఖ: కొత్తగానే వచ్చారు సార్. టెంపరరీ పోస్ట్ అని నేను చెబ్తున్నా వినకుండా పర్మినంట్ అయినట్టు ఫోజులిస్తున్నాడుసార్.
ఎన్.డి.తివారీ: ఓహో...నువ్వు అలా డిసైడ్ అయిపోయావన్నమాట.
కొండాసురేఖ: సార్, మీరు చాలా మంచివారు సార్...ఈ పూల బొకే తీసుకోండి...ఎందుకో మిమ్మల్ని కలవాలనుకోగానే పూలబొకే ఇవ్వాలనిపించి తెచ్చాను.
ఎన్.డి.తివారీ: ఓహో అలాకూడా అనిపించిందా...
కొండాసురేఖ: అంతేకాదు సార్. ఇదిగో ఈ లేఖ కూడా ఇవ్వాలనుకున్నా.
ఎన్.డి.తివారీ: (ఆశ్చర్యంగా) అదేమిటమ్మా, లేఖ అంటున్నావ్. మరి లావుపాటి పుస్తకం ఇస్తున్నావ్. ఇంతకీ ఇదేమన్నా నీ జీవిత చరిత్రా, లేక ఏదైనా పవిత్రగ్రంథమా.
కొండాసురేఖ: ఇది నా పవిత్ర రాజీనామా లేఖ.
ఎన్.డి.తివారీ: ఓహో...పుస్తకాన్ని చూస్తే లేఖలా అనిపిస్తుందా...
కొండాసురేఖ: ఇది పుస్తకం కాదుసార్. రాజీనామాలేఖే. కాకపోతే వెరైటీగా ఉంటుందని 600 పేజీలు రాశా.
ఎన్.డి.తివారీ: ఏంటీ! ఇలా కూడా అనిపిస్తుందా అమ్మా...
కొండాసురేఖ: (సిగ్గుపడుతూ) ఎంటో, అలాఅలా రాసుకుంటూపోతే, 600పేజీలైందిసార్. నేనే కాదుసార్. ఇలాగే నా వెనుక చాలా మంది రాజీనామాలు రాసేసి పట్టుకొస్తున్నారు.
ఎన్.డి.తివారీ: ఏంటీ! నువ్వేకాకుండా, ఇంకా చాలామంది ఈ లక్షణాలతోనే రీమ్ లురీమ్ లు రాజీనామాపత్రాలు రాసేస్తున్నారా తల్లీ.
కొండాసురేఖ: నిజంసార్. మీరు నమ్మడంలేదుకదూ...ఇదిగో నా వెనుక ఎవరున్నారో చూడండి.
ఎన్.డి.తివారీ: ఎవరున్నారమ్మా! ఎవరూలేరుగా...
కొండాసురేఖ: ఎందుకులేరుసార్. ఇదిగో ఈమె సబితారెడ్డి. నా అక్క. చూడక్కా, నువ్వు ఇక్కడే ఉంటే తివారీ సార్ జోకులేస్తున్నారు. ఇదిగో, బొత్సా అన్న, రఘువీరారెడ్డిసార్, దానం నాగేంద్రసార్..ఇంకా వస్తున్నారుసార్. మీకు కనబడటంలేదా...?
ఎన్.డి.తివారీ: ఓహో...ఇలా కూడా అనిపిస్తుందన్నమాట.
కొండాసురేఖ:
తొందరగా రాజీనామా పత్రంపై సంతకం పెట్టండిసార్. జగన్ కళ్లలో ఆనందం చూడాలి. ఈ లేఖను తీసుకెళ్ళి వైఎస్సార్ సమాధిమీద పెట్టాలి.
ఎన్.డి.తివారీ: ఓహో, అలా డిసైడైపోయావాతల్లీ.
అంతలో కొండా సురేఖ పీఏ పరుగుపరుగునవచ్చి, `మేడం, మీరు రాంగ్ అడ్రస్ కివచ్చారు. ఈయన మీరనుకున్న ఎన్.డి. తివారీకారు. సైక్రియాట్రిస్ట్ తివారి. పదండి రైట్ అడ్రస్ కి వెళ్దాం.
ఎన్.డి.తివారీ: ఇది నీకు రాంగ్ అడ్రస్ కావచ్చు. కానీ నాకు మాత్రం ఈమె రైట్ పేషెంటే అనిపిస్తోంది...
కొండాసురేఖ: ఓహో, మీకు అలా అనిపిస్తోందా!
ఎన్.డి.తివారీ: కన్ఫర్మ్ గా...ముందు నా ఫీజిచ్చివెళ్ళండి.
-కణ్వస

చిరుతో జగన్ కి `చెక్' !

ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పంచన చేరడంతో ఇప్పటివరకు సీఎం కుర్చీపై ఆశలు పెట్టుకున్న జగన్ షాక్ అవ్వాల్సి వచ్చింది. గ్రేటర్ ఎన్నికలను అడ్డుగా పెట్టుకుని కాంగ్రెస్ అధిష్ఠానం జగన్ ని ఎదుర్కునే రాజకీయశక్తిని సమకూర్చునే పనిలో పడింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
  • వైఎస్సార్ ఉన్నంతకాలం రాష్ట్రం కాంగ్రెస్ కు ఛరిస్మా ఉన్న నేత లోటులేకుండాపోయింది. అంతా తనొక్కడే అన్నట్టుగా వైఎస్సార్ చక్రం తిప్పారు.
  • వైఎస్సార్ దుర్మరణంతో అనూహ్యమైన రీతిలో పార్టీలో గ్లామర్ పడిపోయింది. ఉన్న నాయకుల్లో సామర్థ్యం ఉన్నవారిలో జనాకర్షక శక్తిలేకపోవడమో, లేదా జనాకర్షక శక్తి ఉన్న నేతల్లో పాలనాసామర్థ్యం లేకపోవడమో ఆ పార్టీని వేధించింది.
  • వైఎస్సార్ తనయుడు జగన్ మోహన్ రెడ్డికి నిస్సందేహంగా జనాకర్షణ ఉంది. అయితే, దుందుడుకు చర్యలతో ఆయన అధిష్ఠానానికి దూరమవుతున్నారు.సీఎం పదవి దక్కించుకోవడం కోసం పంతం పట్టడం పార్టీ అధిష్ఠానానికి నచ్చడంలేదు. అయితే ఆయనకున్న జనాకర్షక శక్తిని శంకించడంలేదు. ఫ్యాక్షనిస్టు ముద్రఉన్న నేతను ప్రోత్సహించి కొరివితో తలగోక్కోవడంకంటే, మరో యువనేతను ప్రోత్సహించడం మంచిదన్న ఆలోచన కాంగ్రెస్ శిబిరాల్లో వినబడుతోంది. వృద్ధనేతలు కూడా ఇందుకు అమోదముద్రవేశారు. తాము వెనుకఉండి నడిపిస్తామనీ, ముందుకు దూసుకుపోగల శక్తివంతుడు కావాలని ఇప్పటికే పలువురు సీనియర్లు చెప్పారు.
  • ఈ నేపథ్యంలో ప్రజారాజ్యం అధినేత చిరంజీవి కాంగ్రెస్ దృష్టిలో పడ్డారు. ముందుగా గ్రేటర్ ఎన్నికల్లో పొత్తుగానైనా మెగాస్టార్ ని దగ్గరకుతీసి ఆ తరువాత తమపార్టీలో ప్రజారాజ్యాన్ని విలీనం చేసుకోవాలన్నదే కాంగ్రెస్ ఎత్తుగడ.
  • ఇదే జరిగితే, జగన్ ని ఎదుర్కోగల ఆకర్షణఉన్న నాయకుడు కాంగ్రెస్ జేబులో ఉంటాడు. అందుకే ముఖ్యమంత్రి రోశయ్య తిరుపతిలో చిరంజీవితో సాగించిన రహస్య సమాలోచనప్పుడు ఓగట్టి హామీని ఇచ్చినట్టు తెలిసింది.గ్రేటర్ ఎన్నికలు కాగానే రోశయ్య తన వ్యూహాన్ని అమలుచేయవచ్చు.
  • గ్రేటర్ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయానికి చిరంజీవి సహకరిస్తే, అందుకు ప్రతిఫలంగా చిరుకు రోశయ్య మంత్రివర్గంలో స్థానం దక్కవచ్చు. హోంమంత్రిగా చిరంజీవిని తీసుకునే అవకాశాలు లేకపోలేదు.
  • మంత్రి పదవి ఆశతోనే చిరంజీవి కాంగ్రెస్ కు దగ్గరవుతున్నారు. పనిలోపనిగా చిరంజీవి రూపంలో వచ్చిన సదావకాశాన్ని కాంగ్రెస్ నేర్పుగా ఉపయోగించుకుని జగన్ రాజకీయ భవితకు దెబ్బకొట్టవచ్చు.
  • జగన్ ని కూడా `గ్రేటర్' ప్రచారంలో ఉపయోగించుకోవాలని కూడా కాంగ్రెస్ యోచిస్తోంది. అయితే ఒక వొరలో రెండు కత్తులు ఇమడవుకనుక జగన్ దీనికి దూరంగా ఉండవచ్చు.
  • మొత్తానికి భవిష్యత్తులో జగన్ ప్రాభవాన్ని అడ్డుకునే శక్తిగా చిరంజీవిని ఉపయోగించుకోవాలన్నదే కాంగ్రెస్ ఎత్తుగడలా కనబడుతోంది. అదే సమయంలో మీడియానుంచి పాలిటిక్స్ లోకి వద్దామనుకుంటున్న రవిప్రకాష్ వంటి యువనేతలను కూడా కాంగ్రెస్ ఇదే తరహాలో వాడుకోవచ్చు.
- కణ్వస

ఫోకస్: పీఆర్పీ కాంగ్రెస్ పాలె`కాపు'

మెగాస్టార్ చిరంజీవి ఏ లక్ష్యంతో ప్రజారాజ్యాన్ని స్థాపించారో, ఆ లక్ష్యాన్ని తుంగలోకితొక్కి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసం కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకోవడంతో ఇంతకాలంగా వేసుకున్న ముసుగు తొలిగిపోయినట్టైంది. అసలు ప్రజారాజ్యం పార్టీ పెట్టిందే అధికార కాంగ్రెస్ అవినీతిని ఎండగట్టడానికి. ఈ సంగతి ముందుగానే పసిగట్టడం వల్లనే అసలు ఈ పార్టీనే మొగ్గతొడగకుండా చేయాలని అప్పట్లో కాంగ్రెస్ నేతలు శతవిధాలా ప్రయత్నించారు. దాసరి నారాయణరావు వంటి సీనియర్లను రంగంలోకి దింపి చిరంజీవికి అనేక విఘ్నాలు సృష్టించారు. చివరకు చిరంజీవి పర్సనల్ లైఫ్ లో లొసుగులు బయటకులాగే ప్రయత్నాలు జరిగాయి. చిరంజీవి రెండవ కుమార్తె శ్రీజ వివాహం అనంతరం నూతన దంపతులకు అండగా ఉండేవిషయంలో కూడా కాంగ్రెస్ పరోక్షంగా జోక్యం చేసుకున్నట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. చిరంజీవికి అడుగడుగునా మనస్తాపం కలిగించడానికి కాంగ్రెస్ నేతలు చేయని ప్రయత్నంలేదు. అయినా చిరంజీవి ఒక శుభముహర్తాన ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. మార్పుకోసమే తాను ఈ పార్టీ పెట్టినట్టు చెప్పుకున్నారు. అవినీతి కాంగ్రెస్ పాలనను అంతం చేస్తామంటూ భీషణఘోషణ శపథాలు చేశారు. బలుపోవాపో నిర్ధారించుకోలేక సార్వత్రిక ఎన్నికల్లో అన్ని సీట్లలో తన అభ్యర్థులను నిలబెట్టారు. మహాకూటమిలో చేరమంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు రాయ`బేరాలు' సాగించినా కాదుపొమ్మన్నారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచీ ప్రజారాజ్యం నేలమీద నడవటం మొదలుపెట్టింది. సరిగా ఇదే సమయంలో రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్సార్ ప్రజారాజ్యాన్ని దగ్గరతీయడానికి ప్రయత్నించారు. తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన చిరంజీవి కూడా వైఎస్సార్ వైఖరిపట్ల ఆశ్చర్యచికుతులై కాంగ్రెస్ ని పొగడ్తలతో ముంచెత్తారు. వైఎస్సార్ దుర్మరణంతో ప్రజారాజ్యం అధికార కాంగ్రెస్ కి మరింత చేరువైంది. తిరుపతిలో ముఖ్యమంత్రి రోశయ్య, చిరంజీవి గంటన్నరసేపు రహస్య సమాలోచనలు జరిపినప్పుడే మెగాస్టార్ పొలిటికల్ మెగావ్యూహం అర్థమైంది. ఒక దశలో జగన్ వర్గీయులకు అండగా ఉండాలని కూడా అల్లుఅరవింద్ వ్యూహం రచించారు. అయితే అధిష్ఠానం జగన్ ని దూరంగా ఉంచడంతో సీను అర్థం చేసుకున్న ప్రజారాజ్యం ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ కు లొంగిపోయింది. పార్టీ పెట్టినప్పుడు ఏ లక్ష్యాలను ఎంచుకుందో, వాటినన్నింటినీ తుంగలోకి తొక్కేసిన చిరంజీవి ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీకి సిద్ధమయ్యారు.
ఈ మొత్తం వ్యవహారంతో ఒక్క విషయం బాగా అర్థమైంది, అదేమంటే, చిరంజీవికి పాలి`ట్రిక్స్' బాగానే ఒంటబట్టాయి. ఇక ఫర్వాలేదు. ఎలాగో సిద్ధాంతాలులేని పార్టీగానే ముద్రపడింది కనుక ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పంచన పాలె`కాపు'గా ఉంచడమే మంచిది.
- కణ్వస

Saturday, October 31, 2009

ఎడిటర్స్ వాయిస్: తెలుగుతల్లి కంటనీరు

తెలుగుతల్లి ఆంధ్రావారికే సొంతమనీ, తెలంగాణవారికి వేరే తల్లి ఉన్నదన్న వాదన ఈమధ్య బలపడుతోంది. కడప జిల్లాలోని సెయింట్ జోసెఫ్ స్కూల్ లో పిల్లలు తెలుగుమాట్లాడకూడదంటూ ఆంక్షలు విధించడంతో రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్య తీసుకుంటూ అన్ని పాఠశాలల్లోనూ `మా తెలుగుతల్లికి మల్లెపూదండ' గేయాన్ని విద్యార్థులచేత పాడించాలంటూ ఆదేశాలిచ్చింది. మాతృభాష అడుగంటిపోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉన్నట్టుండి మరో వివాదానికి తెరలేపింది. తెలంగాణ ప్రాంత విద్యార్థులు `మా తెలుగు తల్లికి మల్లెపూదండ' పాట పాడాల్సిన అవసరం లేదని కొందరు తెలంగాణ కవులు, మేథావులు పాయింట్ లేవనెత్తారు. తెలంగాణ పాటలు పాడే దేశ్పతి శ్రీనివాస్ మరో అడుగుముందేకిసి `మీ తెలుగుతల్లి మల్లెపూదండలు వేసుకుంటే వేసుకోమనండీ, మా తెలంగాణ తల్లి మాత్రం బంతిపూదండలు వేసుకుంటుంది...ఆ పాటలో తెలంగాణ వారి పట్ల అన్యాయం ధ్వనిస్తోంది. గలగలా గోదావరి కదిలిపోతుంటేను...అని పాడుతున్నారు. అంటే ఈ గోదావరి మా తెలంగాణ గడ్డమీద నుంచి కదలిపోతుంటే మేము చూస్తుండిపోవాలా...ఇక, బిలబలా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, అని పాడుతున్నారు, అంటే, కృష్ణమ్మ కూడా పరుగులెత్తుకుంటూ ఆంధ్రవాళ్లవైపు వెళుతుంటే ఇక మాకేం మిగిలుతుంది...కష్టాలు, కన్నీళ్ళా?...ఇలాంటి పాటలు మాకొద్దు. మా పిల్లలచేత ఇలాంటి పాటలు పాడించం. ఈ తెలుగుతల్లి మాకొద్దూ...మా తెలంగాణతల్లి పాటలే మా పిల్లలు పాడుకుంటారు. ఆ తల్లికే బంతిపూల దండలు వేస్తుంటారు' అంటూ ఎంతో భావోద్వేగంతో అన్నారు.
ఆయనలాజిక్ అయినది. అయితే, ఓ చిన్న వాస్తవాన్ని మరిచిపోతున్నట్టున్నారు ఈ మేథావులంతా. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ...ఏ ప్రాంతంలోని వారైనా మాట్లాడేది తెలుగే అయినప్పుడు, వారి మాతృభాష తెలుగు అయినప్పుడు తెలుగుతల్లిని అగౌరవపరచడంలో అర్థంలేదు. మరో విషయమేమంటే, తెలుగుతల్లిని తెలంగాణ తల్లితో పోల్చకూడదు. తెలుగుతల్లి భాషకు ప్రతీక. తెలంగాణ తల్లి ప్రాంతానికి ప్రతీక. అలాంటప్పుడు ఈ రెంటినీ కలిపేసి విబేధాలు సృష్టించి లేతమనసుల్లో విషం ఎక్కించడం మంచిదేనా?
అవాంఛనీయమైన ఇలాంటి వ్యాఖ్యలవల్ల తెలుగుతల్లి కంటనీరు పెడుతున్నది. ఇది అత్యంత శోచనీయం. ఈ సమస్యను మొగ్గగా ఉన్నప్పుడే త్రుంచివేయడం మంచిది.
మీ అమూల్యమైన అభిప్రాయాలను నారదలోకం ఆహ్వానిస్తోంది. చర్చలో పాల్గొనండి. సమస్య పరిష్కారానికి ఓ చక్కటి సలహా ఇవ్వండి.
(ఈ వ్యాసానికి సూచనలు ఇస్తున్న పాఠక మిత్రులకు ధన్యవాదాలు)
- ఎడిటర్

Friday, October 30, 2009

పాపం కొండా సురేఖ (పార్ట్ 1)

బంగారంలాంటి మంత్రి పదవిని తన ప్రియతమ దివంగతనేత వైఎస్సార్ మీద పెంచుకున్న అభిమానాన్ని లోకానికి చాటడంకోసం త్యాగం చేసిన ఘనత కొండా సురేఖదే. తన అభిమాననేత వైఎస్సార్ కుమారుడు జగన్ కు సీఎం పదవి ఇవ్వకుంటే తాను మంత్రిపదవికి రాజీనామా చేస్తానని ఇంతకుముందే పలుమార్లు బాహాటంగానే చెప్పన కొండా సురేఖ, ఇప్పుడు అన్నంతపనీ చేశారు. సత్యవాక్ పరిపాలన పట్ల గౌరవం ఉన్నవారంతా ఈచర్యను తప్పకుండా హర్షించాల్సిందే. కుళ్లిపోయిన రాజకీయకాసారంలో మాటమీద నిలబడేవాళ్లెవరుంటారు చెప్పండి ఒక్క కొండా సురేఖ తప్ప. అందుకే రాష్ట్ర రాజకీయాల్లో కొండాసురేఖ పేరు త్యాగానికి మారుపేరుగా నిలిచిపోతుంది.
ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ మీడియా అభాండాలు వేయడం మానడంలేదే. కొండంత పదవిని మన కొండా దూదిపింజలా తీసిపారేసినా `కరడుగట్టిన' ఈ మీడియాకు కనికరం కరగలేదు. రెండు పత్రికలూ, కొన్ని టీవీ ఛానెళ్లు పనిగట్టుకుని, కులప్రాతిపదికన తనపై బురదచల్లారన్నదే సురేఖ ఉవాచ. ఇప్పుడు రాజీనామా చేసినా ఈ`కరడుగట్టిన మీడియా' మనసు మారలేదు. జగన్ కి చెప్పకుండా, పెద్దాయన కేవీపీ సూచన తీసుకోకుండా, ఆమాట కొస్తే ఇంటాయనకీ, పిల్లలకు కూడా చెప్పకుండా తాను నేరుగా, సూటిగా గవర్నర్ ని కలిసి ఆరుపేజీల రాజీనామా పత్రాన్ని సమర్పిస్తే, అనితరసాధ్యంగా ఇంతటి త్యాగానికి సిద్ధపడితే- ఛీ...ఈ పాడు మీడియా మళ్ళీ కేజీలకొద్దీ బురద తీసుకొచ్చి తనపై చల్లుతుందా...ఇదేమన్నా బాగుందా..అంటూ పాపం కొండా సురేఖ కుమిలిపోవాల్సి వస్తున్నది.
కొండా సురేఖ సత్యాన్ని నమ్ముకుంది. అందుకే మాటలు మార్చకుండా అన్నమాటమీదనే నిలబడి రాజీనామా చేసింది. అయితే అంతమాత్రాన ఆమె పదవీత్యాగం వెనుక ఉన్న నిజాలు సమాధికావు. ఫ్యాక్షనిస్టు రాజకీయాలు చాపకిందనీరులా ఎలా పాకుతుంటాయో చెప్పడానికి కొండా సురేఖ రాజీనామా ఉదంతం ఓ దష్ఠాంతం మాత్రమే. సురేఖ రాజీనామా వ్యవహారాన్ని అంత తేలిగ్గా తీసిపారేయకూడదు. ఈ వ్యవహారంపై రెండు వాదనలు వినవస్తున్నాయి.
1. అమాయకపు కోణం: దివంగత నేత వైఎస్సార్ పట్ల పెంచుకున్న విపరీతమైన అభిమానంతో మంత్రి పదవికి రాజీనామా చేయడం కేవలం భావోద్వేగపూరిత చర్య.
2. ఫ్యాక్షనిస్టు రాజకీయ కోణం: తేనెపూసిన కత్తి... చాపకిందనీరు...తడిగుడ్డతో గొంతులు కోయడం...వంటి పదాలు మీరు వినే ఉంటారు. అలాంటిదే ఫ్యాక్షనిస్టు రాజకీయం కూడా. కొండా సురేఖ ఇంతగా భావోద్వేగానికి గురికావడం వెనుక ఫ్యాక్షనిస్టు కుట్ర ఉన్నదన్నది రెండో వాదన.
అయితే, పైన చెప్పిన రెండు విడివిడి వాదనలు ఒక పాయింట్ దగ్గర మిళితమవడం మరో ఆశ్చర్యకరమైన పరిణామం. పైకి చూడటానికి ఈ రెండూ విడివిడి వాదనలుగా కనిపిస్తున్నా ఒకచోట మమేకం అవడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
( ఆవివరాలు తరువాయి భాగంలో)
- కణ్వస

Wednesday, October 28, 2009

అమ్మమాట


చిన్నారులను చదువుకోవద్దనే
తాలిబన్లకన్నా,
పాఠశాలల్ని నిలువునా పేల్చేసే
నక్సలైట్లకన్నా,
స్కూల్ లో తెలుగుమాట్లాడవద్దనే

`సెయింట్‌ జోసఫ్‌లే'
యమడేంజర్రా కన్నా

- శ్రీదేవి

కర్నాటకలో `జగన్నాటకం'

కర్నాటకలో యడ్యూరప్ప నాయకత్వంలోని బిజెపీ ప్రభుత్వం ఎదుర్కుంటున్న రాజకీయ సంక్షోభం వెనుక వైఎస్ జగన్మోహనరెడ్డి హస్తం ఉన్నదని చెబితే చాలామంది నమ్మకపోవచ్చు. కానీ, ఇది నమ్మలేని నిజం. `నారదలోకం' సేకరించిన సమాచారం ప్రకారం ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
  • ముఖ్యమంత్రి యడ్యూరప్పపై ఆ రాష్ట్ర రెవెన్యూ మంత్రి గాలి కరుణాకరరెడ్డి, పర్యాటక శాఖ మంత్రి గాలి జనార్ధనరెడ్డి తిరుగుబాటుబావుటా ఎగురవేశారు.
  • తమ వ్యాపారాలకు (ప్రధానంగా గనుల వ్యాపారానికి) ముఖ్యమంత్రి యడ్యూరప్ప అడ్డుతగులుతుండటంతో గాలిసోదరలు మండిపడుతున్నారు.
  • గనుల నుంచి తరలించే ఇనుప ఖనిజం రవాణా విషయంలో యడ్యూరప్ప ఆంక్షలు పెట్టడంతో గాలిసోదరలకు కాలింది.
  • ట్రక్కులపై రహదారి అభివృద్ధి సుంకం విధించడం వీరికి నచ్చలేదు. దీంతో కోట్లకు పడగలెత్తిన గాలిసోదరులు తిరుగుబాటుబావుటా ఎగురవేశారు.
  • సరిగా, అదే సమయంలో `జగ'న్నాటకం మొదలైంది. ఆంధ్రప్రదేశ్ లో సీఎం పదవి కోసం జగన్ ఎంతగా ప్రయత్నించినా అధిష్ఠానం మాటవినలేదు. దీంతో జగన్, అతని వ్యాపార మిత్రులు గాలి సోదరులు కొత్త వ్యూహం రచించారు.
  • ఈ వ్యూహం ప్రకారం, కర్నాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన తీసుకువస్తే అధిష్ఠానం సంతృష్టి చెందుతుంది. కర్నాటకను కానుకగా ఇచ్చినందుకు ప్రతిఫలంగా జగన్ ని ఆంధ్రప్రదేశ్ సీఎం చేయమని గాలిసోదరులు అధిష్ఠానాన్ని అడిగే అవకాశం వస్తుంది.
  • ముఖ్యమంత్రిని మార్చాలన్న మొదటి వ్యూహాన్ని వెనక్కి తీసుకుని, కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావన్న సరికొత్తవ్యూహం తెరపైకి వచ్చింది.
  • ఇప్పటికే 40 మంది ఎమ్మెల్యేలను తమ గుప్పెట్లో పెట్టుకున్న గాలిసోదరులు ఏకంగా బిజెపీ ప్రభుత్వాన్నే పడగొట్టి గత ఎన్నికల్లో 80 సీట్లు తెచ్చుకున్న కాంగ్రస్ కి సపోర్ట్ ఇచ్చేయాలనుకుంటున్నారు. తద్వారా తమ ప్రియతమ మిత్రుడు జగన్ ఏకైక కోరిక తీర్చాలని కంకణం కట్టుకున్నారు.

Tuesday, October 27, 2009

లుచ్ఛా, లఫంగా...ఇది మాభాష


''లుచ్ఛా..., లఫంగా..., బద్మాష్‌... బేకారుగాళ్ళనేది మా తెలంగాణ సొంత భాష. పనికిరానోళ్ళను, గలత్‌ పని సేసేటోళ్ళను, తప్పులు జేసేటోళ్ళను, ఉల్టాఫల్టాగాళ్ళను, ఇట్లాంటోళ్ళను ఇట్లనే అంటం... నా గల్లిdలో, నా తెలంగాణలో ఇదే యాసతో మాట్లాడుతం... అర్థం తెలియకపోతే మీ ఖర్మ... తెలుసుకుని మాట్లాడుండి'' ఇదీ,తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు ప్రెస్ మీట్ లో భాషా శాస్త్రాలపై చేసిన సవాల్‌.
''నేను డబ్బుల కోసం ఉద్యమాన్ని చేస్తున్నానని కొందరు సన్నాసులు అంటుంరు, ఈ సంగతిని రుజువుచేస్తే నేను ముక్కు నేలకు రాస్తానని, నాపై సవాల్‌ విసిరే వారికి సిగ్గు, లజ్జ, దమ్ముంటే వైఎస్‌ హయాంలో ఆక్రమణకు గురైన భూములను దున్నుందాం, నార్నే సంస్థ చెర్లపల్లి, గంగాపురం, ఈస్ట్‌సిటీ, కమ్మెటి వంటి గ్రామాల్లో ఆక్రమణకు గురైన భూములను దున్నుదాం, 4లక్షల కోట్ల విలువైన ఆర్యసమాజ్‌, గోకుల్‌ ట్రస్టు భూముల్లో కొంత భాగంలో వైఎస్‌ వివేకానందరెడ్డి పెద్ద భవంతినే నిర్మించాడని, దమ్ముంటే దాన్ని కూడా కూల్చుదాం రండి''- ఇది కేసీఆర్ విసిరిన మరో ఛాలెంజ్.
''`మా భాషను తప్పుబడతున్నారు, దీనిపై మాట్లాడేందుకు శతావధానులను, అష్ఠావధానులను పిలిపించండి, చర్చకు సిద్ధమే''
మా నుడికారం, పడికట్టును విమర్శిస్తారా, తుర్క భాష కలిసిందంటారా, ఇదంతా సమస్యను పక్కదోవ పట్టించేందుకేగా....మా భాష వాడిగా వేడిగా ఉంటుంది, పరుషంగా ఉంటుంది. ఇది మా యుద్ధంలో భాగం-'
ఇది సినిమా కాదు, రాసి మాట్లాడేది కాదు, ఆవేశం, అర్తనాదాల నుంచి వెలువడుతున్న తొలి కేక
కేసీఆర్ తెలుగు భాషపైనా, మాండలికంపైనా చేస్తున్న వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా?
...మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి.

Monday, October 26, 2009

జగన్ కి పీసీసి పదవి అప్పగించిన టివీ9 !

ఉన్నట్టుండి టివీ9 సీఈఓ రవిప్రకాష్ బుర్రలో మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఫ్లాష్ వెలిగిందే తడువుగా స్కోల్స్ లో బ్రేకింగ్ న్యూస్ ఇచ్చేయమంటూ ఆదేశించారు. ఇంతకీ ఆ బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే,
జగన్ కి పీసీసి పదవి... డిఎస్ కి ఉద్వాసన
ఆసక్తికరమైన న్యూస్ కావడంతో అంతా ఆసక్తిగా గమనించారు. మరికాసేపట్లో ఈ వార్తపై సమగ్ర కథనాన్ని కూడా టివీ9 ఇచ్చింది. ఆ కథనంలోని సారాంశమేమంటే, ఢిల్లీలో షకీల్ అహ్మద్ అనే కాంగ్రెస్ పెద్దాయన సదరు ఛానెల్ వారికి స్వయంగా చెప్పారట. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షపదవి నుంచి డి.శ్రీనివాస్ ని తొలగించి, ఆ స్థానాన్ని జగన్ తో భర్తీ చేస్తారట. షకీల్ అహ్మద్ స్వయంగా చెప్పారని అంటే అంతా నమ్మేస్తారన్నది ఆ టివీ ఛానెల్ వారి ప్రగాఢ నమ్మకం. అయితే, అంత`లావుపాటి' వార్త నిమిషాల్లో దూదిపింజలా వీగిపోయింది. అది నిజంకాదని తేలిపోయింది. ఈ వార్త కేవలం టివీ9 బుర్రలో పుట్టినదేనని అందరికీ తెలిసిపోయింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ వీరప్ప మొయిలీ కూడా ఇదంతా మీడియా సృష్టేనంటూ తేల్చిచెప్పడంతో టివీ9 గతుక్కుమంది. ఎలా సర్దిచెప్పుకోవాలో తెలియక తికమకపడింది.
అసలు జగన్ కి పీసీసి పదవి అప్పగించాలన్న ఆలోచన టివీ9కి ఎందుకు వచ్చింది? అందుకు రెండు కారణాలు చెప్పుకోవచ్చు. అవి...
1. ఈమధ్య మీడియా మధ్య పోటీ పెరిగిపోవడంతో టివీ9 కలవరపడుతోంది. తన మొదటి స్థానాన్ని ఎక్కడ ఎవరు కొట్టేస్తారోనన్న దిగులు మొదలైంది. అందుకే మొన్నటి వరదలప్పుడు కర్నూలుని ముందుగానే ముంచేసింది. నిన్నటినిన్న హైదరాబాద్ నిమ్స్ లో నర్సులపై లైంగిక వేధింపులంటూ తప్పుడు వార్తను ప్రచారంచేసి చేయికాల్చుకుంది. అది చాలదన్నట్టుగా ఇప్పుడు జగన్ కి పీసీసి పదవి అప్పగించింది. రేటింగ్ తగ్గిపోతుందేమోనన్న భయం ఆవహించినప్పుడల్లా రవిప్రకాష్ కి తన బుర్రలోనుంచి వార్తలు తీయడం అలవాటైపోయింది.
2. ఎలక్ట్రానిక్ మీడియాకే తాను మకుటంలేని మహారాజునని అనుకుంటున్న రవిప్రకాష్ ఈ మధ్యనే పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం కూడా ఈ యవ శక్తి అవసరం ఉన్నదనే భావిస్తూ ఎంకరేజ్ చేస్తున్నది. 2014 ఎన్నికల వేళకు జగన్ కు గట్టిపోటీ ఇచ్చే `మగధీరుడి'గా రవిప్రకాష్ ను కీర్తించడంతో నిజంగానే తానంతటివాడినైపోయినట్టు కలలుకనడం రవిప్రకాష్ వంతైంది. పనిలోపనిగా జగన్ ని తన రాజకీయ శత్రువుగా చూడటం మొదలుపెట్టాడు. జగన్ కి సీఎం సీటు ఇవ్వకపోవడంతో కొంత శాంతించినా ఎప్పటికైనా జగన్ పైకి లేచి తనకు పోటీ అవుతాడన్న భయం లేకపోలేదు. జగన్ ను రాజకీయనేతగా పూర్తిగా అణిచివేయాలంటే మీడియా ద్వారా అందలం ఎక్కించడమే సరైన మార్గంగా భావించారు. పిసీసి పదవి జగన్ కి అప్పగిస్తున్నారంటూ వార్త ఇవ్వడంలో అసలు ఉద్దేశం జగన్ కు మేలు చేయాలని కాదు. ఆ యువరాజకీయ శక్తిని పూర్తిగా నిర్వీర్యం చేయడానికే. పైకి జగన్ కి ఫేవర్ గా అనిపించే ఈ వార్తలో అసలు లోగుట్టు, అతనికి కీడు చేయడమే. ఈ రాజకీయ డ్రామాకు రవిప్రకాష్ తన మీడియాను ఆయుధంగా వాడుకున్నాడని చెప్పుకుంటున్నారు.
మరి ఇందులో ఏది నిజం...నారాయణ...నారాయణ...

సెకండ్ టర్మ్ ఆర్నెల్లేనని వైఎస్సార్ కి ముందే తెలుసు !


ఈ సృష్టిలో ఏవిఎందుకు జరుగుతాయో తెలుసుకోగలిగితే మనిషి కూడా దేవుడైపోతాడు. ఈ క్షణానికి ఈ దేహం నీసొంతం. కానీ మరుక్షణంలో ఏమవుతుందో చెప్పలేం. రాబోయే విపత్కర పరిణామాలను సూఛాయగా గ్రహించి చెప్పగలిగిన జ్యోతిష పండుతులు దాదాపుగా అన్నిమతాల్లో ఉన్నారు. క్రైస్తవ మతగురువులు, జ్యోతిష పండితులు వైఎస్సార్ జాతకాన్ని చాలా క్షుణ్నంగా పరిశీలించారు. రెండవసారి సీఎం అవుతారనీ, ప్రజాభిమానాన్ని చోరగొంటారని కూడా చెప్పారు. చివరకు అదే జరిగింది. కానీ... సెకండ్ టర్మ్ లో సీఎంగా ఆ జనహృదినేత ఆరునెలలుకూడా ఉండలేకపోయారు. హెలికాప్టర్ దుర్ఘటనలో దివంగతులయ్యారు. ఇలా ఎలా జరిగింది? ఈ విపత్తను మతగురువులు, భవిష్యదర్శకులు ముందగా గ్రహించలేకపోయారా...?
ఇది నిజం కాదు. భవిష్య దర్శకులు ముందుగానే పసిగట్టారు. రెండవసారి వైఎస్సార్ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించిన తరువాత మతపరంగా పుణ్యస్థలమైన జెరూసెలం వెళ్ళారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండేలా ఆకాంక్షిస్తూ ప్రార్థనలు చేయమన్నారు. అదే సమయంలో ఆయనకు ఓ చేదునిజం తెలిసింది. సెకండ్ టర్మ్ ఆర్నెల్లు లేదా అంతకన్నా తక్కువగానే ఉంటుందని క్రైస్తవ జ్యోతిష పండితుడొకరు చెప్పారు. వైఎస్సార్ ఒక్కసారిగా షాకయ్యారు. తనకలల ప్రాజెక్ట్ జలయజ్ఞం పూర్తిగా కాకుండానే తాను సీఎం పదవినుంచి దిగిపోతానా...మరో ఐదేళ్లు ప్రజలకు సేవచేసే అవకాశం జారిపోతుందా...అంటూ కలవరపడ్డారు. ప్రజల గురించి తపిస్తున్న వైఎస్సార్ ని చూసి క్రైస్తవ పండితులు, మత గురువుల హృదయాలు ద్రవించాయి. వెంటనేవారు, వైఎస్సార్ క్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్సార్ తన `జీవితకాలమంతా' ముఖ్యమంత్రిగానే ఉండేలా చూడు ప్రభువా...అంటూ ప్రార్థనలు చేశారు. ప్రభువు తప్పక కరుణిస్తారనీ, మీరు చివరి శ్వాసవరకూ సీఎంగానే ఉంటారని ఆ పండితులు శుభాశీస్సులు అందించారు.
అలా శుభాశీస్సులు అందుకున్న తరువాత, వైఎస్సార్ రాష్ట్రానికి తిరిగివచ్చారు. జ్యోతిష పండితులు చెప్పిన మాటలను విశ్లేషించారు. సెకండ్ టర్మ్ ఆర్నెల్లలోపు ఎలా పోతుందాఅని ఆలోచించారు. కెవీపీ వంటి వారిని సలహాలు అడిగారు. మెజారిటీలో ఉన్న ప్రభుత్వం పడిపోవాలంటే అది మైనార్టీలోకి జారుకోవాలి. తెలంగాణా లేదా మరేదైనా ఆందోళన వచ్చి సీనియర్లు, తనంటే గిట్టని వాళ్లు రాజీనామాలకు సిద్ధపడాలి. ఒకవేళ తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాల్సివస్తే కొంతమంది ఎమ్మెల్యేలు జారుకున్నా, ఆ లోటును భర్తీ చేయడానికి వేరే పార్టీల్లోని ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. అందుకే వైఎస్సార్ `ఆకర్ష' పేరిట వల విసిరారు. ఎలాంటి రాజకీయ కుట్రలు జరిగినా తన ప్రభుత్వం మైనార్టీలోకి జారకూడదన్న ఏకైక లక్ష్యంతోనే ఇతర పార్టీల వారికోసం తలుపులు బార్లాతెరవడం మొదలుపట్టారు. వైఎస్సార్ ఇలా ఎందుకు చేస్తున్నారో తెలియక మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. దీనిపై చర్చలు ఊపందుకున్నాయి. కానీ వైఎస్సార్ అంతరంగంలోని ఆందోళనను మాత్రం ఎవ్వరూ గ్రహించలేకపోయారు.
రోజులు గడుస్తున్నాయి. నెలలు దొర్లుతున్నాయి. వైఎస్సార్ లోపల మదనపడుతున్నా, పైకి మాత్రం చెక్కుచెదరని చిరునవ్వులతోనే ప్రజాసంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందుకు సాగుతున్నారు. అసెంబ్లీలో ఒక సందర్భంలో ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడుతో - `చూడు, చంద్రబాబూ, నువ్వెన్నాళ్లు ఉంటావో, నేను ఎన్నాళ్లు ఉంటానో తెలియదు. ఉన్నన్నాళ్లూ మంచి పనులు చేయాలి. ప్రజలచేత మంచి అనిపించుకోవాలి' అంటూ వేదాంతధోరణిలో మాట్లాడారు. అయినా ఆమాటలను మీడియాగానీ, వైఎస్సార్ సన్నిహితులుగానీ అంతగా పట్టించుకోలేదు. ఆయన సహజధోరణిలోనే మాట్లాడారనే అంతా అనుకున్నారు. వైఎస్సార్ లోపల అగ్నిగుండం రగులుతోందనీ, ప్రజాసేవ ఏక్షణంలో ఆగిపోతుందోనన్న దిగులు పెరిగిపోతుందని ఎవ్వరూ గ్రహించలేకపోయారు.
సెప్టెంబర్ వచ్చింది. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే వైఎస్సార్ ప్రజలకు మరింత చేరువకావడం కోసం `రచ్చబండ' కార్యక్రమం ఏర్పాటు చేసుకుని చిత్తూరు జిల్లాకు బయలుదేరారు. వాతావరణం సరిగాలేదని ఇంట్లో సతీమణి వారించినా, మంత్రల్లో కొందరు అడ్డుతగిలినా ప్రజాసేవే పరమార్థంగా భావించిన వైఎస్సార్ అడుగు ముందుకేవేశారు. `హెలికాప్టర్ బాగుందా...?' అంటూ దానివైపు తేరపారా చూశారు. ఆ చూపులో ఏదో సందేహం...కానీ బయటపెట్టలేదు. ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రానివ్వకుండా అదే చిరునవ్వుతో హెలికాప్టర్ ఎక్కారు. తోడువచ్చిన వారు చెబుతున్న వీడ్కోలుకు ప్రతిస్పందనగా తానూ చేయి ఊపరు. ఆ చిరునవ్వుతోనే ఆకాశంలోకి ఎగిరారు. ఆ నవ్వుమోముతోనే అదనంత ఎత్తుకు ఎగిరిపోయారు.
జ్యోతిష పండితులు చెప్పేందే నిజమైంది. ప్రియతమనేత వైఎస్సార్ సెకండ్ టర్మ్ ఆర్నెల్లలోపే ముగిసింది. వారు చేసిన ప్రార్థనలు కూడా ఫలించాయి... వైఎస్సార్ జీవితాంతం ముఖ్యమంత్రిగానే ఉన్నారు. చివరి శ్వాసదాకా ప్రజాసేవకోసమే తపించారు. కానీ విధిని ఎవ్వరూ తప్పించలేరు. మరణ రహస్యాన్ని ఏ జ్యోతిష పండితులు కూడా ఛేదించలేకపోయారు.
-సీహ

Sunday, October 25, 2009

సెటైర్: వైఎస్సార్ వీలునామాలో సీఎం సీటు!

జగన్ ఇప్పుడేం చేస్తున్నాడో చూద్దామని కేవీపీ జగన్ ఇంటికి వెళ్లాడు. అక్కడ జగన్ హడావుడిగా కనిపించాడు. లాయర్ల మధ్యలో కూర్చుని కీలకపత్రాలు తిరగేస్తున్నాడు జగన్. కేవీపీ అడుగుపెట్టాడోలేదో, ఇంటినుంచి `యురేకా' అంటూ పెద్దకేక వినిపించింది. అది జగన్ పెట్టిన కేకేనని కేవీపీ ఇట్టే గ్రహించి కంగారుగా జగన్ దగ్గరకు వెళ్లాడు. `ఏమిటిదంతా జగన్?' అంటూ ఆరాతీశాడు.
`దొరికింది అంకుల్... నాకు దొరికింది'
`ఏం దొరికింది...? మొన్న కనిపించకుండాపోయిన కడప బాంబా?'
`కాదంకుల్. నాన్న రాసిన వీలునామాలో నాకు కావాల్సింది దొరికింది'
`ఏంటది?'
`ఇదిగో, ఈ వాక్యంలో ఏముందో చూడంది...`సీఎం సీటు'ని కూడా నాన్న నాకు రాసిచ్చాడు. ఇక నన్ను ఏ శక్తి ఆపలేదు. అధిష్ఠానం అడ్డుకోలేదు. బస్తీమే సవాల్...నాకెవ్వరూ అడ్డురారు. సీఎం సీటు నాదే...'
`చాల్లే ఆపు, వాక్యం పూర్తిగా చదవని...'
`చదువంకుల్...చదువు. అవతల తొలి ఫైల్ మీద సంతకం చేయాలి...'
`ఆఁ...ఇక్కడ సీఎం సీటు అని ఉన్నమాట నిజమే...కానీ దాని పక్కన ఏముందో చూడు...సీఎం సీటును తనఖాపెట్టి చేసిన అప్పుల వివరాలు ఇవి.. `పైన వివరించిన అప్పలన్నీ నా పుత్రుడైన జగన్ మోహన్ రెడ్డికి వారసత్వంగా సంక్రమిస్తాయని ఇందుమూలంగా తెలియజేస్తున్నాను...' ఈ అప్పులన్నీ కలిపి పదివేల కోట్లకు పైమాటే...'
`సీఎం సీటు తనఖా పెట్టడమేమిటంకుల్?'
`సీఎం సీటు వారసత్వంగా వస్తుందని నీవు అనుకుంటే తప్పులేదుకానీ, సీఎం సీటు తనఖా పెడితే తప్పేమిటట...అయినా ఎంతైనా నీ బాబుకదా.. అసలు విషయం ఏమిటంటే, ఫైళ్లమీద సంతకాలు పెడతానంటూ కాంట్రాక్టర్ల దగ్గర తీసుకున్నవి...'
`అవి పెట్టుబడులు..ఉరఫ్ లంచాలు...'
`కరెక్టే, కానీ సంతకం పెడితేకదా..పనిపూర్తికాలేదుకాబట్టి అవి అప్పులే అవుతాయి. అదీ, సీఎం సీటును తనఖా కథ...'
`అమ్మో...సీఎం సీటంటే, తనఖాపెట్టిన సీటా...అంకుల్...నువ్వే నన్ను కాపాడాలి'
`ఎవరు అంకుల్...?ఎవరు నువ్వు...?? నీకూనాకూ సంబంధంలేదు. ఆ అప్పుల సీఎం సీటు నీవే ఉంచుకో..బైబై...
- రాజేష్

సెటైర్: రాజకీయనటనకు నందులు

రోశయ్య మాస్టారికి ఆలోచన ఇట్టేరాగానే కేవీపీ రంగంలోకి దూకి 2009 సంవత్సరానికిగాను రాజకీయ నందులను ప్రకటించారు. ఆ వివరాలు ఇవి...
ఉత్తమ రాజకీయ చిత్రం: ప్రజారాజ్యం (కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాలేకపోయినా, అల్లుఅరవింద్ నిర్మాణ సారథ్యం, చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబువంటి స్టార్ల అద్భుత నటనతో ఒక మల్టీ స్టారర్ సినిమాగా ప్రజలను బాగా ఆకట్టుకుంది)
ఉత్తమకుటుంబకథాచిత్రం: తెలుగుదేశం-2009 (చంద్రబాబు, బాలకృష్ణ, హరికృష్ణ, ఎన్టీఆర్, కల్యాణ్ రాం, తారకరత్న...ఇలా ఫ్యామిలీఫ్యామిలీ మొత్తం కలిసి `తెలుగుదేశం -2009' సినిమాలో బాగా నటించారు)
ఉత్తమ నటుడు: జూనియర్ ఎన్టీఆర్. (ఈ నామినేషన్ కి చిరంజీవి, బాలకృష్ణ కూడా పోటీపడినప్పటికీ యాక్సిడెంటై మంచమీద పడుకుని కూడా నగదుబదలీ పథకం పేరుచెప్పి, అమ్మలారా, అక్కలారా ఇప్పుడే ఈ క్షణమే అకౌంట్లు ఓపెన్ చేయమని చెబుతూ ఎన్టీఆర్ తనదైన శైలి లో అద్భుతమైన నటనను కనబరిచారు)
ఉత్తమనటి: రోజా (తెలుగుదేశం మహిళా అధ్యక్షురలిగా పలు యాక్షన్ సన్నివేశాలలో నటించి, చీప్ లిక్కర్ బాటిల్స్ ని తెగ పగలగొట్టేసింది. చివరాఖర్లో ప్లేట్ తిప్పేసి, కాంగ్రెస్ లో చేరే సీన్లో అద్భుతంగా నటించింది.)
ఉత్తమ సహాయ నటుడు: పవన్ కల్యాణ్. (ప్రజారాజ్యం సినిమాలో హీరో చిరంజీవికి సహాయపడుతూ, అరుపులూకేకలు పెట్టడం. ఆయన చెప్పిన `పంచలూడదీస్తాం' అన్న డైలాగ్ సినిమాకే హైలైట్.)
ఉత్తమ సహాయ నటి: జీవిత (తన భర్తకేకాకుండా `కాంగ్రెస్ పార్టీ 2009' సినిమాకు కూడా తనవంతు సహాయం చేయడం. తన సినిమా గురించి పట్టించుకోకుండా పక్కహాల్లో నడుస్తున్న ప్రజారాజ్యం సినిమాను విమర్శించడం. వీలుచిక్కినప్పుడల్లా పోలీస్ కేసులు పెట్టడం. చిరంజీవి ఫ్యాన్స్ చేసిన దాడి సీన్లో అద్భుతంగా నటించారు.)
ఉత్తమ హాస్యనటుడు: కేఏ పాల్ (ఈ కేటగిరీలో టఫ్ పైటే జరిగింది. నామినేషన్లలో బాలయ్యబాబు, రాజేశేఖర్, కేసీఆర్ కూడా పోటీపడ్డారు. అయితే మొదటినుంచీ ఎంతో బిల్డప్ ఇచ్చి, టివీషోల్లో అదరగొట్టి, 292 సీట్లూ తనవే అంటూ డైలాగ్ లుకొట్టి చివరకు నామినేషన్ వేసే వేళకు ఓటర్ల లిస్ట్ లో తన పేరు లేదని తెలుసుకుని భంగపడ్డ సీన్ లో కేఏ పాల్ అద్భుతంగా నటించి అందర్నీ కడుపుబ్బ నవ్వించారు.)
ఉత్తమ హాస్యనటి: గంగాభవాని (నోటికొచ్చినకాడికి తాను తిడుతూ, అందర్నీ నవ్వించడంలో అద్భుతంగా నటించింది)
ఉత్తమ దర్శకుడు: చంద్రబాబునాయుడు (`మహాకూటమి' పేరిట భారీ సెట్టింగ్ లతో గ్రాపిక్స్ తో తీసిన సినిమాకు దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో కలవని మనుషుల్ని కలపడానికి చేసిన ప్రయత్నం బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కాకపోయినా ఈయనగారి దర్శకత్వ ప్రతిభ వెలుగుచూసింది)
స్పెషల్ జ్యూరీ అవార్డ్: చిరంజీవి (స్వీయ దర్శకత్వంలో తానే హీరోగా అధ్బుతంగా నటించిన ప్రజారాజ్యం సినిమా బాక్సాఫీస్ సక్సెస్ కాలేకపోయినప్పటికీ జనంచేత జేజేలు చెప్పించుకున్నందుకు)
-రాజేష్

సెటైర్: రోశయ్య `నందీశ్వురులు'

`సీ' బ్లాక్ లో సీఎం రోశయ్య చాలా అసహనంగా అటూఇటూ తిరుగుతున్నారు. బట్టతలను పదేపదే తడుముకుంటున్నాడు. ఆలోచన ఎంతకీ తెగకపోవడంతో సలహాకోసం కేవీపీని కేకేశారు. `ఈ పెద్దాయన ఇప్పుడెందుకు పిలిచాడా...ఏం లెక్కలు చెప్పమంటాడో ఏమో...అవి ఏవరి పీకకు చుట్టుకుంటాయోఏమో...చెబితే ఒక తంటా, చెప్పకపోతే మరో తంటా. సీనియర్లు, జూనియర్లు తననుమరీ ఫుట్ బాల్ ఆడేస్తున్నార'నుకుంటూ పెదాలు తడుముకుంటూ గొణుక్కుంటూ కేవీపీ లోపలకు వచ్చాడు.
`చూడు కేవీపీ, నాకీ లెక్కతేలడంలేదు.'
`అదేంటీ, మీరే ఓ లెక్కలమాస్టారాయె...' నసిగాడు కేవీపీ
`కావచ్చు, కానీ ఈ లెక్క రావడంలేదు. అసలు ఎన్ని నందులు ఇవ్వాలి? ఎవరెవరికి ఇవ్వాలి? చెప్పు..' సూటిగా అడిగాడు రోశయ్య.
రోశయ్యలో బెత్తంపట్టుకున్న మాస్టారు కేవీపీకి. బుర్రగోక్కున్నాడు.
కేవీపీకి అర్థంకాలా. నందులు ఇచ్చేశాక ఇప్పుడు నందులంటాడేమిటీ ఈయన! పెద్దరికం రావడంతో ఇట్టే మరచిపోతున్నాడేమో...అనుకుంటూ `అదేంటిసార్, నందులు ఇచ్చేశాంగా...'
`ఇచ్చేశారా! ఎప్పుడు? ఎవరికి?' రోశయ్య ప్రశ్నమీద ప్రశ్న సంధించారు.
కేవీపీ నసుగుతూ చెప్పాడు..గుర్తుతెచ్చుకుంటూ, `గమ్యం ...ఉత్తమ చిత్రం, రవితేజ ఉత్తమ హీరో, అరుంధతీ...ఉత్తమ...'
`ఛత్...ఇవికావు నేను అడిగేది, రాజకీయ నందుల గురించి.'
`రాజకీయ నందులా! ఇవిఎక్కడినుంచి వచ్చాయి...!'
`రాలేదు, రప్పించాలి. చూడు మిస్టర్ కేవీపీ, నువ్వుఏం చేస్తావో నాకు తెలియదు. 2009 సంవత్సరానికి వెంటనే రాజకీయ నందులు ప్రకటించాలి. వెంటనే వెళ్ళి పని చూడండి...'
.................... 2 ....................

కేవీపీ బయటకురాగానే తలుపుచాటునుంచీ వింటున్న కొండా సురేఖ కనిపించింది.
`ఏమిటిది? ఛండాలంగా...' అసహనంగా అన్నాడు కేవీపీ.
సురేఖ ముఖం తుడిచేసుకుంటూ,
`ఏంటీ పెద్దాయన పందులూ, గిందులూ అంటున్నాడు.'
కేవీపీకి మరోసారి చికాకేసింది. `పెద్దాయన అన్నది పందుల గురించికాదు, నందుల గురించి. సగం వినీ సగం వినక ప్రతిదీ హడావుడి చేయడం నీకలవాటైపోయింది.'
`నందులా భలేభలే..మళ్ళీ ఎవరికీ...?
`మనకే, అంటే రాజకీయనాయకులు ఇవ్వాలంటున్నాడు.'
`నందులన్నీ ఆయనే కొట్టేద్దామని ఆశదోశ అప్పడం..వడ...'
`ఆపు,నీ మెనూ...ఆయనేం ఈపోటీలో లేరు. అసలు ఆయనే ఒక పెద్దనంది. ఇంకా ఆయకెందుకు నంది...'
`అర్థంకాలా...'
`మరి,అదే, సీనియర్లను గౌరవించడం నేర్చుకో. రోశయ్యకు వైఎస్సారే శివయ్యలాంటివారు. వైఎస్సారీశ్వరునిమీద ఈగలు వాలితేచాలు తన శృంగాలతో పొడిచిపొడిచి చంపేవారు. నందిపాత్ర బాగా పోషించడంతో ఇప్పుడు ఇతరులకు నందులు ఇవ్వాలనుకుంటున్నారు...అదీ స్టోరీ....' చాలా తెలివిగా చెప్పాననుకున్నాడు కేవీపీ.
`హమ్మయ్యా, ఈ పెద్దాయన పోటీలో లేడుకదా...అయితే సంతోషమే. నాకో సందేహం.;
`ఏమిటో చెప్పు....'
`మరణానంతరం కూడా నందీ అవార్డులు ఇస్తారా...?'
`ఈవిషయం రోశయ్య చెప్పలేదు. అయినాఇదేం ప్రశ్న.'
`నా కోరిక తీరాలంటే, కృతజ్ఞతాభావం చెప్పుకోవాలంటే ఇదే చక్కని మార్గం. మరణానంతరం కూడా నందులు ఇస్తే, వైఎస్సార్ సార్ కి పది నందులు రావడం ఖాయం. ఆయన ఎలాగో లేరుకనుక ఆ నందులన్నీ మా జగన్ బాబే అందుకుంటారు. అలా జగన్ షోకేస్ లో పదినందులు చేరినట్టవుతుంది. సీఎం పోస్టు ఇప్పించలేకపోయినా, నందులన్నా ఇచ్చానన్న తృప్తి నాకు మిగులుతుంది'
`ఏడ్డినట్టుంది, నీ రాజకీయం. ఒక నందిలాంటి రోశయ్యనే చూసి జడుసుకుంటుంటే, పది నందులు షోకేస్ లో పెడతావా..చాల్లే పో...'
`సార్ మరో ఆశ...'
`మళ్ళీఏంటీ?'
`అరుంధతిలో నటించిన అనుష్కకు ప్రత్యేక జ్యూరీ అవార్డు ఇచ్చారుగా, అలాగే నిరంతరం, ప్రతిక్షణం జగన్ సీఎం కావాలంటూ `ఆరంధి' (ఆ యావ)లోనే ఉంటున్న నాకూ స్పెషల్ అవార్డు ఇవ్వకూడదూ...'
`ఆరంధి' ఎక్కవయ్యే, రోశయ్య మాస్టారికి దూరం అయ్యావ్. నంది తరువాత నీ పదివి సంగతి ముందు చూసుకో..'
కేవీపీ పరుగుపరుగునవెళ్ళి రాజకీయ నందుల కోసం జ్యూరి ఏర్పాటు చేశాడు. వారంరోజుల్లో రాజకీయ నందులను ప్రకటించారు.
-కణ్వస

Saturday, October 24, 2009

'బొమ్మాలి' కి పది నందులు

గ్రాఫిక్స్ తో అదరగొట్టిన అరుంధతి చిత్రం పది నందులు అందుకుంది. అనుష్కకు స్పెషల్ జ్యూరీ అవార్డు దక్కింది.
'బొమ్మాలి నిన్ను వదల' అ౦టూ ఏకంగా పది నందులు వచ్చేశాయి.....


గణపతి వీడియో దృశ్యాలు

మావోయిస్టు అగ్రనేత గణపతి వీడియో దృశ్యాలు లభ్యమయ్యాయి. నక్సల్స్‌సమావేశాల్లో ఆయన ప్రసంగిస్తున్న వీడియో క్లిప్పింగులు ఇంటర్నెట్‌లో దర్శనమిచ్చాయి. వీటిలో మావోయిస్టు పొలిట్‌ బ్యూరో సభ్యుడు కిషన్న కూడా ఉన్నాడు. ఈ వీడియోలోని ఫోటోలని ఇటీవల ఓ ఇంగ్లీషు దిన పత్రిక ప్రచురించడం విషేషం. ఇవి బీహార్‌లో జరిగిన మావోయిస్టు కాంగ్రెస్‌ సమావేశాల్లో ప్రసంగిస్తున్న దృశ్యాలని తెలిసింది. ఇప్పటి వరకు గణపతికి సంబంధించి చిన్న ఫొటో కూడా బయటికి రాలేదు. ఏకంగా వీడియో దృశ్యాలు బయట పడటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ దృశ్యాలు మీ కోసం ...

అన్నీనాకిడిచిపెట్టేయ్ జగన్ (వీడియో)

జగన్ ఢిల్లీలో సోనియాగాంధీని కలుసుకున్నతరువాత మీడియాతో మాట్లాడుతూ, మేడం గారిని కలిశాం, రాష్ట్ర రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించాం...అన్నీ నాకిడిచిపెట్టేయ్ జగన్, నేను చూసుకుంటాను అని మేడం గారు అన్నారు....అంటూ చెప్పుకుపోయారు. అసలు జగన్ ఏం చెప్పారో మీరే చూడండి...

Friday, October 23, 2009

సెకండ్ టర్మ్ ఆర్నెల్లేనని వైఎస్సార్ కి ముందే తెలుసా !

రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కొద్దిరోజులకే ప్రియతమ నేత వైఎస్సార్ కి ఓ చేదు నిజం తెలిసింది. `సెకండ్ టర్మ్ సీఎంగా తాను ఆరునెలలు కూడా ఉండనేమో...'- అన్న తలంపు ఆయన్ని కలిచివేసింది. ఇది ఎలా సాధ్యమైంది? రెండోసారి సీఎంగా ఆర్నెళ్లుకూడా ఉండవని ఆయనకు ఎవరు చెప్పారు? ఏ భవిష్యవాణి ఆయనకు ఈ హెచ్చరికలు చేసింది...ముందుగానే తెలిసినా వైఎస్సార్ జాగ్రత్తలు తీసుకోలేకపోయారా? -
ఆసక్తికరమైన కథనం...
త్వరలో
`నారదలోకం'లో మీముందుంచబోతున్నాం.
-ఎడిటర్
(kanvasas@gmail.com)

జగన్ గెలిచినట్టా, ఓడినట్టా?

జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ యాత్ర సాఫల్యమైందా, లేక వైఫల్యతే ఎదురైందా అంటే ఖచ్చితంగా చెప్పలేం. వైఎస్సార్ మరణానంతరం చురుగ్గా సాగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదగాలని ఆశించడమే ప్రధాన భూమిక పోషించింది. గడచిన 50 రోజులుగా చెలరేగుతున్న ఊహాగానాలకు తెరదింపే ప్రయత్నం కాంగ్రెస్ అధిష్ఠానం చేసింది. జగన్ ఢిల్లీయాత్రలోని రెండు కోణాలను స్పృశిద్దాం...
గెలిచినట్టే...
  • కొంతకాలంగా మేడం సోనియాను కలవాలన్న లక్ష్యం నెరవేరింది. అది కూడా రోశయ్య కంటే ముందే కలవాలన్న కోరిక తీరింది.
  • రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై తన అభిప్రాయాన్ని మేడంకు చెప్పే అవకాశం దక్కింది.
  • `అన్నీ నాకిడిచిపెట్టేయ్ జగన్, నేను చూసుకుంటా...'అంటూ సోనియా చెప్పడంతో జగన్ లో నూతనోత్సాహం వెల్లివిరిసింది.
  • `రాబోయే కాలమంతా మీలాంటి యువనేతలదే'-అంటూ సోనియా అనడంతో జగన్ లో ఆశలు చిగరించాయి.
  • దక్షిణాదిన ఉన్న ఏకైక కాంగ్రెస్ పాలితరాష్ట్రంలో పార్టీ అంతర్గత కుమ్ములాటలు తగవని సోనియా అనడంతో జగన్ లో మార్పుకు బీజం పడింది.
  • మేడం సోనియా పట్ల సంపూర్ణ విశ్వాసం ఉంచడానికి ఈ పర్యటన దోహదపడింది.
  • అధిష్ఠానం పట్ల గౌరవం పెరగడానికి పర్యటన పనికొచ్చింది. తన ప్రమేయం ఉన్నాలేకున్నా జరిగిన అప్రదిష్ఠ మచ్చలను చెరిపేసుకోవడానికి దోహదపడింది.
  • ఇప్పట్లోకాకపోయినా భవిష్యత్ లో తనకలలు నెరవేరుతాయన్న ఆశలు చిగురించాయి.
ఓడినట్టే...
  • మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వెల్లడవుతున్న వేళలో ఎవ్వరినీ నొప్పించడం మేడంకు ఇష్టంలేదు. సరిగా అదే సమయంలో జగన్-కెవీపీ ద్వయం సోనియాను కలిశారు. మేడం వారితో కొద్దిసేపు మాట్లాడారు. కొన్ని పత్రికల్లో వచ్చినట్టు ఆమె వీరితో సుదీర్ఘంగా (45 నిమిషాలో గంటో) చర్చించలేదు. ఆమె కాసేపు మాట్లాడిన తరువాత అక్కడే ఉన్న సీనియర్లతో తాజా పరిణామాలు చర్చించారు.
  • `అన్నీ నాకిడిచిపట్టేయ్ జగన్, నేను చూసుకుంటా..' అని సోనియా అనడంలోని అంతరార్థమేమిటో జగన్ కు అర్థంకాలేదు. ఈ మాటల్ని పాజిటీవ్ గా తీసుకోవాలో, నెగెటీవ్ గా తీసుకోవాలో తెలియని అయోమయ పరిస్థితిని ఎదుర్కున్నారు.
  • నిన్నమొన్నటి వరకూ ఎప్పుడూ తన వయసు గురించికానీ, అనుభవం గురించికానీ మాట్లాడని జగన్ ఢిల్లీ నుంచి వచ్చీరాగానే వాటి ప్రస్తావన తెస్తూ, `నా వయసు 37 ఏళ్లే. భవిష్యత్ చాలా ఉంది. సీఎం కుర్చీ అంటే తేలిగ్గా లాక్కునే మామూలు కుర్చీకాదు. నేను అధిష్ఠానం చెప్పినట్టు నడుచుకుంటాను. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేస్తాను'
  • తండ్రి దర్మరణం పాలైన తరువాత జగన్ ఢిల్లీ వెళ్లడం ఇదే మొదటిసారి. స్టాండింగ్ కమిటీ సమావేశం నెపంతో రోశయ్య కంటే ముందే ఢిల్లీ వెళ్ళి తనమనసులోనిమాట మేడం చెప్పే పయత్నం చేశారు. జగన్ కుటుంబానికి కలిగిన నష్టం, శోకాన్ని దృష్టిలో ఉంచుకుని సోనియా అపాయింట్మెంట్ ఇచ్చారు.
  • కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క రాష్ట్రంలో బలోపేతమవుతున్న టైమ్ లో ఏ రాష్ట్రంలో కూడా అనిశ్చిత పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతోనే జగన్ వివాదానికి ఫల్ స్టాప్ పట్టేయాలని సోనియా భావించారు. అందకే స్టాండింగ్ కమిటీ సమావేశం పేరిట జగన్ ను ఢిల్లీ రప్పించి ఆయన చెప్పిందివిని, తాను చెప్పదలచ్చుకున్న రెండు ముక్కలూ చెప్పేశారు.
  • అధిష్ఠానం నిర్ణయానికి జగన్ కట్టుబడేలా జగన్ ని ఒప్పించగలిగారు.
  • జగన్ తరువాత అదేరోజు కే.కేశవరావు కూడా సోనియాను కలిశారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడిన మాటలనుబట్టి, అధిష్టానం తన పంతం నెగ్గించుకున్నట్టే కనబడింది. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ముందు పిల్లచేష్ఠలు కుదరవని చెప్పడంలో అదిష్ఠానం సఫలీకృతమైనట్టు అర్థమైంది. అదిష్ఠానం ఎలా చెబితే అలా నడుచుకుంటానంటూ జగన్ ఇప్పుడు చెప్పారనీ, కానీ, ఈమాటేదే నెలరోజుల ముందే అని ఉంటే, జగన్ అనుచరగణం వల్ల ఇంతగా డామేజ్ అయిఉండేది కాదన్న అర్థం వచ్చేలా కేకే చెప్పారు. కేకే మొహంలో సీనియర్లే గెలిచారన్న ఆనందం కనిపించడం కొసమెరుపు.
- కణ్వస

Thursday, October 22, 2009

సుస్థిరతకు పట్టం

దేశ ప్రజలు ఏమి కోరుకుంటున్నారో మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో మరోసారి తేటతెల్లమైంది. జావాబుదారీతనం, సుస్థిరపాలన కావాలని ఏ రాష్ట్ర ప్రజలైనా కోరుకోవడం సహజం. వీటితోపాటుగా దేశాన్ని ముక్కచెక్కలు చేసే ప్రాంతీయ పార్టీలకంటే, జాతీయతాభావంతో ఏకతాటిపై నడిపించే సత్తా ఉన్న పార్టీకే పట్టం కట్టాలన్న ప్రజలమనోభావాలకు అద్దంపట్టేలా మహారాష్ట్ర, హర్యనా, అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మహారాష్ట్ర, హర్యానాల్లో మునుపటి అంత బలాన్ని సంపాదించుకోకపోయినా ప్రభుత్వాలు ఏర్పాటుచేయగల సత్తాను మాత్రం కాంగ్రెస్ పార్టీ చాటుకుంది. ఇక అరుణాచల్ ప్రదేశ్ లో ఇందుకు భిన్నంగా కాంగ్రెస్ ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. మహారాష్ట్రలో కాంగ్రెస్, దాని మిత్రపక్షం ఎన్సీపీ ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించింది. మతతత్వ పార్టీలకు మరోమారు ఓటర్లు బుద్ధిచెప్పారు. అయితే ప్రాంతీయపోకడలను రెచ్చగొట్టే మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) మాత్రం అనుకున్నట్టుగానే బలం పుంజుకుంది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ - బోకర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. సుశీల్ కుమార్ షిండె కుమార్తె ప్రణీతి షిండె సోలాపూర్ నుంచి గెలుపొందారు. రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ కుమారుడు రాజేంద్ర షెకావత్ అమరావతి నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హూడా - 72, 100 ఓట్ల తేడాతో ప్రత్యర్థిని ఓడించారు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ కు అధినేత ఓంప్రకాష్ చౌతాలా తాను పోటీ చేసిన రెండు సీట్లలోనూ గెలుపొందారు. సావిత్రి జిందాల్ హిస్సార్ లో మరోసారి విజయకేతనం ఎగురవేశారు. కాగా, లోక్ భారతిపార్టీ తరఫున పోటీ చేసిన వినోద్ కాంబ్లీ పరాజయం చవిచూశారు.

అది ప్రమాదమే, కుట్రకాదు

వైఎస్ఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుట్రతోనే కూలిపోయిందంటూ `సాక్షి' పత్రిక, `సాక్షి' ఛానెల్ ఊదరగొట్టాయి. కుట్రజరిగినట్టేనంటూ కొత్త సిద్ధాంతాన్ని జనంమీద రుద్దడానికి తీవ్రాతితీవ్రంగా ప్రయత్నించాయి. అయితే నిజానికి హెలికాప్టర్ కూలడంలో ఎలాంటి కుట్ర జరగలేదు. `కూలింది కుట్రతోనే?' అంటూ పేజీలకుపేజీలు రెండురోజుల పాటు రాసేసిన సాక్షి పత్రిక -ఆ తరువాత మెత్తబడింది. చెప్పిన విషయాలే చెప్పిచెప్పి విసుగుపుట్టిందేమో ఆ `కట్టుకథ'ని అంతటితో ఆపేసింది. హెలికాప్టర్ కూలడానికి కుట్ర జరగలేదనీ, అది కేవలం ప్రమాదవశాత్తు కూలిందని ఏవియేషన్ నిపుణుడు ఎస్.ఎన్.రెడ్డి చెబుతున్నారు. కూలడంలో కుట్రజరిగిందంటూ జనాన్ని నమ్మించడానికి ఆ పత్రిక లేవనెత్తిన అంశాలనూ, ఇప్పుడు ఏవియేషన్ నిపుణులు చెబుతున్న వాస్తవాలను ఓ సారి మీరే చదవండి...
సాక్షి: హెలికాప్టర్ కూలడంలో ఏదో కుట్ర జరిగింది. (అదేమిటో స్పష్టంగా చెప్పకపోయినా పేలుడు వల్ల కూలిందేమోనన్న అర్థం వచ్చేలా రాసింది)
నిపుణులు: బాంబులు పెట్టడంవల్లగానీ, లేదా ఏ ఇతర పేలుడువల్లకానీ హెలికాప్టర్ కూలినట్టు కనబడటంలేదు. నిజంగా విస్ఫోటనం జరిగిఉంటే హెలికాప్టర్ శకలాలు దాదాపు పదికిలోమీటర్ల పరిధిలో చెల్లాచెదురుగా పడిఉండేవి. కానీ అలా జరగలేదు. ప్రమాదశాత్తే హెలికాప్టర్ కూలిఉంటుంది.
సాక్షి: బెల్ 430 హెలికాప్టర్ బేగంపేట విమానాశ్రయంలోని హ్యాంగర్లలో అరకొర భద్రత నడుమ ఉంచారు.
నిపుణులు: వీఐపీలు వినియోగించే హెలికాప్టర్లను నిలిపిఉంచడానికి సొంతంగా హ్యాంగర్లు ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సొంత హ్యాంగర్ లేకపోవడంతో గత 20 ఏళ్లుగా ఏవియేషన్ అకాడమీ హ్యాంగర్ లోనే నిలుపుతున్నారు.
సాక్షి: హెలికాప్టర్ రక్షణ భాద్యతను పట్టించుకోలేదు.
నిపుణులు: హెలికాప్టర్ రక్షణ భాద్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే. అయితే ఏవియేషన్ అకాడమీ హ్యాంగర్ లో ఉంచడం వల్ల ఏవియేషన్ అధికారులు కూడా పట్టించుకున్నారు. అకాడమీ సొంత ఖర్చుతో కెమేరా మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటుచేశారు.
సాక్షి:
నిర్ణీత ఎత్తులో వెళ్ళాల్సిన హెలికాప్టర్ తక్కువ ఎత్తులో ఎందుకు ప్రయాణించింది? దిశ ఎందుకు మార్చారు?
నిపుణులు: వాతావరణ పరిస్థితులు సరిగాలేనప్పుడు హెలికాప్టర్ ని సురక్షితంగా గమ్యం చేర్చేందుకు పైలెట్ దిశను మార్చవచ్చు. అలాగే, ఎత్తు తగ్గించవచ్చు.
సాక్షి: సాంకేతిక లోపంతోనే హెలికాప్టర్ కూలిందేమో..
నిపుణులు: యాంత్రిక లోపం వల్ల రోటర్ వేగం తక్కువగా ఉండిఉంటే, హెలికాప్టర్ చెట్లకు తగిలిఆగిపోయేది. కానీ అలాజరగలేదు.ఆ సమయంలో గంటకు 260 నుంచి 270 కిలోమీటర్ల వేగంతో హెలికాప్టర్ ప్రయాణిస్తున్నట్టు తెలిసింది. అంటే యాంత్రిక లోపం లేనట్టే.
సాక్షి: హెలికాప్టర్ తయారీలో నాసిరకం విడిభాగాలు వాడారేమోనన్న అర్థం వచ్చేలా రాసింది.
నిపుణులు: అలాంటి అవకాశాలే ఉండవు. హెలికాప్టర్ కూలడంలో ఎలాంటి కుట్రలేదు. కేవలం వాతావరణం సహకరించక పోవడం వల్లనే గతితప్పి కూలిఉంటుంది.
- కణ్వస

Wednesday, October 21, 2009

సోనియాను కలువనున్న జగన్

ఎట్టకేలకు మేడం సోనియాను కలిసి మాట్లాడే అవకాశం జగన్ కు రాబోతున్నది. దసరా పండుగకాగానే సోనియా నుంచి పిలుపు వస్తుందని గంపెడాశ పెట్టుకున్న జగన్ కు నిరాశే ఎదురైంది. వైఎస్సార్ దుర్మరణంపాలై 50 రోజులు దాటినా తన ఏకైక డిమాండ్ ను అధిష్ఠానం పట్టించుకోలేదన్న బాధ జగన్ లోనూ, ఆయన అనుచరగణంలోనూ పేరుకుపోయింది. ఇక ఉండబట్టలేక ఫైనాన్స్‌ స్టాండింగ్‌ కమిటీ మీటింగ్ నెపంతో జగన్ బుధవారం ఢిల్లీ వెళ్ళారు. తండ్రి మరణానంతరం మొదటిసారిగా జగన్ హస్తినలో కాలుమోపారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ వీరప్ప మొయిలీని జగన్, కేవీపీ కలిశారు. ఏమాట్లాడుకున్నారో చెప్పమని మీడియా కేవీపీని అడిగినా ఆయన పెదవివిప్పలేదు. జగన్ సంగతి సరేసరి. అయితే మొయిలీ మాత్రం ఈ భేటీ గురించి ప్రస్తావిస్తూ, ఇది కేవలం మర్యాదపూర్వకంగా జరిగిందేనంటూ తేల్చిపారేశారు. పైగా, అధిష్ఠానానికి వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా మేడం సోనియా ఊరుకోవడంలేదనీ, సున్నితమైన ప్రతి అంశాన్ని అధిష్ఠానం సునిశితంగా పరిశీలిస్తున్నదని పరోక్షంగా మొట్టికాయవేశారు.
ఒకవేళ జగన్ కోరికను మన్నించి సోనియా పిలుపు పంపించినా ఉభయుల మధ్య మర్యాదపూర్వకంగానే భేటీ ఉండవచ్చు. అంతకు మించి ఏదో ఊహించడం అత్యాశే అవుతుంది. తండ్రి మరణానంతరం మొదటిసారిగా ఢిల్లీకి వచ్చారుకనుక జగన్ కోరికను మేడం మన్నించవచ్చు.
జగన్ ఢిల్లీ వెళ్ళిన సమయానికి సోనియా అక్కడలేరు. ఆమె ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉన్నారు. అది ముగించుకుని గురువారం సాయంత్రానికి ఢిల్లీకి చేరుకుంటారు. వచ్చీరాగానే మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల గురించి సమీక్షిస్తారు. అవసరాన్నిబట్టి వ్యూహరచనలు చేసే పనిలో పడతారు. మరీ ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపైనా, ముఖ్యమంత్రి పదవిని ఎన్సీపీతో పంచుకునే విషయంపైనా ఇప్పటికే కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతోంది. ఈ తలనొప్పిల నడుమ జగన్ ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కోరిక, లేదా అభ్యర్థన విషయం తెరమరుగు అవుతుంది.
అంతా అనుకూలంగా ఉంటే శుక్రవారం మాత్రమే జగన్ మేడం సోనియాను కలిసే అవకాశం ఉంటుంది. ఆ భేటీ కూడా కేవలం నిమిషాల్లోనే పూర్తి కావచ్చు. పరామర్శలకే పరిమితం అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
-కణ్వస

రామ్‌చరణ్‌ కి ముచ్చటగా మూడోది !


మగధీర చిత్రం హిట్‌ కావడంతో జోరుమీదున్న రామ్‌చరణ్‌తే మూడో చిత్రం బుధవారం ప్రారంభమైంది. నగరంలోని నోవాటెల్‌ హోటల్‌లో అంజనా ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత నాగబాబు విలేకరులతో మాట్లాడారు. ఈ చిత్రంలో కథానాయకగా జెనీలియాను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, దాసరినారాయణరావు, డి. రామానాయుడు, అల్లు అరవిందు, రాఘవేందరావు తదితరులు పాల్గొన్నారు.

జగన్‌ ఏకవాక్య ప్రకటన

జగన్ ఢిల్లీకి వెళ్లగానే మేడం సోనియాను కలుస్తారని అంతా అనుకున్నారు. కానీ అక్కడ సీను వేరేరకంగా ఉంది. మీడియా చుట్టుముట్టి అసలు సంగతి రాబడదామని ఎంతగా ప్రయత్నించినా జగన్ చివరకు ఏకవాక్యంతో సరిపెట్టారు. ఫైనాన్స్‌ స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు బుధవారం ఢిల్లీ వచ్చిన కడప ఎంపీ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిసేందుకు అనుమతి కోరామనీ వేచి చూస్తామని చెప్పారు. అంతే సంగతులు...
ఇట్లు, చిత్తగించవలెను.

వైఎస్సార్ అల్లుడి గుప్పెట్లో వందలకోట్లు !

వైఎస్సార్ ఎక్కిన హెలికాప్టర్ కూలడంలో కుట్ర జరిగిందంటూ ఒక పక్క సంచలనాత్మక కథనాలు వెలువడుతున్న నేపథ్యంలోనే మరోపక్క వైఎస్సార్ కుటుంబసభ్యులపైన కూడా నీలినీడలు పరుచుకుంటున్నాయి. ఎస్ఎంఎస్ ల ద్వారా, ఫోన్ల ద్వారా చెప్పుకుంటున్న గుసగుసలకు అక్షర రూపం కల్పిస్తే...
  • వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన కుమారుడు జగన్ కు ఇచ్చింది ఇవ్వగా కోట్లాది రూపాయలను అల్లుడు బ్రదర్ అనిల్ కు ఇచ్చారు.
  • వైఎస్సార్ కొన్ని విషయాల్లో అల్లుడి మాటలనే విశ్వసించేవారు. ఆ సమయంలో జగన్ మాట వినేవారు కారు.
  • వ్యాపార వ్యవహారాల్లో జగన్ కు మద్దతు ఇచ్చినా, రాజకీయ ఎత్తుగడల విషయంలో తండ్రీకొడుకుల మధ్య తేడాలు వచ్చేవి. అలాంటి సమయాల్లోనే అల్లుడు అనిల్ దగ్గరయ్యేవారు.
  • ప్రియమిత్రుడు కేవీపీ, అల్లుడు అనిల్ చెప్పిన మాటలు వినడంతో వైఎస్సార్ తన కుమారుడు జగన్ కు కొన్ని సందర్బాల్లో దూరం అయ్యారు.
  • మతపరమైన వ్యవహారాలు నడపడంలో దిట్ట అయిన బ్రదర్అనిల్ మామగారిని ఇట్టే ఆకర్షించుకున్నారు.
  • వందలాది కోట్లు బ్రదర్ అనిల్ తన గుప్పెట్లో పెట్టుకున్నారు.
  • వైఎస్సార్ దుర్మరణంతో ఆ ఇంట్లో ఒక్కసారిగా `శూన్యత' ఆవరించింది. (ఇది రాజకీయ శూన్యత కాదు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన శూన్యత)
  • ఆ శూన్యత నుంచి విభేదాల చిచ్చు రగులుకుంది. అది చివరకు బావ, బావమరిదిల మధ్య అఘాతాలు సృష్టిస్తోంది.
  • తండ్రి అప్పగించిన వందలాది కోట్లు ఇవ్వమంటూ జగన్ ఒత్తిడి తెచ్చారు. కేవీపీ చేత మధ్యవర్తిత్వం చేయించారు.
  • కేవీపీ సౌమ్యంగా సాగించిన మధ్యవర్తిత్వం నచ్చకపోవడంతో జగన్ ఆ పెద్దాయన్ని కూడా పక్కనపెట్టారు.
  • కుటంబవ్యవహారాలు చక్కదిద్దడానికి జగన్ ఇప్పుడు ఒంటరి పోరాటానికి దిగారు.
  • తండ్రి మరణంతో తలెత్తిన ఈ ఆర్థిక సమస్యనుంచి ఎలా బయటపడాలా అని జగన్ తీవ్రంగా ఆలోచిస్తున్నారు.
కూలింది కుట్రతోనే- అంటూ వైఎస్సార్ తనయుడు అనుమానాలు వ్యక్తం చేస్తున్నందున దర్యాప్తు, విచారణ మరింత కట్టుదిట్టంగా జరుపవచ్చు. అదే జరిగితే అసలు సంగతి ఎలా ఉన్నా, తీగలాగితే డొంకంతా కదిలినట్టు అవుతుందన్న భయం వైఎస్సార్ బంధువర్గంలో వ్యక్తమవుతోంది.
మరి ఈ ఆరోపణల్లో నిజం ఎంతో... నారాయణ...నారాయణ...

రోశయ్యకు కొండా సురేఖ సలాం

అసంతృష్ట మంత్రులంతా నెమ్మదిగా రోశయ్య పంచన చేరుతున్నారు. ఆయనకు సలాంలు కొడుతున్నారు. సీఎల్పీ సమావేశం పెట్టేలోగా మంత్రులంతా రోశయ్యకు తమ పూర్తి మద్దతు తెలపాలనీ, అప్పుడే సీఎల్పీ మీటింగ్ ఉసెత్తాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. వైఎస్సార్ మరణంతో ఒక్కసారిగా భావోద్వేగం ఎగిసిపడిన నేపథ్యంలో తొందరపడకుండా తగిన సమయంలో నే నిర్ణయం తీసుకోవాలని సోనియా భావిస్తున్నారు.
ఆనం, బోత్సా, రఘువీర వంటి వారు ఒక్కొక్కరుగా తోకముడుచుకుని రోశయ్య చెంతకు వస్తుంటే, కొండా సురేఖ మాత్రం కొరకరాని కొయ్యలా మారిందని జనం ఇప్పటికీ అనుకుంటున్నారు. అయితే, ఇందులో నిజంలేదు. కొండా సురేఖ కూడా రోశయ్య మాస్టారిని శరణుజొచ్చింది. రోశయ్యను తాత్కాలిక సీఎంగానే చూస్తూ, సీఎల్పీ మీటింగ్ పెట్టాయాల్సిందేనంటూ తెగ డిమాండ్ చేస్తున్న సురేఖలో ఇప్పుడిప్పుడే భావోద్వేగం తగ్గుముఖం పడుతోంది. వైఎస్సార్ కుటుంబం చేసిన మేలుకంటే, ఉన్నపదవే ముఖ్యమంటూ ఆమె శ్రేయోభిలాషులు హితవు పలకడంతో సురేఖ మెత్తబడినట్టు తెలుస్తోంది. రహస్యంగా రోశయ్యను కలిసి, తప్పులుంటే క్షమించమంటూ అర్థించినట్టు చెప్పుకుంటున్నారు. అయితే, ఉన్నట్టండి ప్లేట్ తిప్పేయలేననీ, అందుకు కొంత వ్యవధి కావాలని రోశయ్యను కోరారట. పెద్దాయన పెద్దమనసుతో ఒకే అనడంతో సురేఖ ఇప్పుడు వ్యూహాత్మకంగా మీడియా ద్వారా అంచెలంచెలుగా మొత్తబడే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని విశ్వసనీయంగా తెలిసింది. మరో వారం రోజుల్లో కొండా సురేఖ భేషరుతుగా, బహిరంగంగా రోశయ్య మాస్టారికి మద్దతు ఇవ్వడం ఖాయమనే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
-కణ్వస

Tuesday, October 20, 2009

జగన్ Vs రవి ప్రకాష్

రాజకీయాల్లో ఏవైనా జరగొచ్చు. ఫలానా వ్యక్తి రాజకీయాల్లోకి ఎందుకు వస్తాడులే అని అనుకంటే, హఠాత్తుగా ఎంట్రీ ఇచ్చేసుకోవచ్చు. సినీరంగం నుంచి ఓ ఎన్టీఆర్, ఓ చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చేశారు. అనేక రంగాలవారు, అనేక వృత్తుల వారు రాజకీయాల్లోచేరి రాణించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా వినబడుతున్న టాక్ ఏమిటంటే, ఎలక్ట్రానిక్ మీడియా కింగ్ గా భాసిల్లుతున్న రవిప్రకాష్ అతి త్వరలోనే పొలికల్ ఎంట్రీ ఇచ్చేస్తున్నారని. అంతేకాదు, కాంగ్రెస్ అధిష్ఠానం ఆశీస్సులతోనే రవిప్రకాష్ ఇకపై జగన్ కు పోటీ కావచ్చు. ఈ ఊహగానాలకు ఊతం ఇస్తున్న అంశాలు ఇవి....
  • సాక్షి పత్రికలో అక్టోబర్ 19 (సోమవారం) ప్రచురితమైన ప్రత్యేకకథనం (కూలింది కుట్రతోనే?) వచ్చింది. ఈ కథనానికి టివీ9 స్పందిస్తూ అదే రోజు రాత్రి ఏడున్నర గంటలకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని (కుట్ర సిద్ధాంతం) ప్రసారం చేసింది.
  • సాక్షి పత్రికలో వచ్చిన కథనానికి వెంటనే స్పందించాలంటూ రవిప్రకాష్ తన సిబ్బందికి ఆదేశాలిచ్చారు.
  • ముఖ్యమంత్రి రోశయ్యకూ, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికీ మనం సపోర్ట్ చేయాలంటూ సిబ్బందికి సంకేతాలు పంపించారు.
  • వెంటనే టివీ9 సిబ్బంది ఉరుకులూ పరుగులుపెట్టి సాక్షి `కుట్ర' సిద్ధాంతాన్ని వెలికిలాగారు.
  • ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో టివీ9 పాతుకుపోవడంతో సహజంగానే ఆయారాష్ట్ర ప్రభుత్వాలతోనూ, అటు కేంద్ర ప్రభుత్వంతోనూ అనేక పనులు ఉంటాయన్న ఉద్దేశంతోనే రవిప్రకాష్ చాలా బ్యాలెన్స్ గా వ్యవహరిస్తున్నారు. అదేసమయంలో కేంద్రం నుంచి వచ్చిన సంకేతాలను అందిపుచ్చుకుని రాజకీయ ప్రవేశానికి పావులు కదిపారు. అందులో భాగంగానే వరద బాధితుల సహాయం కోసం ప్రత్యేక ర్యాలీ పెట్టేసి ప్రజలకు చేరువకావడానికి ప్రయత్నించారు.మరో పక్క రోశయ్యకు మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు.
  • జగన్ వర్గం బలోపేతం అవుతున్న నేపథ్యంలో ఆయనకు చెక్ పెట్టాలంటే మరో యువశక్తి ఉండాలన్న కాంగ్రెస్ అధిష్టానం వ్యూహం ప్రకారమే రవిప్రకాష్ నడుచుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం.
  • ఇదే జరిగితే, రాబోయే కాలంలో జగన్ కు రవిప్రకాష్ రాజకీయంగా గట్టి పోటీ ఇవ్వవచ్చు.
- కణ్వస

కేవీపీని టార్గెట్ చేసిన `సాక్షి'

`కూలింది కుట్రతోనే?' అంటూ అక్టోబర్ 19 (సోమవారం) సంచలన కథనాన్ని ప్రచురించిన `సాక్షి' దినపత్రిక మర్నాడు (20వ తేదీ మంగళవారం) మరో కథనంతో ముందుకొచ్చింది. ఈసారి `అగస్టా ఎందుకు రాలేదు'? అంటూ పాఠకుల్ని ప్రశ్నించింది. మొదటి రోజు ప్రశ్నతోనే బిత్తరపోయిన పాఠకుడు, మర్నాడు మరో ప్రశ్న రావడంతో అవాక్కయ్యాడు. ఇంతకీ జగన్ పెట్టుకుంది న్యూస్ పేపరో, `కొశ్చిన్ పేపరో' తెలియక జుట్టుపీక్కున్నాడు. రెండున్నర రూపాయలుపెట్టి కొనుక్కున్న పేపర్ కావడంతో పాఠకుడు గతిలేక చదవడం మొదలుపెట్టాడు. ఈ `అగస్టా' ఏమిటీ, అది ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారో తెలుసుకుందామని మ్యాటర్ లోకి వెళితే, సాక్షి `అంతరంగం' ఆవిష్కృతమైంది. ఆ వివరాలు...
హెలికాప్టర్ కూలడానికి ముందే అధికారులు అంతులేని నిర్లక్ష్యం వహించారు.
(బాగానే ఉంది. నాటి ముఖ్యమంత్రి వైఎస్సారే ఉన్నతాధికారులను దగ్గరుండి నియమించుకున్నారు. కాకుంటే ఆయన ప్రియమిత్రుడు కేవీపీ సలహామేరకు ఆ పని చేశారు. అధికారుల నిర్లక్ష్యం అని ఇప్పుడు సాక్షి అక్కసు వెళ్లగక్కితే అది ఎవరికి తగులుతుంది...దివంగత నేతకా, లేక కేవీపీకా..? తండ్రిమీద బురదజల్లలేడు కనుక జగన్ తన `పేపర్ రాకెట్' ను కేవీపీ `అంకుల్'పై గురిపెట్టాడు. ఢిల్లీలో తన పని కేవీపీ చక్కపెట్టలేకపోయాడన్న అక్కసే అక్షరాల రూపంలో కనబడుతున్నట్టుంది)
అగస్టా వెస్ట్ లాండ్ హెలికాప్టర్ ఉండగా బెల్ 430ని ఎందుకు వినియోగించారు?
(ఎవరు వినియోగించారో కూడా చెబితే బాగుండేది. (అసలు ఉద్దేశం ఏమంటే, ప్రజా భద్రత, రక్షణ వ్యవహారాల కమిటీ చైర్మన్ హోదాలో ఉన్న కేవీపీదే తప్పు అని చెప్పడమే. ఆయన్నే టార్గెట్ చేయడం.)
వైఎస్ ని ఎక్కించుకోవడానికి ముందు బెల్ 430 విమానం బేగంపేట విమానాశ్రయంలోనే అరకొర భద్రత ఏర్పాట్ల మధ్యనే పడిఉంది.
(బేగంపేట విమానాశ్రయాన్ని పట్టించుకోవాల్సిన అధికారులు నిద్రపోయారన్నదే దీని భావం. మళ్ళీ ఇక్కడా కేవీపీపైనే `సాక్షి' గురిపెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తోంది)
ఇలాంటి కొశ్చిన్ మార్కులతో, అస్పష్టంగా ఏదో కుట్రజరిగిందన్న ఆలోచనలతో పుంఖానుఫుంఖాలుగా వార్తా కథనాలను ప్రచురించడంతో సాక్షి ఏ లక్ష్యాలను చేరుకుంటుందో చూడాలి. అయితే ఒకటి మాత్రం నిజం, ఇప్పుడు కేవీపీ, రేపు రోశయ్య, ఎల్లుండి మరో పుల్లయ్య...ఇలా ఒక దుర్ఘటనపై బురదజల్లుకుంటూ పోతుంటే చివరకు జనం ఆ పేపర్నీ, దాని యాజమాన్యాన్ని నిలదీస్తారు. ఉన్నతాధికారులందర్నీ వైఎస్సారే స్వయంగా తెచ్చి తనపక్కన పెట్టుకున్నప్పుడు ఇక ఎవర్ని నిందించి ఏం లాభం. పైగా వైఎస్సార్ ఆప్తమిత్రుడు కేవీపీ దుర్ఘటన అనంతరం జగన్ సీఎం కావాలని తపించారు. తనకు తోచిన సలహాలు చెప్పారు. అయినా జగన్ వర్గీయులు నానాయాగీ చేస్తుండటంతో ఆ పెద్దాయన మౌనవ్రతంబూనారు. అదే సమయంలో ఇటు జగన్ వర్గీయులు కేవీపీని టార్గెట్ చేయడం ప్రారంభించారు. అందులో భాగంగానే `అగస్టా ఎందుకు రాలేదు?' అంటూ `సాక్షి' మరో అనుమానాస్త్రం సంధించడం.
-కణ్వస