Sunday, October 18, 2009

రోశయ్యా, ఇలాగైతే ఎట్లాగయ్యా? (పార్ట్-2)

ముఖ్యమంత్రిగా ఉండేవారిలో ప్రధానంగా ఉండాల్సన లక్షణం `సహనం'. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, ఇప్పటి రోశయ్య సీఎంగా ఉన్నప్పటికీ ఉన్న తేడాను ప్రజలు గుర్తిస్తున్నారు. అంతేకాదు, వైఎస్సార్ జనహృదయనేతగా ఎందుకు మారారో, రోశయ్య సార్ ఎందుకు మారలేకపోతున్నారో కూడా పోల్చి చూసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో రోశయ్య బీపీ పెంచేసుకుని అన్నమాటలను ఉటంకిస్తూ, అదే వైఎస్సార్ అయితే ఎలా మాట్లాడిఉండేవారో తెల్సుకుంటే ఈ ఇద్దరి నేతల మధ్య ఉన్న అంతరం మీకు ఇట్టే తెలుస్తుంది.
రోశయ్య: (ఓలేరుపల్లెపాలెంలో గండిపడటాన్ని అక్కడి గ్రామస్థులు చెప్పినప్పుడు) గండి ఎందుకు పడింది? కారకులు ఎవరు? తదితర విచారణ నిమిత్తం నేను రాలేదు. బాధితులను పరామర్శించి భరోసా ఇవ్వడానికి వచ్చాను. ( రోశయ్య మాస్టారు అందుకే వచ్చిఉండవచ్చు. ఇందులో నిజంలేకపోలేదు. గ్రామస్థులకు అడ్డుతగులుతూ రోశయ్య కుండబద్దలుకొట్టినట్టు చెప్పడంతో వారంతా కంగుతిన్నారు.)
వైఎస్సార్: (ఇదే పరిస్థితుల్లో వైఎస్సార్ ఉండిఉంటే ఆయన చెప్పే పద్ధతి) అమ్మలారా, అక్కలారా, తమ్ముళ్లారా, చెల్లెళ్ళారా.... ఓ ఒక్కరికీ కష్టం కలుగుకుండా చూస్తాను. ఓలేరుపల్లెపాలెం వద్ద గండి పడినట్టు చెబుతున్నారూ, దీని గురించి హైదరాబాద్ కు వెళ్లగానే వెంటనే చర్యలు తీసుకుంటానూ, అప్పటిదాకా ఓపికపట్టండీ..ఎవ్వరికీ కష్టం కలగకుండా చేస్తాను.
రోశయ్య: (వరద బాధితులతో) నేను చెప్పేది వినడం ఇష్టంలేకుంటే చెప్పండి. ఒకరిద్దరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మిగతా వాళ్లు మౌనంగా ఊరుకుంటారా?
వైఎస్సార్: (ఇదే పరిస్థితిలో మాట్లాడాల్సి వస్తే) మాట్లాడే స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. ఆ మాట్లాడుతున్న వారు ఇలా వచ్చి బిగ్గరగా చెప్పండి. మీరు చెప్పేది ఆచరణయోగ్యమైతే వెంటనే పరిష్కరిస్తాం. తమ్ముళ్లూ రండీ...రా అక్కా నువ్వు రా...చెప్పు నీ కష్టాలేమిటో...
రోశయ్య: (పరిహారం భూమి యజమానులే తీసుకుంటున్నారనీ, కౌలు రైతులు ఫిర్యాదు చేసినప్పుడు) కౌలు రైతులూ, భూయజమానుల మధ్య సరైన అవగాహన ఉండాలి. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తోంది. దాన్ని ఎవరైతే తీసుకోవాలో వారే తీసుకోవాలి. అంతకు మించి ప్రభుత్వం ఏం చేయగలదు? (దీంతో జనం అవాక్కయ్యారు)
వైఎస్సార్: (ఇలాంటి సందర్బంలో ఎదురైతే) మీ సమస్య అర్థమైందీ, కౌలుదారీ వ్యవస్థలో మార్పులు చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఇచ్చే పరిహారం కౌలుదారులకు కూడా వర్తించేలా చట్టాలను సవరిస్తాం. అవసరమైతే ఇందుకోసం ఢిల్లీ వెళ్తాం. (జనం చప్పట్లు)
రోశయ్య: (మెరక ప్రాంతంలో ఇళ్లు కట్టించి ఇవ్వాలని ఒక మహిళ గట్టిగా అడిగితే) అలా గట్టిగా అరవమాకు. ఏదైనా ఉంటే కాగితంమీద రాసివ్వండి. అధికారులు చూస్తారు.(అదికారులు ఎలా చూస్తారో తెలిసిన జనం ఇక సీఎంకు చెప్పి ప్రయోజనం లేదని ఢీలాపడిపోయారు)
వైఎస్సార్: (ఇదే పరిస్థితి ఎదురైతే) అమ్మా, నీ ఆవేదన అర్థమైందీ. వెంటనే ఈ సమస్యను పరిష్కరిస్తాం. అందరికీ పక్కా ఇళ్లు కట్టించాలన్నదే మా ప్రభుత్వ నిర్ణయం. దాన్ని వెంటనే అమలుచేస్తాం. (జనం తప్పట్లు)
రోశయ్య: (గండి పూడ్చలని గ్రామస్థులు వెళుతుంటే పోలీసులు అడ్డుకున్నారంటూ ఒక వ్యక్తి ఆరోపించినప్పుడు) ఏమయ్యా! ఎవరైనా పోలీసులు ఎక్కువ నష్టం కలిగించారని చూస్తారా? ఎందుకు అలా అభాండాలు వేస్తారు? (రాష్ట్ర పోలీస్ వ్యవస్థపై రోశయ్యగారికి ఉన్న నమ్మకం జనాన్నినోరువెళ్లబెట్టేలా చేసింది)
వైఎస్సార్: బాధ్యతా రాహిత్యంగా ఎవరు ప్రవర్తించినా ఊరుకోనేదేలేదు. ప్రజాసంక్షేమానికి అడ్డుతగిలే పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటాం. మీరు చెప్పిన విషయాన్ని పరిశీలిస్తాం.ఇకపై అలా జరగకుండా చూస్తాం. (సంతృప్తి చెందిన జనం)
రోశయ్య మాస్టారిలో రాజకీయ అనుభవం నిండుగా ఉంది. కానీ లౌక్యమేలేదు. రోశయ్య దీన్ని అలవరుచుకుంటే ఈ నాలుగున్నరేళ్లూ లాగగలుగుతారు. లేకుంటే ఎప్పుడో ఒకప్పుడు అధిష్ఠానం చేతిలో మొట్టికాయ తింటారు. ఇంకో రకంగా చెప్పాలంటే ఈయనలోని మైనస్ గుణమే, జగన్ కు రేపు ప్లస్ గా మారవచ్చు.
-కణ్వస

2 comments:

  1. మీరు ఎలాగోలా జగన్ ను సమర్ధించాలి అని వ్రాస్తున్నట్లు గ ఉన్నది . ముఖ్యమంత్రి ప్రజలను మభ్యపేట్టే ప్రయత్నం చేయకపోవడం మంచి పరిణామమే కదా..ఆయన వచ్చింది సహాయం అందించడానికి మాత్రమే ..విచారణ కు అది సమయము కాదు మరి . YSR చనిపోవడం లోనే సమాచార వ్యవస్థ లోపాలు ఉన్నాయి ...ఇంత వరకు సరిగా విచారించ లేక పోయారు ...

    ReplyDelete
  2. అయితే జనాలను లేపించేస్తూ, YSR లగా గాలిలో ముద్దులేట్టే వాడే రాజకీయాలకు పనికివస్తాడు అని నిర్ధారించేసారన్నమాట. అలాగే కానీయండి. అభినవ బుల్లి రాక్షసుడిని త్వరలో భుజాలమీదకెక్కుంచుకొనే పని మీద అందరం ఉందాం ఏమంటారు!!

    ReplyDelete