Wednesday, October 21, 2009

సోనియాను కలువనున్న జగన్

ఎట్టకేలకు మేడం సోనియాను కలిసి మాట్లాడే అవకాశం జగన్ కు రాబోతున్నది. దసరా పండుగకాగానే సోనియా నుంచి పిలుపు వస్తుందని గంపెడాశ పెట్టుకున్న జగన్ కు నిరాశే ఎదురైంది. వైఎస్సార్ దుర్మరణంపాలై 50 రోజులు దాటినా తన ఏకైక డిమాండ్ ను అధిష్ఠానం పట్టించుకోలేదన్న బాధ జగన్ లోనూ, ఆయన అనుచరగణంలోనూ పేరుకుపోయింది. ఇక ఉండబట్టలేక ఫైనాన్స్‌ స్టాండింగ్‌ కమిటీ మీటింగ్ నెపంతో జగన్ బుధవారం ఢిల్లీ వెళ్ళారు. తండ్రి మరణానంతరం మొదటిసారిగా జగన్ హస్తినలో కాలుమోపారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ వీరప్ప మొయిలీని జగన్, కేవీపీ కలిశారు. ఏమాట్లాడుకున్నారో చెప్పమని మీడియా కేవీపీని అడిగినా ఆయన పెదవివిప్పలేదు. జగన్ సంగతి సరేసరి. అయితే మొయిలీ మాత్రం ఈ భేటీ గురించి ప్రస్తావిస్తూ, ఇది కేవలం మర్యాదపూర్వకంగా జరిగిందేనంటూ తేల్చిపారేశారు. పైగా, అధిష్ఠానానికి వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా మేడం సోనియా ఊరుకోవడంలేదనీ, సున్నితమైన ప్రతి అంశాన్ని అధిష్ఠానం సునిశితంగా పరిశీలిస్తున్నదని పరోక్షంగా మొట్టికాయవేశారు.
ఒకవేళ జగన్ కోరికను మన్నించి సోనియా పిలుపు పంపించినా ఉభయుల మధ్య మర్యాదపూర్వకంగానే భేటీ ఉండవచ్చు. అంతకు మించి ఏదో ఊహించడం అత్యాశే అవుతుంది. తండ్రి మరణానంతరం మొదటిసారిగా ఢిల్లీకి వచ్చారుకనుక జగన్ కోరికను మేడం మన్నించవచ్చు.
జగన్ ఢిల్లీ వెళ్ళిన సమయానికి సోనియా అక్కడలేరు. ఆమె ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉన్నారు. అది ముగించుకుని గురువారం సాయంత్రానికి ఢిల్లీకి చేరుకుంటారు. వచ్చీరాగానే మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల గురించి సమీక్షిస్తారు. అవసరాన్నిబట్టి వ్యూహరచనలు చేసే పనిలో పడతారు. మరీ ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపైనా, ముఖ్యమంత్రి పదవిని ఎన్సీపీతో పంచుకునే విషయంపైనా ఇప్పటికే కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతోంది. ఈ తలనొప్పిల నడుమ జగన్ ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కోరిక, లేదా అభ్యర్థన విషయం తెరమరుగు అవుతుంది.
అంతా అనుకూలంగా ఉంటే శుక్రవారం మాత్రమే జగన్ మేడం సోనియాను కలిసే అవకాశం ఉంటుంది. ఆ భేటీ కూడా కేవలం నిమిషాల్లోనే పూర్తి కావచ్చు. పరామర్శలకే పరిమితం అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
-కణ్వస

No comments:

Post a Comment