Saturday, October 10, 2009

పోకస్: బలహీనపడిన జగన్ - 3

వైఎస్ మరణానంతరం రాజకీయంగా శూన్యత ఏర్పడిందనీ, స్తబ్దత చోటుచేసుకుందని ఎవరైనా అంటే అందులో నిజం లేదనే చెప్పలి. ఎందుకంటే, వైఎస్సార్ పార్థివ శరీరానికి అంత్యక్రియలు పూర్తికాకముందే వివిధ పార్టీల శిబిరాల్లో అత్యంత రహస్యంగా వ్యూహాత్మకంగా ఎత్తుగడలు చోటుచేసుకున్నాయి. కాకపోతే ఒక పెద్ద నాయకుడు ఉన్నట్టుండి కనుమరుగు కావడంతో ఎల్లెడలా భావోద్వేగం చోటుచేసుకున్నమాట వాస్తవమే. ఆ భావోద్వేగమే జగన్ వంటివారికి అదనపు బలాన్ని అందించింది. నిజానికి ఇది బలుపా, వాపా అన్నది ఈ యువనాయకుడు గ్రహంచేలోపే అధిష్ఠానం వద్ద - శక్తివంతుడైన యువనేతకు జరగరాని అన్యాయం జరిగిపోయింది. భావోద్వేగం నుంచి ఎగిసినపడిన ఆవేశం జగన్ రాజకీయ కెరీర్ కు మేలు చేయకపోగా కీడు చేసింది. సరిగా ఇదే సమయంలో ప్రత్యర్థులు బలం పుంజుకోవడం ప్రారంభించారు.
ఇదే శీర్షికన మొదటి రెండు భాగాల్లో ప్రస్తావించినట్టు తాత్కాలిక ముఖ్యమంత్రే అనుకున్న రోశయ్య పూర్తిగా సీఎం సీటును ఆక్రమించుకున్నారు. అధిష్టానమంత్రాన్ని వల్లెవేస్తూ తన స్థానాన్ని బలోపేతం చేసుకున్నారు. అదే, జగన్ ఈ పని చేయలేకపోయారు. పావురాలగుట్టకు చేరువలోని నల్లకాలువ వద్ద బహిరంగ సభ పెట్టినప్పుడు జగన్ కనీసం ఒక్క మాట కూడా పార్టీ గురించి కానీ, లేదా అధిష్ఠానం గురించి కానీ ప్రస్తావించలేదు. అధిష్టానమంత్ర మహిమను జగన్ సరిగా అర్థం చేసుకోలేకపోయారు. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీగానీ, అందులోని సీనియర్ నేతలు కానీ ఈ యువనేత మనోభావాలను సరిగా అవగతం చేసుకోలేకపోయారు. జగన్ అనుయాయుల ప్రేలాపనలు, చేష్టలు యువనేతపై రుద్దే ప్రయత్నం చేశారు. ఎప్పటికప్పుడు అధిష్ఠానానికి మరిన్ని కల్పించి చేరవేశారు. సరిగా అదే సమయంలో జగన్ మౌనవ్రతం వీడి వాస్తవాలను స్పష్టంగా వెల్లడించి ఉంటే పరిస్థితి మరోరకంగా ఉండది. జననేత మహాభినిష్క్రమణ తరువాత ఆయన కుమారుడు తండ్రి స్థానంలో కూర్చోవాలనుకోవడంలో తప్పలేదు, కానీ, అందుకు ఆయన ఎంచుకున్న మార్గంలో వైరి వర్గాల వారు అనేక హర్డిల్స్ సృష్టించారు. ఫలితంగా జగన్ ఉన్నట్టుండి రాజకీయంగా బలహీనుడయ్యారు.
రోశయ్య, చంద్రబాబు బలోపేతులైనట్టుగానే ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కూడా అదునుచూసి పావులు కదుపతూ, బలపడే ప్రయత్నం ప్రారంభించారు. సీఎం కావాలన్న ఆయన ఆశ ఎలాగో ఇప్పట్లో తీరదు కనుక మరోదారిలో సాగతూ, గౌరవప్రదమైన సీటు (వీలైతే హోం మంత్రి పదవి) దక్కించుకోవాలనుకున్నారు. జగన్ ప్రభావం వల్ల రోశయ్య ప్రభుత్వం మైనార్టీలో పడితే, ఆదుకోవడానికి తనవద్ద ఉన్న 18 మంది ఎమ్మేల్యేలను సిద్ధం చేసే పనిలోపడ్డారు. అయితే ఇందుకు ప్రతిగా హోంశాఖ కావాలని చిరంజీవి రోశయ్యను కోరినట్టు తెలిసింది. తిరుపతిలో రోశయ్యను కలుసుకుని దాదాపు గంటన్నరసేపు ముచ్చట్లు జరిపిన చిరంజీవి తన మనసులోని మాటను బయటపెట్టినట్టు చెప్పుకుంటున్నారు. ఈ రకంగా చిరంజీవి బలోపేతమవుతూ, జగన్ పై పరోక్షంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరి, తెరాస అధినేత కేసీఆర్ ఏ విధంగా పావులు కదుపుతున్నారు? జగన్ కు వ్యతిరేకంగా ఎలాంటి ఎత్తుగడలు వేస్తున్నారన్న ఆసక్తికరమైన విషయాలను కూడా విశ్లేషించుకోవాల్సిందే...
(కేసీఆర్ ఎత్తుగడలు తరువాయి భాగంలో)
-కణ్వస

1 comment: